కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన కొత్త ఐటీ రూల్స్కు సంబంధించి వాట్సాప్, భారత ప్రభుత్వం మధ్య యుద్ధం నడుస్తోంది. సామాజిక మాధ్యమాలను నియంత్రించడానికి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను సవాలు చేస్తూ వాట్సాప్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసింది. నూతన ఐటీ రూల్స్ ద్వారా వాట్సాప్లో పంపే సందేశాలు, దాని ద్వారా ఇతరులతో జరిపే సంభాషణలు బయటివారికి తెలిసే అవకాశం ఉందని, తద్వారా తమ యూజర్ల ప్రైవసీ దెబ్బతింటుందని వాట్సాప్ వాదిస్తోంది. అటు కేంద్రం మాత్రం దీనికి భిన్నంగా వ్యాఖ్యానించింది. కొత్త ఐటీ రూల్స్తో యూజర్ డేటాకు ఎలాంటి ప్రమాదం ఉండదని.. దురుద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసిన యూజర్ల డేటా అడిగితే ఇవ్వాల్సిందేనని పేర్కొంది. అయితే, ఇలా చేస్తే తమ యూజర్ల డేటాకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, కొత్త ఐటీ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
ఏదేమైనా ఇప్పుడు భారత ప్రభుత్వం, వాట్సాప్ రెండింటి మధ్య పెద్ద యుద్దమే జరుగుతుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో దిక్కార స్వరం వినిపిస్తున్న వాట్సాప్పై మోదీ సర్కార్ బ్యాన్ విధించనుందన్న న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పాటు కేంద్రం యూజర్ల అన్ని వాట్సాప్ కాల్స్ను రికార్డ్ చేస్తుందని, అంతేకాక, యూజర్ల సంభాషణలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుందన్న న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న మెసేజ్ను పరిశీలిస్తే.. "కేంద్ర ఐటీ శాఖ మీ సందేశాలను పరిశీలిస్తుంది. వాట్సాప్లో మీరు అవతలి వ్యక్తికి చేసిన మెసేజ్కు మూడు టిక్కులు గనక వస్తే మీ మెసేజ్ను మంత్రిత్వ శాఖ గమనిస్తున్నట్లు అర్ధం చేసుకోండి. రెండు బ్లూ టిక్స్, ఒక రెడ్ టిక్ వస్తే ప్రభుత్వం మీ వివరాలను తనిఖీ చేస్తున్నట్లు అర్థం. చివరగా మూడు రెడ్ టిక్స్ వస్తే ప్రభుత్వం మీపై చర్యలు ప్రారంభించిందని, మిమ్మల్ని ఎప్పుడైనా అరెస్ట్ చేయవచ్చని అర్థం” అని మెసేజ్లో రాశారు.
పీఐబీ ఫ్యాక్ట్చెక్ వివరణ..
ఇక, రాజకీయాలు, ప్రస్తుత పరిస్ఠితులకు సంబంధించి ప్రభుత్వానికి, ప్రధాన మంత్రికి వ్యతిరేకంగా ఎలాంటి చెడు పోస్ట్ లేదా వీడియోలు పంపవద్దని ఈ వైరల్ మెసేజ్లో ఉంది. అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల ప్రకారం ఏదైనా రాజకీయ లేదా మతపరమైన సమస్యలపై మెసేజ్ చేయడం నేరం. ఇలా చేసిన వారిని ఎలాంటి వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయవచ్చని మెసేజ్లో పేర్కొన్నారు. కాగా, వైరల్ అవుతున్న ఈ న్యూస్పై పీఐబీ ఫ్యాక్ట్చెక్ స్పష్టతనిచ్చింది. ‘‘ఈ వార్తలు పూర్తిగా అబద్దం. ప్రభుత్వం యూజర్ల డేటాపై నిఘా ఉంటుందని ఎక్కడా చెప్పలేదు. అయితే, ఇతరులకు సందేశాలు పంపే క్రమంలో యూజర్లు జాగ్రత్త వహించాలి. ఆ వార్త నిజమా? కాదా? చెక్ చేసుకొని షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాం” అని ట్వీట్ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fact Check, Whatsapp