షియోమీ (Xiaomi), రియల్మీ (Realme), ఒప్పో (Oppo) వంటి చైనీస్ బ్రాండ్లు (Chinese Brands) తమ బడ్జెట్ ఫోన్స్ను భారతదేశం (India)లో ఇకపై అమ్మడం కుదరదా? అని ప్రశ్నిస్తే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇండియాలో బడ్జెట్ స్మార్ట్ఫోన్ల (Budget Smartphones)ను విక్రయించకుండా షియోమీ, రియల్మీ, ఒప్పో వంటి బ్రాండ్లను నియంత్రించాలని భారత ప్రభుత్వం చూస్తోందని తాజాగా ఒక రిపోర్ట్ పేర్కొంది. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం, రూ.12,000 లోపు స్మార్ట్ఫోన్లను విక్రయించకుండా ఈ బ్రాండ్లను నిలిపివేయాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా దేశీయ మొబైల్ బ్రాండ్ల (Domestic Mobile Brands) బిజినెస్ పెంచడానికి సహాయపడాలని దేశ పాలనా యంత్రాంగం కోరుకుంటోంది.
షియోమీ, రియల్మీ, ఒప్పో వంటి చైనీస్ బ్రాండ్లకు ఇండియాలోని మొబైల్ మార్కెట్లో బడ్జెట్ సెగ్మెంట్లో ఎక్కువ వాటా ఉందనేది కాదనలేని నిజం. ఈ కంపెనీలు నిత్యం భారీ ఎత్తున బడ్జెట్ ఫోన్స్ను రిలీజ్ చేస్తూనే ఉంటాయి. దాంతో దేశీయ మొబైల్స్ విక్రయాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ప్రస్తుతం స్థానిక తయారీదారులపై ఉన్న చైనీస్ బ్రాండ్ల ప్రభావంతో భారత ప్రభుత్వం సంతృప్తిగా లేదని, ఈ సెగ్మెంట్లో ఆ బ్రాండ్ల వ్యాపారాన్ని ఆపేలా నిర్ణయం తీసుకోవచ్చని నివేదిక పేర్కొంది. ఈ చైనీస్ బ్రాండ్ల ప్రవేశమనేది భారతీయ ఫోన్ బ్రాండ్లలో పోటీతత్వం పెంచి బెస్ట్ ఫోన్స్ తీసుకొచ్చేలా, కొత్త స్ట్రాటజీలు అనుసరించేలా చేశాయి. అయితే ఈ ప్రక్రియలో ఇండియన్ ఫోన్ బ్రాండ్లు దేశంలో మార్కెట్ వాటాను దాదాపు పూర్తిగా కోల్పోయాయి. ఇండస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం, గత కొన్ని ఏళ్లుగా ఏ సెగ్మెంట్లోనూ భారతీయ మొబైల్ బ్రాండ్లు టాప్ 10లో లేవు.
దేశీయ బ్రాండ్స్ అయ్యుండి దేశంలో రాణించకపోవడానికి కారణం ఏంటని అడిగితే.. చైనా బ్రాండ్లు తమ గ్లోబల్ సెటప్, ప్రొడక్షన్ ఛానెల్లతో తమకంటే ఒక అడుగు ముందు ఉంటున్నాయని దేశీయ బ్రాండ్లు ఆరోపిస్తున్నాయి. అందుకే చైనీస్ బ్రాండ్ల బడ్జెట్ స్మార్ట్ఫోన్ల విక్రయాలను ఆపేసి.. ఆ మార్కెట్లో దేశీయ బ్రాండ్లు రాణించడానికి ప్రభుత్వం మరింత హెల్ప్ చేయాలని భావిస్తోంది. అలానే, వివిధ రంగాల్లో చైనా కంపెనీల బిజినెస్, కార్యకలాపాలను తగ్గించాలని ప్రభుత్వం చూస్తోంది. ఆ కారణంతోనే Huawei, ZTE వంటి బ్రాండ్లు భారతదేశంలో 5G కార్యకలాపాలలో పాల్గొనడానికి ప్రభుత్వం అనుమతించలేదు. ఈ కంపెనీలకు బదులుగా ఇతర విక్రేతలను చూసుకోవాలని టెలికాం ఆపరేటర్లను కోరింది. ఈ చైనీస్ బ్రాండ్ల విక్రయాలను నిలిపివేయడం చైనా మంత్రిత్వ శాఖలో తీవ్ర అసంతృప్తి నింపవచ్చు. అందుకే మన దేశంలోని తన కంపెనీల కోసం న్యాయమైన అంచనా (Fair Assessment)ను కోరే అవకాశం ఉంది.
భారత ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయం యాపిల్, వన్ప్లస్, శాంసంగ్ వంటి బ్రాండ్లను ప్రభావితం చేసే అవకాశం లేదు. ఎందుకంటే భారతీయ బడ్జెట్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో చైనానే ఎక్కువగా ఆధిపత్యం చెలాయిస్తోంది. తాజా మార్కెట్ రిపోర్ట్స్ ప్రకారం, చైనా కంపెనీలకు ఇండియాలో 80 శాతానికి పైగా వాటా ఉంది. అయితే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే దేశంలోని ఉపాధి రంగంపై ప్రభావం పడొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget smart phone, Oppo, Redmi, Xiaomi