టీ-20 ప్రపంచకప్ (T-20 World Cup 2021)లో సూపర్ విక్టరీతో భారత్ (Team India) ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఫ్లాప్ అయిన బ్యాటింగ్ ఒక్కసారిగా "సూపర్ హిట్" అయ్యింది. విలన్లుగా మారిన టీమిండియా బౌలర్లు ఒక్కసారిగా హీరోలుగా మారారు. గ్రూప్–2లో జరిగిన లీగ్ మ్యాచ్లో భారత్ ఆల్రౌండ్ ప్రతాపంతో 66 పరుగులతో నెగ్గింది.ఈ మ్యాచ్ లో భారీ తేడాతో గెలవడంతో టీమిండియా తమ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటిదాకా ఏ జట్టూ చేయలేని 211 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచింది. ఛేజింగ్కు దిగిన ఆఫ్ఘన్ను 144 పరుగుల వద్దే కట్టడి చేసింది. ఇక, టీమిండియాకు గ్రూప్ స్టేజీలో రెండు మ్యాచులు మిగిలాయ్. స్కాట్లాండ్, నమీబియాలతో టీమిండియా నెక్ట్స్ మ్యాచులు ఆడనుంది. అఫ్గానిస్థాన్ తో పోల్చుకుంటే.. ఆ రెండు జట్లతో పోరు కొంచెం ఈజీ అనే చెప్పొచ్చు. అఫ్గానిస్థాన్ మీద విక్టరీతో టీమిండియా నెట్ రన్ రేట్ కూడా మెరుగైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), కేఎల్ రాహుల్ (KL Rahul).. కసి తీరా ఆడారు. కరవు తీరేలా షాట్లను బాది అవతల పడేశారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ల భరతం పట్టారు. మునుపటి ఫామ్ను అందుకున్నారు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ చిచ్చరపిడుగుల్లా ఆడారు. తొలి వికెట్ భాగస్వామ్యానికి 140 పరుగులు జోడించారు. రోహిత్ శర్మ 47 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సర్లు, ఎనిమిది బౌండరీలు ఉన్నాయి. రోహిత్తో పోటీ పడి షాట్లు కొట్టాడు రాహుల్. 48 బంతుల్లో రెండు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 69 పరుగులు చేశాడు.
మైదానంలో చెలరేగిన రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఒకింత నిరాశపడ్డాడు. పాకిస్తాన్, న్యూజిలాండ్లపై ఓడిన విషయాన్ని ప్రస్తావించాడు. తొలి రెండు గేమ్లల్లో ఓడిపోయినంత మాత్రాన భారత జట్టును బ్యాడ్గా చూడాల్సిన అవసరం లేదని అన్నాడు. బ్యాడ్ ప్లేయర్స్, బ్యాడ్ టీమ్గా భావించవద్దని సూచించాడు. అన్ని ఫార్మట్లలోనూ చాలాకాలం నుంచీ నిలకడగా రాణిస్తున్నామని, సమష్టిగా సత్తా చాటుతున్నామని గుర్తు చేశాడు. అలాగే, ఫ్యామిలీ మెంబర్స్ పై చేస్తున్న నీచాతి ట్రోలింగ్ ను రోహిత్ శర్మ ఖండించాడు.
టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ తొలి రెండు మ్యాచ్లల్లో ఇదే రకమైన ఫలితం వచ్చి ఉంటే బాగుండేదని, అయినప్పటికీ నిరుత్సాహ పడాల్సిన పని లేదని అన్నాడు. సెమీ ఫైనల్స్కు చేరడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చాడు. పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తమ స్థాయికి తగ్గట్టుగా ఆడాయని, తాము వాటితో తీసిపోలేదని వ్యాఖ్యానించాడు.
ఇది కూడా చదవండి : రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. తన క్లాసిక్ ఇన్నింగ్స్ తో టాప్ లేపిన హిట్ మ్యాన్..
ఈ రెండు మ్యాచ్లల్లో స్వేచ్ఛగా ఆడలేక పోయామని, ఇప్పుడు దాన్ని సాధించామని చెప్పాడు. కేఎల్ రాహుల్ ఎప్పటికీ డిపెండబుల్ బ్యాటరేనని, ఈ విషయాన్ని అతను చాలాసార్లు నిరూపించాడని చెప్పాడు. ఇక, అఫ్గాన్ మ్యాచులో సత్తా చాటిన సీనియర్ స్పిన్నర్ అశ్విన్ ను కొనియాడాడు రోహిత్ శర్మ. చాలా ఏళ్ల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన అశ్విన్ చెలరేగడం టీమిండియాకు మంచిదని అభిప్రాయపడ్డాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rohit sharma, T20 World Cup 2021, Team India, Virat kohli