టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) ప్రారంభం అవడానికి మరో 17 రోజులే సమయం ఉన్నది. ఇప్పటికే అర్హత సాధించిన అథ్లెట్లు అందరూ సాధనలో మునిగిపోయారు. గత ఏడాదిన్నరగా కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రీడలు స్తంభించిపోయాయి. దీంతో ఆటగాళ్ల మ్యాచ్ ప్రాక్టీసుపై కూడా దెబ్బపడింది. ఈ సారి టోక్యో ఒలింపిక్స్లో భారత్ తరపున పతకాలు సాధిస్తారని అంచనా వేస్తున్న వారిలో బ్యాడ్మింటన్ ప్లేయర్లే ముందున్నారు. ముఖ్యంగా మహిళల సింగిల్స్లో పీవీ సింధు కచ్చితంగా పతకం సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఐదేళ్ల క్రితం రియోలో జరిగిన ఒలింపిక్స్లో ఇండియాకు వచ్చిన పతకాలు రెండే రెండు. దానిలో ఒకటి బ్యాడ్మింటన్ (Badminton) ప్లేయర్ పీవీ సింధు (PV Sindhu) సాధించిన రజత పతకం. భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు రెండో సారి ఒలింపిక్స్లోకి అడుగుపెట్టనున్నది. ఆమెకు తోడుగా పురుషుల సింగిల్స్లో బి. సాయిప్రణీత్, పురుషుల డబుల్స్లో సాత్వీక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి - చిరాగ్ శెట్టి టోక్యోలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఫామ్లో లేని సింధు..
2016 రియో ఒలింపిక్స్లో ఫైనల్లో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకున్న పీవీ సింధు.. ఈ సారి ఆ పతకాన్ని స్వర్ణంగా మార్చుకోవాలని భావిస్తున్నది. గత రెండుళ్లుగా పీవీ సింధు ఫామ్ను చూస్తే పతకం సాధిస్తుందా అనే అనుమానం నెలకొన్నది. రియో ఒలింపిక్స్ ముందు 13 టోర్నమెంట్లలో 36 మ్యాచ్లు ఆడి మంచి మ్యాచ్ ప్రాక్టీస్ సంపాదించింది. కానీ ప్రస్తుత ఒలింపిక్స్ ముందు సింధు ఆడింది కేవలం 7 టోర్నీల్లో 20 మ్యాచ్లు మాత్రమే. అయితే 2016లో సిల్వర్ మెడల్ తర్వాత 2018 కామన్వెల్త్ గేమ్స్ మిక్స్డ్ డబుల్స్లో గోల్స్ సాధించింది. ఇక 2019 నుంచి వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక అప్పటి నుంచి సింధు ఫామ్ తగ్గుతూ వచ్చింది. ముఖ్యంగా కరోనా సమయంలో సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోయింది. ఎప్పటిలాగే తన ప్రత్యర్థి కరోలినా మరీన్పై రెండు సార్లు ఓడిపోయింది. అయితే ఈ సారి మరీన్ ఒలింపిక్స్ నుంచి తప్పుకోవడంతో పీవీ సింధుకు మార్గం సుగమమైనట్లే అని పలువురు భావిస్తున్నారు.
స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ఒలింపిక్స్కు శ్రీకాంత్ తప్పకుండా అర్హత సాధిస్తాడని భావించినా.. అతడికి చుక్కెదురైంది. అనూహ్యంగా వరల్డ్ ర్యాంకింగ్స్తో సాయి ప్రణీత్ టోక్యోకు అర్హత సాధించాడు. పురుషుల సింగిల్స్లో సాయి ఒక్కడే ఇండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గత కొన్నాళ్లుగా సాయి ప్రణీత్ నిలకడైన ప్రదర్శన చేస్తున్నాడు. దీంతో సాయి ప్రణీత్ బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్ మంచి స్థితిలో ఉండటంతో ఒలింపిక్స్ చేరుకున్నాడు. బ్యాడ్మింటన్ సింగిల్స్లో ప్రత్యర్థులుగా తలపడిన చిరాగ్ షెట్టి-సాత్వీక్ సాయిరాజ్ రాంకీరెడ్డి గత కొంత కాలంగా డబుల్స్ జోడీగా రాణిస్తున్నారు. వరల్డ్ ర్యాంకింగ్స్లో టాప్-10లోకి ప్రవేశించి వార్తల్లో నిలిచారు. 2016 నుంచి ఈ జోడి డబుల్స్ ఆడుతున్నారు. 2019లో వరల్డ్ ర్యాంకింగ్స్లో 7వ స్థానానికి చేరుకున్నారు. అప్పటి నుంచి నిలకడగా రాణిస్తున్న ఈ జంట టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ఒలింపిక్స్కు అర్హత సాధించినంత సులభంగా వీరి ప్రయాణం కొనసాగేలా లేదు. చైనా, మలేషియా, జపాన్ ఆటగాళ్ల నుంచి గట్టి పోటీ ఎదురవనున్నది. ఈ జోడీ క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకునే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Badminton, Pv sindhu, Tokyo Olympics