దేశ ప్రజలందరికీ ఆధార్ కార్డు తప్పనిసరిగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలను పొందాలన్నా, బ్యాంక్ అకౌంట్లు, సిమ్ కార్డు వంటివి తీసుకోవాలన్నా.. ఆఖరికి కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరిగా అయింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) జారీ చేసే ఈ కార్డుతో అనేక ప్రయోజనాలున్నాయి. మరి, ఆ ప్రయోజనాలను పొందాలంటే మీ ఆధార్ నెంబర్కు మొబైల్ నెంబర్ లింక్ తప్పనిసరి అనే విషయం తెలిసిందే. దీని కోసం ఇదివరకు లాగా సుదీర్ఘమైన ప్రక్రియ అవసరం లేదు. ప్రస్తుతం, ఎటువంటి ఫిజికల్ పత్రాలు సమర్పించాల్సిన అవసరం లేకుండానే సులభంగా మీ ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ను లింక్ చేయవచ్చు. మీ సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించి మీ ఆధార్ కార్డులో వివరాలను అప్డేట్ చేయవచ్చు. ఆధార్తో మొబైల్ నెంబర్ లింక్ కోసం ఫోటో, బయోమెట్రిక్ లేదా ఈ–మెయిల్ ఐడి వంటి ఎటువంటి పత్రాలు అవసరం లేదని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల తన ట్వీట్లో పేర్కొంది. మీ సమీపంలోని ఆధార్ కేంద్రంలో ముందుగానే అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని స్పష్టం చేసింది. దీని కోసం రూ.50 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.
ఆధార్తో మెబైల్ నంబర్ లింక్ వల్ల కలిగే ప్రయోజనాలు
1. ఆన్లైన్ ద్వారా సులభంగా అనేక సేవలను పొందడానికి, మీ మొబైల్ నంబర్ను UIDAIలో నమోదు చేసుకోవాలని గుర్తించుకోండి.
2. ఆన్లైన్ మోడ్లో మీ ఆధార్ వివరాలను అప్డేట్ చేయాలనుకుంటే, మీ మొబైల్ నంబర్ను ఆధార్తో లింక్ చేయాల్సి ఉంటుందని గుర్తించుకోండి.
3. ఆధార్తో మొబైల్ నెంబర్ లింక్ చేస్తే, మీ ఈ–ఆధార్ కాపీని సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ చేసిన మొబైల్ నంబర్కు పంపబడే OTP ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
ఆధార్ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉండే సేవలు..
కొత్తగా ఆధార్ నమోదు, పేరులో తప్పులుంటే సవరణ చేయడం, అడ్రస్ అప్డేట్, మొబైల్ నంబర్ అప్డేట్, ఈ–మెయిల్ ID అప్డేట్, పుట్టిన తేదీ (DOB) అప్డేట్, జెండర్ అప్డేట్, బయోమెట్రిక్ (ఫోటో + వేలిముద్రలు + ఐరిస్) అప్డేట్ వంటి సేవలు పొందవచ్చు.