శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఇంధన సమస్య తలెత్తడంతో వారు ప్రయాణిస్తున్న విమానం భారత్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. దీంతో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది ఆందోళన చెందారు. ఈ విషయాన్ని ఆ జట్టు కోచ్ మైక్ ఆర్థర్ వెల్లడించారు. విమానం భారత్లో ల్యాండ్ అవ్వగానే ఫోన్ ఆన్ చేశానని, ఇంగ్లండ్ ఆపరేషన్స్ మేనేజర్ వేన్ బెంట్లీ నుంచి తనకు కొన్ని సందేశాలు వచ్చాయని, పరిస్థితి గురించి అతను అందులో వివరించాడని మైక్ ఆర్థర్ పేర్కొన్నారు."ఇంధన నష్టం జరగడంతో మా విమానాన్ని భారత్కు దారి మళ్లించారు. అక్కడ మేం దిగగానే నా ఫోన్ ఆన్ చేశాను. ఇంగ్లాండ్ ఆపరేషన్స్ మేనేజర్ వేన్ బెంట్లీ నుంచి నాకు కొన్ని సందేశాలు వచ్చాయి. పరిస్థితి గురించి అందులో వివరించాడు. దాంతో నిజంగా మేమంతా ఆందోళన చెందాం" అని ఆర్థర్ పేర్కొన్నాడు. అయితే, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీసు కోసం ఇంగ్లండ్లో పర్యటించిన లంక జట్టు ఆడిన అన్ని మ్యాచుల్లోనూ ఓటమి పాలై ఘోర పరాభవాన్ని మూట కట్టుకుంది. టీ20 సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్న ఆతిధ్య ఇంగ్లండ్ జట్టు, వన్డే సిరీస్ను 2-0తో గెలిచి లంక జట్టును క్లీన్స్వీప్ చేసింది. ఈ పర్యటన తర్వాత లంక జట్టు స్వదేశానికి బయల్దేరింది. తీరా భారత్లో దిగాక విమానం దారి మళ్లించారన్న విషయం వారికి తెలిసింది.
ఇదిలా ఉంటే, ఈ నెల 13 నుంచి భారత్, శ్రీలంక జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్ జరగాల్సి ఉంది. ఇటీవల ఇంగ్లండ్ క్రికెటర్లు కరోనా బారిన పడటంతో, లంక క్రికెటర్లు కూడా ఐసోలేషన్లోని వెళ్లాల్సి వస్తుంది. దీంతో భారత్తో సిరీస్ షెడ్యూల్ మారే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఇరు జట్ల మధ్య తొలి వన్డే జులై 13న జరుగనుండగా..జూన్ 16న రెండో వన్డే, 18న మూడో వన్డే జరుగనుంది. అనంతరం జులై 21న తొలి టీ20.. జులై 23, 25న మిగిలిన రెండు టీ20 మ్యాచ్లు జరుగనున్నాయి.
మరోవైపు, జాతీయ కాంట్రాక్ట్ ఒప్పందాల విషయమై శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) బెదిరింపులు ఫలించాయి. మొత్తం 30 మందిలో 29 మంది లంక ఆటగాళ్లు కాంట్రాక్ట్ ఒప్పందాలపై సంతకం చేశారు. ఈ విషయాన్ని ఎస్ఎల్సీ స్వయంగా ధ్రువీకరించింది. కాంట్రాక్ట్ ఒప్పందాలపై సంతకం చేసేందుకు ఎస్ఎల్సీ 36 గంటల సమయం (జూలై 8) ఇవ్వగా.. ఒక రోజు ముందే లంక ప్లేయర్స్ దిగొచ్చారు. దీంతో బోర్డు అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఒక ప్లేయర్ మాత్రం ఒప్పందంపై సంతకం చేయలేదు. అతడే సీనియర్ ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్. ఈ సీనియర్ ప్లేయర్ శ్రీలంక బోర్డుపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flight, India vs srilanka, Sri Lanka