గతకొంత కాలంగా ఇండియాలో ఎటువంటి ఆపరేషన్స్ లేకుండా 2000 మంది ఉద్యోగులను పోషించటం కుదరదంటూ టిక్ టాక్ సంస్థ తన ఉద్యోగులందరినీ ఇంటికి పంపింది. మనదేశంలో టిక్ టాక్ శాశ్వతంగా నిషేధానికి గురి కావటంతో చేసేది లేక టిక్ టాక్ సంస్థ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఉద్యోగులందరికీ మెయిల్ పంపిన టిక్ టాక్ యాజమాన్యం న్యూ ఇయర్ లో పెద్ద షాక్ ఇచ్చింది. నిజానికి టిక్ టాక్ బ్యాన్ అయినప్పటి నుంచీ మనదేశంలోని టిక్ టాక్ ఉద్యోగుల్లో అనిశ్చితి కొనసాగుతోంది. టిక్ టాక్ మాతృసంస్థ అయిన Byte Dance ఉద్యోగులకు తాము ముందుగా ఊహించనట్టే ఉద్యోగాలు ఊడాయి. మొత్తం ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నది అన్న విషయాలు అధికారికంగా ఇంకా తేలనప్పటికీ కీలకమైన కొందరు అధికారులు, ఉద్యోగులు తప్ప మిగతా వారందరినీ తీసేస్తున్నట్టు తెలుస్తోంది.
సరైన సమాధానాలు లేనందుకే..
టిక్ టాక్ తో పాటు నిషేధానికి గురైన పలు యాప్ ల యాజమాన్యాలు ఇచ్చిన తాజా సమాధానంతో కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ సంతృప్తి చెందకపోవటమే దీనికంతా కారణం. సమాచార సేకరణ, సమాచార ప్రాసెసింగ్, సమాచార భద్రత, గోప్యత వంటి విషయాలపై కేంద్ర ప్రభుత్వం అడిగిన ప్రశ్నలకు సంస్థలు సరైన సమాధానం చెప్పలేదని, దీంతో 59 యాప్ లపై శాశ్వత నిషేధం విధించాల్సి వచ్చిందని ఓ అధికారి చెప్పారు. నిషేధానికి గురైన యాప్ లలో షేర్ ఇట్, లైకీ, వీబో, షావోమీ ఎంఐ కమ్యూనిటీ, బిగో లైవ్ వంటి యాప్ లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గతేడాది జూన్ లోమొత్తం 267 యాప్ లపై కేంద్రం నిషేధం విధించింది. మిలియన్ల యూజర్లు, ఆర్టిస్టులు, స్టోరీ-టెల్లర్స్, ఎడ్యుకేటర్స్, పర్ఫార్మర్స్ ఉన్న ఇండియాలో టిక్ టాక్ ను తిరిగి రీలాంచ్ అయ్యే రోజుల కోసం తాము ఎదురుచూస్తున్నట్టు ఉద్యోగులకు పంపిన మెయిల్ లో సంస్థ పేర్కొంది.
నోటీసులు..
భారత సార్వభౌమత్వం, సమగ్రత, భారత రక్షణ, దేశ, ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నాయన్న కారణంతో ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ ప్రకారం వాటిని నిషేధించింది. వివరణ ఇవ్వాలని యాప్ లకు నోటీసులు ఇచ్చింది. టిక్ టాక్, యూసీ బ్రౌజర్, వీచాట్, బైడూ, కామ్ స్కానర్, క్లబ్ ఫ్యాక్టరీ వంటి 59 యాప్స్ ను వాడుతున్న ఇండియన్ల సమాచారానికి ఎలాంటి భద్రత లేకపోగా మన యూజర్లపై చైనా సంస్థలు నిఘా పెట్టాయి. టిక్ టాక్ అంటే మనదేశంలో పెద్ద ఎత్తున ఫాలోయింగ్ ఉండగా తాజా వార్తతో టిక్ టాకర్లకు బ్యాడ్ న్యూస్ గా మిగిలింది.
ఇండో-చైనా ఘర్షణలే కారణం..
లడఖ్ లోని సరిహద్దుల వద్ద ఘర్షణ వాతావరణం నెలకొనగా.. కర్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు ఈ ఘర్షణల్లో అమరులయ్యారు. దీంతో మొత్తం వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని.. మన దేశ ప్రజల డేటా తీసుకుంటున్న చైనా కంపెనీలపై వేటు వేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India-China, Indo China Tension, Tiktok