2008 బీజింగ్ ఒలింపిక్స్లో (Olympics) తొలి సారిగా బాక్సింగ్లో (Boxing) భారత్ పతకం గెలిచింది. స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ బీజింగ్ వేదికగా జరిగిన ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించాడు. ఒలింపిక్ చరిత్రంలో మన దేశం బాక్సింగ్లో సాధించిన తొలి పతకం అదే. ఆ తర్వాత 2012 లండన్ ఒలింపిక్స్లో మేరీ కోమ్ కాంస్య పతకం సాధించింది. ఇక ఆ తర్వాత భారత్ బాక్సర్ల నుంచి ఒక్క పతకం కూడా రాలేదు. భారత్లో ఎంతో మంది నాణ్యమైన బాక్సర్లు ఉన్నా ఒలింపిక్స్లో మాత్రం పేలవమైన రికార్డు ఉన్నది. విజేందర్ సింగ్ వంటి బాక్సర్లు ప్రొఫెషన్ బాక్సింగ్లోకి వెళ్లడంతో చాలా కాలం పురుషుల బాక్సింగ్లో ఆధిపత్యం చెలాయించే బాక్సర్ దొరకలేదు. కానీ ఇటీవల అమిత్ పంగల్ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నాడు. మరోవైపు ప్రపంచ చాంపియన్షిప్ ఆరు సార్లు గెల్చిన మేరీ కోమ్ (Mary Kom) కూడా పతకం సాధిస్తుందని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. భారత్ తరపున మొత్తం 9 మంది బాక్సర్లు టోక్యో వెళ్తున్నారు.
1948 లండన్ ఒలింపిక్స్లో తొలి సారిగా భారత్ నుంచి బాక్సర్లు పాల్గొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాక్సింగ్లో సాధించినవి రెండు పతకాలు. అందులో ఒకటి 2012లో మేరీ కోమ్ సాధించిన కాంస్య పతకమే. 73 ఏళ్ల భారత్ బాక్సింగ్ ఒలింపిక్ చరిత్రలో రెండు రెండు పతకాలు ఉండటం అత్యంత చెత్త రికార్డు. కానీ గత కొన్నేళ్లుగా భారత బాక్సర్లు అంతర్జాతీయ వేదికలపై తమ సత్తాను చాటుతున్నారు. ముఖ్యంగా దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ ఒక ఒలింపిక్ పతకంతో పాటు ఆరు సార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచింది. ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్లో 51 కేజీల విభాగంలో మేరీ కోమ్ తలపడుతున్నది. ఇటీవల మేరీ కోమ్ ప్రదర్శన చాలా బాగున్నది. ప్రస్తుతం ఇటలీలో తన పంచ్లను మరింత పదును పెట్టడానికి శిక్షణ తీసుకుంటున్న మేరీ కోసం అట్నుంచి అటే టోక్యో వెళ్లనున్నది. మేరీ కోమ్తో పాటు పూజా రాణి, లావ్లీనా బోర్గయిన్ మహిళ విభాగంలో ఇటీవల తమ సత్తా చాటుతున్నారు. అయితే అమెరికా, యూరోప్, రష్యాన్ బాక్సర్లతో మన బాక్సర్లు ఎలా పోటీ పడతారనేది అనుమానమే. ఇటీవల సెమీస్, ఫైనల్ స్థాయిలో మహిళా బాక్సర్లు విఫలమవుతున్నారు. ఈ లోపాన్ని సరిదిద్దుకుంటే బాక్సింగ్ నుంచి పతకాలు వచ్చే అవకాశం ఉన్నది.
భారత స్టార్ బాక్సర్ అమిత్ పంగల్ మీద అందరి ఆశలు ఉన్నాయి. పురుషుల విభాగంలో తప్పకుండా పతకం సాధిస్తాడని అతడిపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రపంచ నెంబర్1 ర్యాంకు ద్వారా టోక్యో బెర్త్ సాధించిన పంగల్ అదే ఫామ్ కొనసాగిస్తే పతకానికి తిరుగుండదు. అయితే ఇటీవల జరిగిన ఆసియన్ బాక్సింగ్ చాంపియన్షిప్లో ఉజ్బెకిస్తాన్కు చెందిన షఖోబొదిన్పై ఓడిపోయి రజత పతకానికి పరిమితం అయ్యాడు. అయినా సరే పంగల్ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేయలేమని.. అతడు తప్పక పథకం సాధిస్తాడని బాక్సింగ్ ఫెడరేషన్ ఆశలు పెట్టుకుంది. పంగల్తో పాటు సతీశ్ కుమార్ కూడా ఒలింపిక్స్లో పాల్గొంటున్నాడు. ఇండయా తరపున ఒలింపిక్స్లో పాల్గొంటున్న తొలి హెవీవెయిట్ బాక్సర్గా సతీశ్ రికార్డు సృష్టించాడు. మిడిల్ వెయిట్ విభాగంలో24 ఏళ్ల ఆశిష్ కుమార్ టోక్యో వెళ్తున్నాడు. 2019 ఆసియన్ చాంపియన్షిప్లటో సిల్వర్ పతకం సాధించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Boxing, Mary Kom, Olympics, Tokyo Olympics