దేశంలో పరిశ్రమల ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. మేకిన్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా ఇప్పటికే ఉన్న పరిశ్రమలను మరింత ప్రోత్సహించేందుకు, కొత్త పరిశ్రమల స్థాపనకు మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రోగ్రామ్లో భాగంగా ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ఫోన్స్ కోసం భారత్ను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తాజాగా ప్రతిఫలం దక్కింది. వివో, ఒప్పో, షియోమి వంటి చైనా అగ్రశ్రేణి మొబైల్ తయారీ కంపెనీలు భారత్లో తయారు చేసిన డివైజ్లను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడానికి తాజాగా అంగీకరించాయి.
ఇప్పటికే ఎగుమతుల్లో యాపిల్ , శామ్సంగ్
చైనీస్ కంపెనీలు మేడ్-ఇన్-ఇండియా స్మార్ట్ఫోన్లను ఎగుమతి చేయడానికి అంగీకరించడంతో ఇకపై తమ మ్యానుఫ్యాక్చరింగ్ వ్యూహంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే యాపిల్, శాంసంగ్ కంపెనీలు భారత్ నుంచి తమ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. తాజాగా మూడు అగ్రశ్రేణి చైనీస్ కంపెనీలు భారత్ నుంచి ఎగుమతులు ప్రారంభించడానికి విస్తృతమైన ప్రణాళికలను ఖరారు చేశాయని, భారత్ పొరుగు దేశాలకు మాత్రమే కాకుండా ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా, ఐరోపా దేశాలకు కూడా ఎగుమతులు చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శామ్సంగ్ ఈ ఏడాది ఏప్రిల్ - అక్టోబర్ మధ్య కాలంలో 2.8 బిలియన్ల డాలర్ల విలువైన ఫోన్లను ఎగుమతి చేసింది. భారతదేశంలోని Foxconn, Wistron, Pegatron వంటి కర్మాగారాల్లో iPhoneలను తయారు చేస్తున్న యాపిల్ కంపెనీ 2.2 బిలియన్ల డాలర్ల విలువైన డివైజ్లను ఎగుమతి చేసింది.
ఎగుమతులకు కేంద్రం ఒత్తిడి
భారత్లో స్థానికంగా ఉత్పత్తి అయ్యే ప్రొడక్ట్స్కు మాత్రమే ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) ప్రోగ్రామ్ ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం అందించడం, మరోపక్క ఎగుమతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు పెరగడంతో కంపెనీలు తమ ఎగుమతుల వ్యూహంలో మార్పులు చేసుకుంటున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. పీఎల్ఐ రూట్లో కూడా చైనా పెట్టుబడులకు అప్రూవల్ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసింది.
15 మిలియన్ డాలర్ల విలువైన ప్రొడక్ట్స్ బ్లాక్
భారత్ నుంచి ఎగుమమతుల సామర్థ్యాన్ని వివో ఇప్పటికే టెస్ట్ చేయడం ప్రారంభించింది. అయితే ఎగుమతుల కోసం ఉద్దేశించిన కంపెనీకి చెందిన 15 మిలియన్ డాలర్ల విలువైన ప్రొడక్ట్స్ను డీఆర్ఐ బ్లాక్ చేసింది. ఉత్పత్తి చేసిన డివైజ్లు, వాటి విలువకు సంబంధించి తప్పు సమాచారం ఇవ్వడం కారణంగా వివోపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్యలు భారత్ నుంచి ఎగుమతులను ప్రారంభించడానికి తమ విస్తృత ప్రణాళికలకు ఎలాంటి భంగం వాటిల్లదని వివో బలంగా విశ్వసిస్తోంది. ఒప్పొ, షియోమీ కూడా కూడా భారత్ నుంచి ఎగుమతులు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.
ఎగుమతుల పరిధిని విస్తృతం చేస్తాం
షియోమి ఇండియా హెడ్ మురళీకృష్ణన్ మాట్లాడుతూ.. తాము ఎగుమతి ప్రణాళికలను పటిష్టం చేస్తున్నామని తెలపారు. 2025-26 నాటికి భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే ప్రభుత్వ దార్శనికతకు తమ వంతు కృషి చేస్తామన్నారు. భారత్లో తయారీ అయిన తమ ప్రొడక్ట్స్ను ఇప్పటివరకు నేపాల్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాలకు ఎగుమతి చేస్తున్నామని, వాటి పరిధి పెంచడానికి వ్యయ సవాళ్లు, ప్రపంచ స్థూల ఆర్థిక కారకాలు వంటి వాటిని అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: New smartphone, Oppo, Vivo, Xiomi