సోషల్ మీడియా వల్ల సమాజానికి మేలు జరుగుతోందా? చెడు జరుగుతోందా? అంటే చెప్పడం కష్టం. రెండు వాదనలను సమర్థిం చుకునేందుకు ఉదాహరణలు ఉన్నాయి. అయితే తాజాగా ఇన్స్టాగ్రామ్ (Instagram) సహ-వ్యవస్థాపకుడు కెవిన్ సిస్ట్రోమ్ (Kevin Systrom) తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టెక్ జర్నలిస్ట్ కారా స్విషర్తో జరిగిన ఇంటర్వ్యూలో ఈ ఫొటో షేరింగ్ ప్లాట్ఫామ్ గురించి ఆయన మాట్లాడుతూ.. స్నేహితులు, కుటుంబ సభ్యులు కనెక్ట్ అయ్యే వేదికగా ఉండాల్సిన ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు అలా లేదని వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు, బిజినెస్ల కోసం ఒక మార్కెట్గా మారిందని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ యాప్ దాని అసలు సారాన్ని కోల్పోయిందని.. క్రియేటర్స్, సెల్లర్స్ డబ్బు సంపాదించడానికే పనికొస్తుందని చెప్పుకొచ్చారు. మొత్తంగా ఇన్స్టాగ్రామ్ కమర్షిలైజేషన్పై విచారం వ్యక్తం చేశారు.
సమాజంపై ప్రతికూల ప్రభావం?
కెవిన్ ప్రకారం, ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ బిజినెస్లు, ఆర్టిస్టులు, పార్ట్నర్షిప్స్, యాడ్స్ ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ఆయన మాట్లాడుతూ, "యాప్తో ఉన్న సమస్య ఏమిటంటే, ఇది వాస్తవికత కంటే కమర్షిలైజేషన్, క్రియేటర్స్, డీల్లు, ప్రకటనలపై దృష్టి సారించే వ్యక్తులకు రివార్డ్ను అందిస్తుంది. తత్ఫలితంగా, చాలా మంది వినియోగదారులు పర్ఫెక్ట్, అతి విలాసవంతమైన లైఫ్ను చూపించాలనే ఒత్తిడికి గురవుతారు, ఇది ఇతరులకు భయం కలిగించవచ్చు." అని అన్నారు.
ఆయన ప్రకారం ఇది సమాజంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ఈ ఫొటో షేరింగ్ ప్లాట్ఫామ్ విలాసవంతమైన జీవితాలను గడిపే వ్యక్తులనే హైలెట్ చేయడం వల్ల ఇన్స్టాగ్రామ్లో తాము చూసేది ప్రజల నిజ జీవితమని యూజర్లు భావించొచ్చు. వాస్తవానికి నిజ జీవితంలో ఎవరూ కూడా ఇలాంటి లైఫ్ లీడ్ చేయరని కెవిన్ వివరించారు. ఈ యాప్ వల్ల ప్రతి ఒక్కరూ ఎలాంటి సమస్యలు లేకుండా జీవితాన్ని గడుపుతున్నారని సామాన్య యూజర్లు భావించి డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉందన్నారు. ప్రతిదానిలో ఉత్తమంగా ఉండటానికి కూడా ప్రయత్నించి సమయం వృథా చేసుకోవచ్చని అభిప్రాయపడ్డారు.
కేవలం యాడ్స్ పోస్ట్ చేస్తున్నారు
కెవిన్ ఇంకా మాట్లాడుతూ ఇన్స్టాగ్రామ్లో తనకు తెలిసిన కొందరు వ్యక్తులు రియల్-లైఫ్ ఫొటోలను పోస్ట్ చేయడం లేదని, కేవలం ప్రకటనలు ఉన్న పోస్టులు మాత్రమే పెడుతున్నారు అన్నారు. ఇన్స్టాగ్రామ్ మారిపోయిందని, ఇకపై ఇది తాము ప్రారంభించిన యాప్లా ఉండబోదని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. దీనికి బదులుగా BeReal అనే కొత్త యాప్ను యూజర్లు వాడటం మంచిదని పేర్కొన్నారు. BeReal యాప్లో ప్రజలు తమంతట తాముగా, నిజమైన ఫొటోలను పోస్ట్ చేయవచ్చని వివరించారు. ఇక కెవిన్ సిస్ట్రోమ్ ఫేస్బుక్ CEOతో విభేదాల కారణంగా 2018లో ఇన్స్టాగ్రామ్ను విడిచిపెట్టారు. అతను 2012లో ఇన్స్టాగ్రామ్ను ఫేస్బుక్కు 1 బిలియన్ డాలర్లకు విక్రయించారు. ఇప్పుడు ఆర్టిఫ్యాక్ట్ అనే న్యూస్ యాప్లో పనిచేస్తున్నారు.
ఇక ఇన్స్టాగ్రామ్ కొంతకాలం క్రితం టిక్టాక్కి పోటీగా రీల్స్ ఫీచర్ పరిచయం చేసి ఎక్కువ మంది యూజర్లను ఆకట్టుకుంటోంది. రీల్స్లో నిత్యం కొత్త ఫీచర్లను యాడ్ చేస్తూ క్రియేటర్స్, యూజర్లకు మంచి అనుభూతిని అందిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Instagram