NPCI: ఇండియన్ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ని UPI (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) సమూలంగా మార్చేసింది. కరోనా సమయంలో మొదలైన యూపీఐ పేమెంట్లు(UPI Payments) ఇప్పుడు సర్వసాధారణంగా మారిపోయాయి. ఆన్లైన్ షాపింగ్, ట్రావెల్ బుకింగ్ నుంచి రోడ్ పక్కన చిన్న చిన్న దుకాణాల వరకు యూపీఐ పేమెంట్స్ను స్వీకరిస్తున్నాయి. బ్యాంక్ నుంచి క్షణాల్లో క్యాష్ ట్రాన్స్ఫర్ అవుతుండటంతో యూపీఐ పాపులర్ అయింది. ఇంతగా పాపులర్ అయిన యూపీఐ యాప్లను లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి. ఇటీవల ముంబైలో పెద్ద ఎత్తున యూపీఐ యాప్లను హ్యాక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను NPCI కొట్టిపారేసింది. యూపీఐ యాప్లు ఎలాంటి సమాచారాన్ని లీక్ చేయవని చెబుతూ ఓ ప్రకటన విడుదల చేసింది.
* హ్యాక్ అయ్యే అవకాశం లేదు
'KYC స్కామ్ల'కు సంబంధించిన ఇటీవలి మీడియా కథనాలకు NPCI స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. UPI ద్వారా చేసే ఏ చెల్లింపు అయినా పంపినవారి KYC వివరాలను బహిర్గతం చేయదని లేదా వినియోగదారు మొబైల్ లేదా యాప్ హ్యాక్కి దారితీయదని హామీ ఇచ్చింది. యూపీఐ యాప్లు వర్చువల్ పేమెంట్ అడ్రస్ లేదా UPI IDని ఉపయోగించి పేమెంట్ చేస్తాయని, మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి డివైజ్ బైండింగ్ సెక్యూర్ మెథడ్ని, యూపీఐ పిన్ని ఉపయోగిస్తాయని తెలిపింది.
UPI ట్రాన్సాక్షన్ సమయంలో KYC వివరాలు ఉపయోగించదని, ఎవ్వరికీ షేర్ చేసే అవకాశం లేదని స్పష్టం చేసింది. UPI సెక్యూర్ పేమెంట్ సిస్టమ్గా కొనసాగుతుందని NPCI ప్రజలకు భరోసా ఇచ్చింది. దేశవ్యాప్తంగా విస్తృతంగా అవలంబిస్తున్న పేమెంట్ సిస్టమ్ గురించి తప్పుదారి పట్టించడం, అపనమ్మకం సృష్టించడం ఈ కథనాలు, సోషల్ మీడియా పోస్ట్ల ఉద్దేశమని పేర్కొంది.
UPI: రూ.2,000 కంటే ఎక్కువ UPI పేమెంట్స్పై ఛార్జీలు..కొత్త రూల్ లో బిగ్ ట్విస్ట్ ఇదే!
* వైరల్ అవుతున్న UPI స్కామ్?
యూపీఐ స్కామ్లో ముంబైలో 81 మంది నుంచి రూ.కోటి పైగా దోచుకున్నట్లు కొన్ని నివేదికలు వచ్చాయి. FIR, బాధితుల వివరాల ప్రకారం.. స్కామర్లు యూపీఐ యాప్ల నుంచి వ్యక్తులకు డబ్బు పంపుతున్నారు. ఆ తర్వాత పొరపాటున డబ్బు పంపామని, తిరిగి పంపాలని కోరుతున్నారు. ఎవరైనా డబ్బును తిరిగి పంపిన వెంటనే, స్కామర్లు వారి UPI అకౌంట్ను హ్యాక్ చేసి నేరుగా వారి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బును దొంగిలిస్తున్నారు. బాధితుడు UPI యాప్ని ఉపయోగించి డబ్బును తిరిగి పంపినప్పుడు, మాల్వేర్ బాధితుడి డివైజ్లోకి చేరుతుందని, స్కామర్కి బ్యాంక్, KYC వివరాలు, PAN, ఆధార్ వంటి డేటాను అందిస్తోందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ సమాచారంతో స్కామర్ బాధితుడి బ్యాంక్ అకౌంట్లో డబ్బును స్వాహా చేస్తున్నట్లు తెలిపాయి.
* ఫోన్పే కీలక ప్రకటన
యూపీఐ స్కామ్ వైరల్ అవుతున్న తరుణంలో ఫోన్ పే స్పందించింది. UPI గేట్వేలు సురక్షితంగా ఉన్నాయని, స్కామర్లు ట్రాన్సాక్షన్ వివరాలను చూడటం ద్వారా సెన్సిటివ్ డేటాను హ్యాక్ చేయలేరని స్పష్టం చేసింది. స్కామ్ నిజమని నమ్మట్లేదని తెలిపింది. ఎందుకంటే ఒక యూజర్ UPI యాప్లో వారి బ్యాంక్ అకౌంట్ను లింక్ చేసినప్పుడు, బ్యాంక్ KYC సమాచారాన్ని యూపీఐ కంపెనీలకు అందించదని పేర్కొంది. డేటా లీక్ అయ్యే అవకాశమే లేదని చెప్పింది. రిసీవర్కు అందుబాటులో ఉండే సమాచారం కేవలం ట్రాన్సాక్షన్ UTR నంబర్ మాత్రమేనని పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.