టెక్ ప్రపంచంలో వారం గడిచింది... అంటే మనం ఈ వారంలో ఏయే గ్యాడ్జెట్లు వచ్చాయి, వాటి ప్రత్యేకతలేంటి, ధర ఎంత లాంటి వివరాలు తెలుసుకోవాల్సిందే కదా. ఈ వారంలో యాపిల్, వన్ప్లస్, షియోమి, రియల్మి లాంటి సంస్థలు తమ ప్రోడక్ట్లను లాంచ్ చేశాయి. అవేంటో చూసేద్దాం. యాపిల్ డివైజ్ల బ్రాండ్ విలువతో పాటు ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. దాంతోపాటే ఫీచర్లు కూడా మెరుగ్గా ఉంటాయి. అయితే మొత్తం యాపిల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఐపాడ్ను సంస్థ గత వారం లాంచ్ చేసింది. ఐప్యాడ్ సిరీస్లో ఐప్యాడ్ ప్రోను లాంచ్ చేసింది. ఇందులో ఎం1 ప్రాసెసర్ ఇచ్చారు. 11 అంగుళాలు, 12.9 అంగుళాల సైజుతో రెండు ఐప్యాడ్లను తీసుకొచ్చారు. వీటి ప్రారంభ ధర ₹71,900.
-ఐఫోన్ అభిమానులకు మరో శుభవార్త. గత వారం మరో ఆసక్తికరమైన ప్రొడక్ట్ను సంస్థ విడుదల చేసింది. ఐఫోన్ 12 సిరీస్ను కొత్త రంగుల్లో తీసుకొచ్చింది యాపిల్. పర్పుల్ కలర్ ఐఫోన్ 12, ఐఫోన్ 12 మినీని గత వారం లాంచ్ చేసింది. ముందువైపు సెరామిక్ షీల్డ్ ఉంటుంది. ఇందులో ఏ14 బయానిక్ చిప్ను అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బ్లూ, గ్రీన్, బ్లాక్, వైట్ కలర్లో ఈ మొబైల్స్ వస్తుండగా ఇప్పుడు పర్పుల్ కలర్లో కూడా రావడం విశేషం.
-₹1,19,900 ధరతో యాపిల్ కొత్త ఐమ్యాక్ను తీసుకొచ్చింది. ఇందులో 24 అంగుళాల 4.5 కె రెటీనా డిస్ప్లే ఇస్తున్నారు. 1080పీ పేస్టైమ్ హెచ్డీ కెమెరా ఉంది. ఈ మ్యాక్లో యూజర్లు 4కె వీడియో, ఇమేజెస్ను చాలా వేగంగా ఎడిట్ చేసుకోవచ్చని యాపిల్ చెబుతోంది. ఇందులో ఆరు స్పీకర్ల సౌండ్ సిస్టమ్ ఉంటుంది.
-చాలా రోజుల నుంచి తీసుకొస్తాం అని యాపిల్ చెబుతూ వస్తున్న ఎయిర్ ట్యాగ్స్ తాజాగా విడుదలయ్యాయి. ₹3,190 ధరతో ఈ ఎయిర్ ట్యాగ్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఇందులో బిల్ట్ ఇన్ స్పీకర్ ఉంటుంది. ఐపీ 67 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఈ ట్యాగ్తో మీ డివైజ్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు.
-యాపిల్ ఏ12 బయానిక్ చిప్తో యాపిల్ టీవీ 4కె బాక్స్ను కూడా లాంచ్ చేసింది. దీని ధర ₹18,900. హెచ్డీఆర్, డాల్బీ విజన్ వీడియో సదుపాయం ఇందులో ఉంది.
-షియోమి కూడా గత వారంలో ఖరీదైన మొబైల్ను మన దేశంలో విడుదల చేసింది. ఎంఐ అల్ట్రా పేరుతో సరికొత్త మొబైల్ను లాంచ్ చేసింది. దీని ధర ₹69,999. ఇందులో క్వాల్కోమ్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంటుంది. 6.81 మెయిన్ డిస్ప్లే, వెనుకవైపు 1.1 అంగుళాల సెకండరీ డిస్ప్లే కూడా ఇస్తున్నారు.
-షియోమి నుంచి ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11 ఎక్స్ ప్రో కూడా గత వారంలోనే వచ్చాయి. 11 ఎక్స్ ప్రోలో స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసరే ఇస్తున్నారు. అయితే 11 ఎక్స్లో స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్, 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీప్లస్ స్క్రీన్ ఉన్నాయి.
-పోకో నుంచి ఎం2 రీలోడెడ్ పేరుతో కొత్త మొబైల్ గత వారం విడుదలైంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ దీని సొంతం. దీని ధర ₹9,499. ఇందులో మీడియాటెక్ హీలియో జీ80 ప్రసెసర్ ఉంది.
-మొబైల్స్తోపాటు షియోమి ఓ టీవీని కూడా లాంచ్ చేసింది. 75 అంగుళాల స్క్రీన్ ఉండే ఈ టీవీ ఆండ్రాయిడ్ 10తో పని చేస్తుంది. 30 వాట్ సామర్థ్యం ఉన్న ఆరు స్పీకర్లు ఉంటాయి. ఈ టీవీ రిఫ్రెష్ రేట్ 120 హెర్జ్గా ఉంటుంది. దీని ధర ₹1,19,999.
-ఫైర్ టీవీ స్టిక్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్ను కలిపి అమెజాన్ ఫైర్ టీవీ క్యూబ్ 2ను గతవారమే లాంచ్ చేసింది. దీని ధర ₹12,999. ఫైర్ టీవీ క్యూబ్ కంటే ఇందులో మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లు అందించారు. యాపిల్ టీవీ 4కెకు పోటీగా అమెజాన్ ఈ టీవీ క్యూబ్ను లాంచ్ చేసింది.
-వన్ప్లస్ నుంచి కూడా గత వారం కొత్త గ్యాడ్జెట్ వచ్చింది. గేమర్స్ కోసం ప్రత్యేకంగా గేమింగ్ ట్రిగ్గర్స్ను లాంచ్ చేసిది. కాల్ ఆఫ్ డ్యూట్,ఫ్రీ ఫైర్ లాంటి వార్ గేమ్స్, షూటర్ గేమ్స్ ఆడేటప్పుడు ఈ ట్రిగ్గర్స్ ఉపయోగపడతాయి. వీటి ధర ₹1,099. ఇవి అన్ని రకాల ఆండ్రాయిడ్ ఫోన్స్, ఐఫోన్స్కు పని చేస్తాయని వన్ ప్లస్ చెబుతోంది.
-రియల్మి నుంచి గత వారంలో 5జీ ఫోన్ వచ్చింది. రియల్మీ 8 పేరుతో వచ్చిన ఈ మొబైల్ ధర ₹14,999. ఇందులో మీడియాటెక్ డైమన్సిటీ 700 5జీ ప్రాసెసర్ ఇచ్చారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ మొబైల్ ప్రత్యేకత. 6.5 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. రియల్మీ 8 ప్రోలో కొత్త కలర్ వేరియంట్ను తీసుకొచ్చింది. ఇల్యుమనేటింగ్ ఎల్లో పేరుతో ఈ మొబైల్ ఆసక్తికరంగా కనిపిస్తోంది. దీని ధరలు ₹17,999, ₹18,999గా ఉన్నాయి.
-మోటో నుంచి గత వారం రెండు మొబైల్స్ వచ్చాయి. మెటో జీ60, జీ 40పేరుతో రెండు మొబైల్ష్ ఇండియాలో లాంచ్ చేసింది. జీ60లో 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఉంటాయి. ఇందులో స్నాప్డ్రాగన్ 732 ప్రాసెసర్ ఇస్తున్నారు. ఇది 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇక జీ40 విషయానికొస్తే ఇది రెండు వేరియంట్లలో వస్తుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ వెర్షన్ ఒకటి, 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ ఒకటి ఉన్నాయి. వీటి ధరలు వరుసగా ₹13,999.. ₹15,999.
-ఒప్పో కూడా గత వారం ఒక 5జీ మొబైల్ను తీసుకొచ్చింది. దాంతోపాటు 4జీ మొబైల్ కూడా లాంచ్ చేసింది. ఒప్పో ఏ74 5జీ మొబైల్ కాగా, ఏ54 అనేది 4జీ మొబైల్. ఏ54లో మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్ 6.5 ఇంచ్ హెచ్డీప్లస్ స్క్రీన్ ఉంటుంది. దీని ధర ₹15 వేలు లోపు ఉంటుంది. అదే ఏ74 5జీ ఫోన్లో అయితే స్నాప్డ్రాగన్ 480 ప్రాసెసర్ ఇస్తున్నారు. ఇందులో 90 హెర్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఉండనుంది. ఈ మొబైల్ ధర ₹17,990.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.