news18-telugu
Updated: July 31, 2020, 5:34 PM IST
2జీ నెట్వర్క్ నుంచి భారతదేశాన్ని విముక్తి చేయాలి: ముఖేష్ అంబానీ
(File Photo: Mukesh Ambani)
భారతదేశంలో మొబైల్ ఫోన్ సేవలు ప్రారంభమై 25 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ భారతదేశంలో టెలికాం సేవల భవిష్యత్తుపై మాట్లాడారు. రిలయెన్స్ జియో స్థాపనతో సంచలనాలు సృష్టించిన ముఖేష్ అంబానీ... భారతదేశంలో 2జీ నెట్వర్క్ లేకుండా చేయాలని, యూజర్లను 4జీ ఇంటర్నెట్ ఇకోసిస్టమ్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. దేశ్ కి డిజిటల్ ఉడాన్ సెషన్లో కేంద్ర టెలికాం మంత్రి రవి శంకర్ ప్రసాద్ను ఉద్దేశించి మాట్లాడుతూ భారతదేశంలో మొబైల్ టెలిఫోన్ పురోగతికి కారణమైన నాలుగు అంశాలను ప్రస్తావించారు. భారతదేశంలో ఇప్పటికీ 30 కోట్ల మంది యూజర్లు 2జీ నెట్వర్క్ ఉపయోగిస్తున్నారని, వారిని అప్గ్రేడ్ చేయాలని, లేకపోతే భారతదేశంలో డిజిటల్ ట్రాన్ఫార్మేషన్ సాధ్యం కాదన్నారు.

గత 25 సంవత్సరాలలో సాధించిన విజయాలను చూసి గర్విస్తున్నాం. భారతీయ వినియోగదారులు, భారతీయ సమాజం డిజిటల్ విప్లవం నుంచి పూర్తిగా లబ్ది పొందకుండా ఏర్పడ్డ అడ్డంకుల్ని పరిశీలించడానికి ఇది ఓ సందర్భం. భారతదేశంలో ఇప్పటికీ 30 కోట్ల మంది మొబైల్ సబ్స్క్రైబర్లు 2జీ యుగంలోనే ఉన్నారు. ప్రస్తుతం భారతదేశంతో పాటు ప్రపంచమంతా 5జీ టెలిఫోనీ గుమ్మంలో నిలబడి ఉంటే, 2జీ సబ్స్క్రైబర్లు ఉపయోగిస్తున్న ఫీచర్ ఫోన్లు బేసిక్ ఇంటర్నెట్ సేవల్ని వినియోగించకుండా వారిని మినహాయిస్తున్నాయి. అందుకే 2జీని చరిత్రగా మార్చేసేందుకు కావాల్సిన విధానపరమైన నిర్ణయాలను అత్యవసరంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
— ముఖేష్ అంబానీ, రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్
రాబోయే 25 ఏళ్లు మొబిలిటీలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని, 25 ఏళ్ల క్రితం మొబిలిటీ విషయంలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల వెనుక ఉందిని, ఇప్పుడు టెక్నాలజీ విషయంలో ప్రపంచానికి భారతదేశం దిశానిర్దేశం చేయాల్సిన సమయం వచ్చిందని, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అందరం కలిసి పనిచేద్దామని ముఖేష్ అంబానీ అన్నారు. ప్రస్తుతం మొబైల్ కమ్యూనికేషన్ సేవల్ని చాలా సరసమైన ధరలకే పొందొచ్చని గుర్తు చేశారు. పేద, ధనిక అన్న తారతమ్యాలు లేకుండా చూసేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడిందన్నారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్లు మల్టీటాస్కింగ్ కంప్యూటింగ్ టూల్స్గా మారాయన్నారు. రిలయెన్స్ జియో కారణంగా తక్కువ ధరకే డేటా అందుబాటులోకి రావడం భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన మార్పుల్ని తెచ్చిపెట్టిందన్నారు.
Published by:
Santhosh Kumar S
First published:
July 31, 2020, 5:28 PM IST