అవి బాగా వెనుకబడిన ప్రాంతాలు.. అక్షరాస్యత(Literacy) కూడా చాలా తక్కువ. ప్రభుత్వాలు ఆ ప్రాంతాలను అభివృద్ధి(Development) చేయడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నా.. అధికారుల నిర్లక్ష్యానికి సాక్షంగా నిలుస్తున్నాయి. అక్కడ అధికారుల అలసత్వం ఏ స్థాయిలో ఉందో తెలియజేసే ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కరెంట్ కనెక్షన్(Connection) లేకుండానే వేల రూపాయాల కరెంట్ బిల్లులు వచ్చాయి అక్కడి గ్రామాల ఇళ్లకు. దీంతో ఇది తెలుసుకున్న అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని(Uttara Pradesh) షామ్లీ జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. షామ్లీ జిల్లా ఝింఝానా చుట్టుపక్క ప్రాంతంలోని 12 గ్రామాల్లో ఎక్కువగా బవారియా తెగ ప్రజలు నివసిస్తుంటారు. వీరి ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ లేకున్నప్పటికీ ఇటీవల ఒక్కొక్కరికి రూ.30,000 నుంచి రూ.60,000 వరకు కరెంట్ బిల్లులు వచ్చాయి. దీంతో అక్కడి ప్రజలు షాక్కు గురయ్యారు. ఇంట్లో కరెంట్ లేకుండా కరెంట్ బిల్లు ఎందుకు వచ్చిందో తెలియక, ఎవరిని సంప్రదించాలో అర్థంకాక ఆందోళన చెందుతున్నారు.
మీటర్లు బిగించి, కరెంట్ సప్లై మరచి..
ఝింఝానా ప్రాంత అభివృద్ధి కోసం విద్యుత్తు కనెక్షన్ ఉచితంగా అందజేస్తామని అక్కడి విద్యుత్ శాఖ అధికారులు చాలాకాలం క్రితం హామీ ఇచ్చారు. దీంతో ఎన్నో దశాబ్దాల నుంచి కరెంట్ కనెక్షన్ లేనివారు కూడా తమ ఇళ్లకు విద్యుత్ మీటర్లు బిగించుకున్నారు. అయితే మీటర్లు బిగించిన అధికారులు కరెంట్ సప్లై ఇవ్వలేదు. దీంతో అక్కడి గ్రామాలు ఇప్పటికీ చీకట్లో మగ్గుతున్నాయి.
చుట్టుపక్కల గ్రామాల్లో ఇదే పరిస్థితి
ఝింఝానా ప్రాంతంలో ప్రధానంగా ఖోక్సా, అలావుద్దీన్పూర్, దుద్లీ, డేరా భగీరథ్, నయా గావ్ తదితర గ్రామాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా బవారియా తెగ ప్రజలు ఉంటున్నారు. వెనుకబడిన బవారియా సమాజాన్ని అభివృద్ధి పథంలో నడపాలని ప్రభుత్వాలు కృషి చేస్తుంటే.. అధికారుల అలసత్వం ఆ గ్రామాలకు శాపంగా మారుతోంది. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి.
ఖోక్సా గ్రామంలో విద్యుత్ లైన్ ఒకటి కూడా లేదు. అయితే ప్రతి ఇంటికి మీటర్లు అమర్చారు. దాదాపు 250 మంది జనాభా ఉన్న ఖోక్సా గ్రామ ప్రస్తుత దుస్థితి ఇది. కరెంట్ కోసం వారు గతంలో పోరాటం చేయడంతో విద్యుత్ కనెక్షన్ ఉచితంగా ఇస్తామని చెప్పి కొన్నేళ్ల కిత్రం ప్రతి ఇంటికి మీటర్లు బిగించి చేతులు దులుపుకున్నారు విద్యుత్ శాఖ అధికారులు. కరెంట్ లైన్ల ఏర్పాటుకు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు.
త్వరలోనే పరిష్కరిస్తాం..
ఈ ఘటనపై యూపీ పశ్చిమాంచల్ విద్యుత్ విత్రన్ నిగమ్ లిమిటెడ్ సూపరింటెండింగ్ ఇంజనీర్ రామ్ కుమార్ స్పందించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కరెంట్ బిల్లుపై గ్రామస్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని రామ్ కుమార్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ELectricity, Uttarapradesh