టోక్యో ఒలింపిక్స్ 2020లో (Tokyo Olympics) భారత్కు (India) మరో పతకం (Another Medal) ఖరారైంది. మహిళల బాక్సింగ్ వాల్టర్ వెయిట్ (64 కేజీల నుంచి 69 కేజీల) విబాగంలో భారత బాక్సర్ లవ్లీనా బోర్గెయిన్ (Lovlina Borgohain) సెమీఫైనల్ చేరుకున్నది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో లవ్లీనా చైనీస్ తైపీకి చెందిన చెన్ నీచిన్పై గెలుపొందింది. జడ్జీలు 4-1తో లవ్లీనా వైపు మొగ్గు చూపారు. ఒలింపిక్స్లో పతకం తెస్తుందని అందరూ ఆశలు పెట్టుకున్న స్టార్ బాక్సర్ మేరీకోమ్ ప్రీ-క్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోయింది. దీంతో భారతీయుల ఆశలు అడియాశలయ్యాయి. 24 గంటలు తిరగక ముందే నేనున్నానంటూ 23 ఏళ్ల అస్సామ్ అమ్మాయి నిరూపించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా బోర్గెహెన్ చైనీస్ తైపీకి చెందిన మాజీ ప్రపంచ చాంపియన్ నీన్ చిన్పై 4-1 తేడాతో విజయం సాధించి పతకం ఖాయం చేసుకున్నది. ఒక వేళ సెమీస్లో గెలిస్తే కాంస్యానికి మించిన పతకమే దక్కుతుంది. లవ్లీనా ఒలింపిక్స్లో పాల్గొనడం ఇదే తొలి సారి కావడం గమనార్హం. దీంతో లవ్లీనా పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఆమె ఎత్తు ఆమెకు అడ్వాంటేజ్. తన కెరీర్లో దూసుకువెళ్తున్న ఓ దశలో లవ్లీనాకు అనూహ్య ఓటమి ఎదురైంది. ఆ సమయంలో ఆమె ఖంగుతింది. ఎందుకు ఇలా జరిగిందో అంచాన వేసింది. ఆ రూటును మార్చుకోవాలని భావించింది. తన పంచ్ అదరాలంటే.. మరో మార్గాన్ని ఎన్నుకోవాలనుకున్నది. బౌట్ మధ్యలో తన శక్తిని పెంచే పనిపై దృష్టిపెట్టింది. దానిలో భాగంగానే మెడిటేషన్ మార్గాన్ని ఎంచుకున్నది. ఆటలో గెలవాలంటే బలం ఒక్కటే కాదు.. శారీరక శక్తులను అదుపులో ఉంచే ధ్యానం కూడా ముఖ్యమన్న విషయాన్ని ఆమె గ్రహించింది.
నిజానికి కిక్ బాక్సింగ్తో ఆమె కెరీర్ మొదలైంది. తన అక్కలు ఆ క్రీడలో ఉన్న కారణంగా ఆమె మరో గేమ్ ఎంచుకోవాలనుకున్నది. అప్పుడు బాక్సింగ్పై ఆమెకు మక్కువ పెరిగింది. ఇక పంచ్లు ఇవ్వడం మొదలుపెట్టింది. 2018 కామన్వెల్త్ గేమ్స్ క్వార్టర్స్లో లవ్లీనా ఓడింది. ఆ ఓటమితో ఖంగుతిన్న లవ్లీనా.. తన ఆటతీరును మార్చుకోవాలని భావించింది. తన స్టైల్ మార్చితే గెలుపు వశమవుతుందన్న భావనకు వచ్చిందామె. తన సామర్థ్యానికన్నా ఎక్కువే ప్రిపేరైనా.. ఆ బౌట్లో ఓటమి ఆమెను నిరాశపర్చేది. శారీరక శక్తి ఒక్కటే కాదు.. ఆ శక్తి తగిన ధ్యాన బలం అవసరమన్న సత్యాన్ని ఆమె గ్రహించింది. దాంతో ఆమె మెడిటేషన్ను కూడా ఓ పంచ్లా వాడింది.
పెద్ద పెద్ద టోర్నీల్లో ఆడడం అంటే.. కేవలం ఫిట్నెస్ ఒక్కటే సరిపోదు. ఆ టోర్నీలో ఉండే వత్తిడిని ఎదుర్కొనే మానసిక శక్తి చాలా అవసరం. బాక్సింగ్లో ఉండే సైకలాజికల్ అంశాలపై అవగాహన పెంచుకున్నట్లు ఓ సందర్భంలో లవ్లీనా తెలిపింది. తన మానసిక స్థైర్యాన్ని పెంచుకునేందుకు ధ్యానాన్ని ఎంచుకున్నట్లు ఆమె చెప్పింది. ఇది ఎంతో ఉపకరించినట్లు ఆమె పలు సందర్భాల్లో వెల్లడించింది. బౌట్ మధ్యలో ధ్యానం చేయడం వల్ల.. ఆ మ్యాచ్లో వ్యూహాన్ని మార్చే శక్తి తనకు వచ్చినట్లు లవ్లీనా చెప్పింది. మెడిటేషన్ను ప్రారంభించిన తర్వాత తన సామర్థ్యం రెట్టింపు అయ్యిందని, అప్పటి నుంచి తన పంచ్ పవర్ కూడా మారినట్లు రైజింగ్ లవ్లీనా వెల్లడిచింది. మెడిటేషన్ను ఆటలో భాగం చేయడం ద్వారా.. వరుసగా రెండు సార్లు వరల్డ్ చాంపియన్షిప్స్లో బ్రాంజ్ మెడల్ గెలిచినట్లు ఆమె చెప్పింది. 2018, 2019 సంవత్సరాల్లో జరిగిన వరల్డ్ చాంపియన్షిప్లో ఆమె కాంస్య పతకాలను కైవసం చేసుకున్నది.
ఇవాళ టోక్యోలో 64-69 కేజీల విభాగంలో జరిగిన క్వార్టర్ఫైనల్లో లవ్లీనా అద్భుతమైన విజయం సాధించింది. చైనీస్ తైపీకి చెందిన చెన్ చిన్పై 4-1 తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఆమె సెమీఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్లో ఓడినా లవ్లీనాకు పతకం ఖాయం. దీంతో ఆమె టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది.
ఇక, ఒలింపిక్స్లో భారత్కు పతకాలు అందిస్తున్న మూడో బాక్సర్గా లవ్లీనా చరిత్ర సష్టించనుంది. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో విజేందర్ సింగ్, 2012 లండన్ ఒలింపిక్స్లో మేరీ కోమ్ కాంస్య పతకాలు గెలిచారు. ఆ తర్వాత బాక్సర్ లవ్లీనా మాత్రమే. ఇక ఒలింపిక్స్లో 69 కేజీల విభాగంలో పతకం తేనున్న మొదటి బాక్సర్గా రికార్డు సృష్టించనుంది. గతంలో ప్రపంచ చాంపియన్షిప్లో రెండు సార్లు కాంస్యం అందించిన లవ్లీనా.. ఇప్పుడు దేశానికి ఒలింపిక్ పతకం అందించనుంది. ఆగష్ట్ 4న లవ్లీనా టర్కీకి చెందిన బుసెనాజ్ సుర్మెనిల్తో తలపడనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Boxing, Sports, Tokyo Olympics