Mitchell Marsh : అక్టోబర్ 23న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో పాకిస్థాన్తో జరిగిన హైఓల్టేజ్ టీ20 మ్యాచ్లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో ఇండియా 10 ఓవర్లలో కేవలం 45 రన్స్ చేసి 4 వికెట్లు కోల్పోగా ఇక ఓటమి ఖాయం అని ఇండియన్ క్రికెట్ లవర్స్ అందరూ నిరాశపడ్డారు. ఈ సమయంలో విరాట్ కోహ్లీ ఆశలు రేకెత్తించాడు. ఛేజింగ్లో సింహంలా విరుచుకుపడి పరుగుల్ని వేటాడి మ్యాచ్ గెలిపించాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లు బాది 82 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈ మ్యాచ్ క్రికెట్ లవర్స్కి కావాల్సినంత డ్రామా, థ్రిల్స్, నరాలు తెగే ఉత్కంఠ, ఎగ్జైట్మెంట్ ఇచ్చింది. అందుకే దీన్ని క్రికెట్ లవర్స్ మళ్లీ మళ్లీ చూస్తున్నారు. ఇలాంటి గొప్ప మ్యాచ్ ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదని కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ కూడా ఈ మ్యాచ్ను ప్రశంసించాడు.
అక్టోబర్ 25 సాయంత్రం శ్రీలంకతో ఆస్ట్రేలియా ఒక టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్కు ముందు సోమవారం నాడు జరిగిన విలేకరుల సమావేశంలో మిచెల్ మార్ష్ టీమిండియా, పాక్ మ్యాచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వరల్డ్ కప్లో ఈ మ్యాచ్ కంటే ఇంకా అద్భుతంగా గేమ్స్ చూసేందుకు ఏముంటాయి?.. అందుకే ఇక్కడితో ఈ టోర్నమెంట్ స్టాప్ చేస్తే బాగుంటుందన్నట్లు ఈ ఆసీస్ ప్లేయర్ కామెంట్ చేశాడు.
"నిజానికి, వరల్డ్ కప్ 2022ను ఇండియా-పాక్ మ్యాచ్తో ఆపేయాలని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వరల్డ్ కప్ మ్యాచ్లు ఇంతకంటే అద్భుతంగా జరిగితే.. మనం మరో మూడు వారాల పాటు అద్భుతమైన అనుభూతిని పొందుతాం. భారత్ VS పాకిస్థాన్ మధ్య పోరు చూసేందుకు ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్టేడియంలో ప్రేక్షకుల మధ్య కూర్చొని, అందులో భాగమైతే ఎంత అద్భుతంగా ఉంటుందో కూడా నేను ఊహించలేను" అని ఈ ఆల్ రౌండర్ చెప్పాడు. ఇక చాలు.. వరల్డ్ కప్ ఆపేయవచ్చు అని నవ్వుతూ అతను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి.
India Vs Pakistan : పాక్ క్రికెట్ ఫ్యాన్ కు దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చిన గూగుల్ సీఈవో
భారత్ వర్సెస్ పాక్ టీ20 మ్యాచ్లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరచిన విరాట్ కోహ్లీపై కూడా మార్ష్ ప్రశంసల వర్షం కురిపించాడు. దాదాపు అసాధ్యమైన పరిస్థితుల నుంచి 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విజయం సాధించి ఇండియాను గట్టెక్కించాడు కోహ్లీ. "ఈ మ్యాచ్లో కోహ్లీ అమేజింగ్గా ఆడాడు. కోహ్లీ తన 12 నెలల కెరీర్లో అంత గొప్పగా ఏం ఆడలేదు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ సాధారణ ఆట తీరును మాత్రమే ప్రదర్శించాడు. అలాంటి అనుభవాలతో సిద్ధమైన కోహ్లీ వరల్డ్ కప్లో తనదైన ముద్ర వేశాడు. ఇది చూడటానికి అద్భుతమైన ఇన్నింగ్స్, అద్భుతమైన ఆట. ఇలాంటి అద్భుతమైన గేమ్స్ మరిన్ని జరగాలని ఆశిస్తున్నా." అని మార్ష్ పేర్కొన్నారు.
విరాట్ కోహ్లీ అప్పుడప్పుడు ఫామ్ కోల్పోయినా పాక్పై మాత్రం అద్భుతంగా ఆడుతూ మళ్లీ తిట్టిన నోర్లతోనే పొగిడించుకుంటాడు. ఈ ఆదివారం కూడా అదే జరిగింది. కాగా ఈ టోర్నమెంట్లో ప్రారంభ మ్యాచ్లో న్యూజిలాండ్పై ఆస్ట్రేలియా చాలా పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ టీమ్ సెమీఫైనల్లోకి వెళ్లాలంటే వరుసగా మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: T20 World Cup 2022