భారత్-పాకిస్థాన్ (India Vs Pakistan) జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ కోసం యావత్ ప్రపంచం ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఈ రెండు జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2021 (T-20 World Cup 2021) లో గత ఆదివారం తలపడ్డ సంగతి తెలిసిందే. పాకిస్థాన్ జట్టు ప్రపంచకప్లో తొలిసారిగా భారత్ను ఓడించింది. భారత్, పాకిస్థాన్ మధ్య టీ20 మ్యాచ్ ముగిసి వారం రోజులు అవుతున్నా ఏదో ఒక కాంట్రవర్సీ వస్తూనే ఉంది. అత్యంత ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో ఇండియా 10 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో టీమిండియా ప్లేయర్లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ (Virat Kohli), మహ్మద్ షమీ (Mohammed Shami) ని టార్గెట్ చేసుకుని కామెంట్లు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా షమీని టార్గెట్ చేసుకుని తీవ్ర పదజాలంతో అతన్ని ట్రోలింగ్ చేశారు. మ్యాచ్ ముగిసిన వెంటనే, అభిమానులు ఇన్స్టాగ్రామ్ , ట్విట్టర్లో షమీపై విమర్శలు చేశారు.
ముఖ్యంగా ఆ మ్యాచ్ లో మహ్మద్ షమీ వేసిన 18వ ఓవర్లో 17 పరుగులు సమర్పించడంతో అతన్ని దూషిస్తూ, బూతులు తిడుతూ పోస్టులు చేశారు కొందరు అభిమానులు. నువ్వు ముస్లిం అవ్వడం వల్లే టీమిండియాని ఓడించావని, వెంటనే మీ పాకిస్తాన్కి వెళ్లిపోవాలంటూ పిచ్చి కూతలు కూశారు.
ఇక, షమీకి మద్దతుగా భారత సీనియర్ క్రికెటర్లు నిలిచిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar), సెహ్వాగ్ (Virender Sehwag), గంభీర్ (Gowtham Gambhir), ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan), యుజ్వేంద్ర చాహల్ వంటి వాళ్లు షమీకి బాసటగా నిలిచారు. ఇక తాజాగా క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే (Harsha Bhogle) కూడా షమీకి మద్దతుగా నిలిచాడు.
ఇప్పుడు ఆ లిస్ట్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేరిపోయాడు. టీ20 వరల్డ్కప్ 2021 టోర్నీలో భాగంగా న్యూజిలాండ్తో మ్యాచ్కి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహ్మద్ షమీపై ఆన్లైన్ అటాక్ చేసిన వారిపై ఫైర్ అయ్యాడు. " టీమిండియాలో ప్రతీ ఒక్కరూ టీమ్ గెలవాలనే ఉద్దేశంతోనే ఆడతారు. జాతీయ పతకాన్ని రెపరెపలాడించాలనే ఓ గొప్ప ఉద్దేశంతో క్రికెట్ ఆడతాం. అంతేకానీ ఇలాంటి వెధవలను ఎంటర్టైన్ చేయడానికి కాదు. ఐడెంటెటీ చూపించుకోవడానికి కూడా ధైర్యం లేని వీళ్లు, ఇలా మనుషులను ట్రోల్ చేస్తూ పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు. " అంటూ ఫైరయ్యాడు.
" ఇక, జట్టులో ప్రతీ ఒక్కరూ మహ్మద్ షమీకి అండగా ఉన్నాం. అతను మ్యాచ్ విన్నర్. 200 శాతం అతను తర్వాతి మ్యాచ్లో ఆడతాడు. ఎవరి సత్తా ఏంటో బయటివాళ్లు చెబితే తెలుసుకునే పొజిషన్లో మేం లేము... " అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ.
ఇక, టీమిండియా తమ నెక్ట్స్ మ్యాచ్ న్యూజిలాండ్ తో (India Vs New Zealand) ఆడనుంది. ఈ మ్యాచ్ గెలిచి సెమీస్ ఆశలు సజీవంగా ఉంచాలని టీమిండియా ప్రయత్నిస్తోంది. మరోవైపు, న్యూజిలాండ్ కూడా ఇది చావోరేవో మ్యాచ్. ఈ ఆసక్తికర సమరం ఈ నెల 31న దుబాయ్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు దాదాపు సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించినట్టే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India VS Pakistan, Mohammed Shami, T20 World Cup 2021, Virat kohli