క్రికెట్ మక్కాగా పిలువబడే లార్డ్స్లో (The Lord's) భారత జట్టు (Team India) అద్బుతం చేసింది. చివరి రోజు మొత్తం బౌలర్లదే హవా నడిచింది. అటు బ్యాటింగ్. ఇటు బౌలింగ్లో టీమ్ ఇండియా బౌలర్లు చెలరేగిపోవడంతో ఇంగ్లాండ్ జట్టు తలొగ్గక తప్పలేదు. దీంతో ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు తొలి విజయాన్ని అందుకున్నది. 5వ రోజు భారత జట్టు కేవలం రెండు సెషన్లలో ఇంగ్లాండ్ జట్టును ఆలౌట్ చేసి చారిత్రక విజయాన్ని అందుకున్నది. ఈ విజయంతో భారత జట్టు సిరీస్లో 1-0తో ముందంజ వేసింది. టీమ్ ఇండియా నిర్దేశించిన 272 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ పూర్తిగా తడబడ్డారు.
ఓపెనర్లు రోరీ బర్న్స్ (0), డామ్ సిబ్లే (0) ఇద్దరూ డకౌట్గా వెనుదిరిగారు. బుమ్రా వేసిన తొలి ఓవర్ మూడో బంతికి రోరీ బర్న్స్ (0) మహ్మద్ సిరాజ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మహ్మద్ షమీ వేసిన ఆ తర్వాతి ఓవర్లో డామ్ సిబ్లే (0) కీపర్ రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. హసీబ్ హమీద్, జో రూట్ కలసి కాసేపు పోరాడారు. అయితే ఇషాంత్ శర్మ బౌలింగ్లో హసీబ్ హమీద్ (9) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. జానీ బెయిరస్టో (2) కూడా ఇషాంత్ బౌలింగ్లోనే ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఇక తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన కెప్టెన్ జో రూట్ చాలా సేపు ఇబ్బంది పెట్టాడు. కానీ రెండో సెషన్ ప్రారంభమైన కాసేపటికే బుమ్రా బౌలింగ్లో జో రూట్ (33) కెప్టెన్ విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత జాస్ బట్లర్, మొయిన్ అలీ కలసి భారత బౌలర్లను ఇబ్బంది పెట్టారు. కాగా, మహ్మద్ సిరాజ్ వరుస బంతుల్లో మొయిన్ అలీ (13), సామ్ కర్రన్ (0) అను పెవీలియన్ చేర్చాడు. ఇక మిగిలిన వికెట్లు కూడా త్వరగానే పడిపోతాయని భావించినా.. జాస్ బట్లర్ అడ్డుగా నిలిచాడు. జాస్ బట్లర్, ఓలీ రాబిన్సన్ కలసి దాదాపు గంట పాటు పోరాడారు. ఒకవైపు ఓవర్లు, సమయం అయిపోతున్నా వీరిద్దరూ క్రీజులో అడ్డుగా నిలబడ్డారు. మ్యాచ్ డ్రా అవుతుందని అందరూ భావించారు. కానీ ఓలీ రాబన్సన్ (9) బుమ్రా బౌలింగ్లో ఎల్బీగా అవుటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో సిరాజ్ మరోసారి అద్భుతం చేశాడు. క్రీజులో పాతుకొని పోయిన జాస్ బట్లర్ (25) పంత్కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరగా.. అదే ఓవర్లో జేమ్స్ అండర్సన్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత జట్టు 151 పరుగుల భారీ విజయాన్ని అందుకున్నది. చివరి సెషన్లో భారత బౌలర్లు ఏకంగా ఆరు వికెట్లు తీయడం గమనార్హం. మహ్మద్ సిరాజ్ 4, బుమ్రా 3, షమి 1 వికెట్ తీశారు.
షమీ, బుమ్రా అద్బుత షో..
అంతకు ముందు భారత జట్టు తొలి సెషన్లో అద్బుతమైన ఆటతీరు కనపర్చింది. 181/6 ఓవర్ నైట్ స్కోర్తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు రిషబ్ పంత్ (22), ఇషాంత్ శర్మ (16) వికెట్లను త్వరగా కోల్పోయింది. భారత ఇక త్వరగా ఆలౌట్ అవుతుందని అందరూ అంచనా వేశారు. కానీ మహ్మద్ షమి (56), జస్ప్రిత్ బుమ్రా (34) అద్బుత పోరాటం చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లను దంచి కొట్టారు. టాపార్డర్ బ్యాట్స్మెన్ లాగా ధీటుగా ఎదుర్కొని 9వ వికెట్కు ఏకంగా 89 పరుగులు జోడించారు. లంచ్ విరామం తర్వాత భారత జట్టు 298/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేసి ఇంగ్లాండ్ జట్టుకు 272 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కేఎల్ రాహుల్కు లభించింది.
For his majestic 1st innings ton at Lord's ?️ @klrahul11 is our Man of the Match for the second Test ?#TeamIndia ?? | #ENGvIND Scorecard ? https://t.co/KGM2YELLde pic.twitter.com/labkZwGgUl
— BCCI (@BCCI) August 16, 2021
ఇండియా తొలి ఇన్నింగ్స్ 364 ఆలౌట్
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 391 ఆలౌట్
ఇండియా రెండో ఇన్నింగ్స్ 298/8 డిక్లేర్డ్
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 120 ఆలౌట్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.