Data Transfer: యాపిల్ ప్రొడక్ట్స్కి ఏ దేశ మార్కెట్లోనైనా ఎదురులేదు. చైనాలో కూడా వీటి మార్కెట్ వాటా అధికంగానే ఉంటుంది. అయితే ఆ దేశంలో పెరుగుతున్న యాపిల్ మార్కెట్ వాటాను చూసి చైనీస్ కంపెనీలు తట్టుకోలేకపోతున్నాయి. అందుకే యూజర్లను తమ వైపు తిప్పుకునేందుకు సరికొత్త టెక్నాలజీలను తమ ప్రొడక్ట్స్లో అందిస్తున్నాయి. ఇందులో భాగంగా దిగ్గజ చైనీస్ బ్రాండ్స్ ఒప్పో (OPPO), వివో (Vivo), షియోమీ (Xiaomi).. తమ ఫోన్ల మధ్య డేటా ట్రాన్స్ఫర్ సులభంగా చేయడానికి ప్రణాళికలు వేస్తున్నాయి. ఇందుకు కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టనున్నాయి.
ఈ కొత్త టెక్నాలజీ సాయంతో యూజర్లు తమ సిస్టమ్, యాప్ డేటాను ఈ బ్రాండ్లలో దేనికి చెందిన కొత్త హ్యాండ్సెట్కైనా చాలా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చని ఈ మూడు స్మార్ట్ఫోన్ సంస్థలు వీబో వేదికగా తాజాగా ప్రకటించాయి. అంటే ఒక యూజర్ OPPO ఫోన్ నుంచి Vivo ఫోన్కు మారితే.. వారు తమ డేటా మొత్తాన్ని కొత్త ఫోన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. వినియోగదారులు ఈ బ్రాండ్ల మధ్య మారడాన్ని సులభతరం చేయడంతో పాటు చైనా మార్కెట్లో యాపిల్తో పోటీ పడడానికి ఈ కంపెనీలు కొత్త పీర్-టు-పీర్ ట్రాన్స్మిషన్ అలయన్స్ టెక్నాలజీని పరిచయం చేయనున్నాయి.
సాధారణంగా కొత్త స్మార్ట్ఫోన్కి మారడం చాలా శ్రమతో కూడుకున్న పని. ఎందుకంటే కొత్త ఫోన్ కొన్నప్పుడు డేటాను పాత ఫోన్ నుంచి కొత్తదానికి మైగ్రేట్ చేయాలి. ఇది చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఒకే బ్రాండ్ ఫోన్లను మార్చినప్పుడు పెద్ద సమస్య ఉండదు కానీ వేరువేరు బ్రాండ్ల ఫోన్లను కొనుగోలు చేసినప్పుడే చాలా ఇబ్బంది ఎదురవుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికే, ఈ టాప్ 3 చైనీస్ కంపెనీలు కొత్త పరిష్కారాన్ని తీసుకురానున్నాయి.
2019లో ఒప్పో , వివో , షియోమీ తమ యూజర్లు డివైజ్ల మధ్య వైర్లెస్గా డేటాను బదిలీ చేయడానికి అనుమతించే సాంకేతికతను రూపొందించాయి. ఇది యాపిల్ AirDrop వలె పని చేస్తుంది. నిజానికి చైనా దేశంలో విక్రయించే స్మార్ట్ఫోన్లలో గూగుల్ డ్రైవ్ అందించరు. దీనివల్ల వారికి గూగుల్ డ్రైవ్ అందుబాటులో లేక, డేటాను బ్యాకప్ చేయడం కుదరక చాలా మంది చైనీస్ వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. తమ డేటాను డివైజ్ల మధ్య బదిలీ చేయడానికి థర్డ్-పార్టీ యాప్లపై ఆధారపడుతున్నారు. యాపిల్ ఐఫోన్ యూజర్లు మాత్రం iCloud లేదా బ్లూటూత్, Wi-Fi కనెక్షన్ని ఉపయోగించి కొత్త iOS డివైజ్కి తమ డేటాను సులభంగా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు.
షియోమీ, వివో, ఒప్పో చైనా స్మార్ట్ఫోన్ల మార్కెట్లో దాదాపు సగం వాటాతో అక్కడ లీడర్స్గా కొనసాగుతున్నాయి. అయితే కరోనా కారణంగా, చైనా 2022లో స్మార్ట్ఫోన్ అమ్మకాలలో క్షీణతను చవిచూసింది. 2023 మాత్రం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇక కొత్త డేటా ట్రాన్స్ఫర్ ఫీచర్ చైనాలో మాత్రమే అందుబాటులో ఉంటుందని గ్లోబల్ మార్కెట్లో రిలీజ్ కాదని ఒప్పో కంపెనీ వెల్లడించింది. ఇది గ్లోబల్ యూజర్స్కి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.