PROFITING OFF HATE FACEBOOK ENGINEER RESIGNS FROM COMPANY SK
Facebook: ఫేస్బుక్కు ఊహించని షాక్.. ఇదే నా ఆఖరి రోజు
ప్రతీకాత్మక చిత్రం
ఐదున్నరేళ్ల ప్రయాణం తర్వాత ఫేస్బుక్లో ఇదే నా ఆఖరి రోజు అని ఆయన పేర్కొన్నారు. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ద్వేష భావన నుంచి లాభం పొందాలనుకుంటున్న సంస్థలో పనిచేయడం ఇష్టం లేదని తెలిపారు
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విమర్శలు ఎదుర్కొంటోంది. కొందరు విద్వేషాలు రెచ్చగొడుతున్నా ఫేస్బుక్ పట్టించుకోవడం లేదని.. డబ్బుల కోసం చూసీ చూడనట్లు వదిలేస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఫేస్బుక్కు ఈ సంస్థ ఇంజినీర్ ఒకరు రాజీనామా చేశారు. విద్వేషం నుంచి లాభాలు పొందుతోందని.. ఫేస్బుక్ సరైన మార్గంలో నడవడం లేదంటూ యువ ఇంజినీర్ అశోక్ చంద్వాని (28) ఈ సంస్థకు గుడ్బై చెప్పారు. ఐదున్నరేళ్ల ప్రయాణం తర్వాత ఫేస్బుక్లో ఇదే నా ఆఖరి రోజు అని ఆయన పేర్కొన్నారు. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ద్వేష భావన నుంచి లాభం పొందాలనుకుంటున్న సంస్థలో పనిచేయడం ఇష్టం లేదని తెలిపారు.
అశోక్ చంద్వాని
విద్వేష పూరిత, అసత్య సమాచార ప్రచారాన్ని నియంత్రించాల్సిందిగా హక్కుల ఉద్యమకారులు, సామాజిక కార్యకర్తలు కోరినా ఫేస్బుక్ తగిన చర్యలు తీసుకోవడం లేదని అశోక్ అభిప్రాయపడ్డారు. దీనిపై సంస్థ ప్రతినిధి లిజ్ బర్గేయస్ స్పందించారు. ఫేస్బుక్ ఎప్పుడూ విద్వేషం వల్ల లాభం పొందలేదని.. పైగా సామాజిక భద్రత కోసం మిలియన్ల డాలర్లు వెచ్చించినట్టు ఆమె తెలిపారు. నిపుణుల సూచనల మేరకు రాజకీయాలు, తదితర అంశాలకు సంబంధించి మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నామని వివరించారు. ఎలాంటి ఫిర్యాదులు అందనప్పటికీ మిలియన్ల కొద్దీ విద్వేష పూరిత పోస్టులను తొలగించామని స్పష్టం చేశారు.
కాగా, ఇటీవల ఫేస్బుక్కు సంబంధించి వాల్స్ట్రీట్ జనరల్ సంచలన కథనాన్ని ప్రచురించించిన విషయం తెలిసిందే. ఫేస్బుక్లో బీజేపీ నేతలు చేసే విద్వేషపూరిత వ్యాఖ్యలు, ప్రసంగాలను ఆ సంస్థ చూసీచూడనట్లు వదిలేస్తూ.. చర్యలు తీసుకోవడం లేదంటూ ‘ది వాల్స్ట్రీట్ జర్నల్’ సంచలన కథనం రాసింది. భారత్లో తమ వ్యాపార లావాదేవీలు దెబ్బతినకుండా ఉండేందుకే ఫేస్బుక్ అలా చేస్తోందని ఆ కథనంలో పేర్కొంది.
బీజేపీ నేతల విద్వేష పూరిత ప్రసంగాలపై చర్యలు తీసుకోవడం వల్ల దేశంలో మన బిజినెస్ దెబ్బతినే ప్రమాదముందని ఫేస్బుక్ ప్రతినిధి అంఖీ దాస్ ఉద్యోగులతో అన్నట్లు వాల్స్ట్రీట్ జనరల్ పేర్కొంది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్తో పాటు మరో ముగ్గురు బీజేపీ నేతల విద్వేషపూరిత ప్రసంగాలు చర్యలు తీసుకునే స్థాయిలో ఉన్నాయని ఫేస్బుక్ ఉద్యోగులు గుర్తించినా చర్యలు తీసుకోలేదని ఆ కథనం వెల్లడించింది. దానిపై మనదేశంలో తీవ్ర దుమారం రేగింది. బీజేపీని, ఫేస్బుక్ను టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఇలా అన్ని వర్గాల నుంచి ఒత్తిడి పెరగడంతో బీజేపీ ఎమ్మెల్యేను నిషేధిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది ఫేస్బుక్.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.