ఢిల్లీ సరిహద్దుల్లో 70 రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. సాగుచట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీరికి విపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. రైతుల గోస పట్టదా..? అని కేంద్రంపై మండిపడుతున్నాయి. ఐతే ఇన్నాళ్లు మన దేశంలోనే దీని గురించి చర్చ జరిగింది. కానీ ఇప్పుడు అంతర్జాతీయంగానూ హాట్ టాపిక్గా మారింది. విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు రైతుల ఉద్యమంపై స్పందిస్తున్నారు. ఈ క్రమంలో వారికి కౌంటర్గా భారతీయ ప్రముఖులు కామెంట్ చేస్తున్నారు. ఇది మా దేశ అంతర్గత విషయం.. ఇందులో మీరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ కూడా దీనిపై స్పందించారు. మన మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కలిసి ముందుకు వెళ్దామని.. దేశమంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
‘భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్న ఈ సమయంలో అందరం కలిసికట్టుగా ఉందాం. రైతులు మన దేశంలో అంతర్భాగం. అందరం శాంతియుతంగా, ఐక్యమత్యంతో ముందుకు వెళ్లేలా అన్ని వర్గాల మధ్య సామరస్యపూర్వక పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నా’’ ట్వీట్ చేశారు విరాట్ కొహ్లీ.
Let us all stay united in this hour of disagreements. Farmers are an integral part of our country and I'm sure an amicable solution will be found between all parties to bring about peace and move forward together. #IndiaTogether
— Virat Kohli (@imVkohli) February 3, 2021
భారత్లో జరుగుతున్న రైతుల ఆందోళనలపై అమెరికా పాప్ గాయని రిహానా, యువ పర్యావరణవేత్త గ్రెటా థన్బర్గ్ సహా పలువురు అంతర్జాతీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించిన విషయం తెలిసిందే. రెండు నెలలకు పైగా ఆందోళనలు చేస్తున్న రైతులకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఐతే విదేశీ వ్యక్తులు స్పందించడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో కుట్ర ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మా దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి మీరెవరు? అంటూ మండిపడింది. సమస్యను పరిష్కరించుకునే సత్తా మా దేశానికి ఉందని స్పష్టం చేసింది.
ఈ వ్యవహారంలో కేంద్రానికి మద్దతుగా పలువురు భారత సెలబ్రిటీలు నిలిచారు. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్, లతా మంగేశ్కర్ సహా పలువురు సెలబ్రిటీలు కేంద్రం వాదనను సమర్థించారు. మా దేశ అంతర్గత విషయంలో మీరు కలగజేసుకోవాల్సిన అవసరం లేదని విదేశీ ప్రముఖులపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ కూడా స్పందించారు. అందరం ఐక్యమత్యంగా ఉందామని పిలుపునిచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Farmers Protest, Sports, Virat kohli