జపాన్ వేదికగా సాగుతోన్న ఒలింపిక్స్లో రెండో రోజు భారత్ కు మిశ్రమ ఫలితాలు ఎదురవుతున్నాయ్. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజత పతకంతో భారత త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడిస్తే... మెడల్స్ సాధిస్తారనుకున్న మరి కొందరు అథ్లెట్లు నిరాశపర్చారు. ఇప్పటికే బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ విభాగంలో తెలుగు తేజం భమిడిపాటి సాయి ప్రణీత్ నిరాశపర్చాడు. అయితే, డబుల్స్ విభాగం మాత్రం అదరగొట్టింది. పురుషుల బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ షెట్టి జోడి.. రెండో రౌండ్లో అడుగు పెట్టింది. గ్రూప్ ఏ తొలి మ్యాచ్లో- ప్రపంచ ర్యాంకింగ్స్లో మూడో స్థానంలో ఉన్న లీ యాంగ్, వాంగ్ చి-లిన్ జంటపై అద్భుత విజయాన్ని సాధించింది. లీ యాంగ్/చి-లిన్ ర్యాంక్తో పోల్చుకుంటే సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ షెట్టి ర్యాంక్ చాలా తక్కువ. భారత పురుషుల డబుల్స్ జోడీ ర్యాంక్..10. ర్యాంకింగ్లో తమ కంటే పై స్థాయిలో ఉన్న చైనీస్ తైపే పెయిర్ను ఓడించి.. పతకం దిశగా ఓ అడుగు ముందుకేసింది. 21-16, 16-21, 27-25 సెట్ల తేడాతో చైనీస్ తైపే జోడీపై విజయం సాధించారు సాయిరాజ్, చిరాగ్ షెట్టి.
తొలి సెట్లో సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ షెట్టి జోడీకి ఎదురు లేకుండా పోయింది. దూకుడుగా ఆడారు వారిద్దరు. అద్భుతమైన డ్రాప్ షాట్లను సంధించారు. చైనీస్ తైపే జోడి కుదురుకునే లోపే మ్యాచ్పై ఆధిపత్యాన్ని సాధించారు. తొలి సెట్ను 21-16 స్కోరుతో సొంతం చేసుకున్నారు. రెండో సెట్లో లీ యాంగ్, వాంగ్ చి-లిన్ చెలరేగి ఆడారు. తమ అసలు ఆటను ప్రదర్శించారు. గాడిలో పడ్డ తరువాత- వారిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సాత్విక్/చిరాగ్ షెట్టి.. వారిని అడ్డుకోవడానికి వేసిన వ్యూహాలేవీ ఫలించలేదు. దీనితో రెండో సెట్ను 16-21 తేడాతో కోల్పోవాల్సి వచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Badminton, Sports, Tokyo Olympics