టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత అథ్లెట్లు అసమాన ప్రతిభ చూపించారు. 130 ఏళ్ల ఒలింపిక్ చరిత్రలో తొలి సారిగా ఇండియాకు 7 పతకాలు లభించాయి. ఇందులో అథ్లెటిక్స్ నుంచి ఏకంగా స్వర్ణం గెలవడం విశేషం. ఇక భారత పురుషుల హాకీ జట్టు 41 ఏళ్ల తర్వాత పతకం సాధించింది. ఇప్పటికే హాకీతో పాటు ఇతర క్రీడల్లో పతకాలు సాధించిన అందరికీ ఆయా ప్రభుత్వాలు భారీగా నజరానాలు, ప్రోత్సాహకాలు ప్రకటించింది. తాజాగా పంజాబ్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకున్నది. టోక్యో ఒలింపిక్స్లో పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టులో అత్యధిక ప్లేయర్లు పంజాబ్ నుంచే ఉన్నారు. పంజాబ్ నుంచి 10 మంది హాకీ ప్లేయర్లు టోక్యో ఒలింపిక్స్కు వెళ్లారు. దీంతో రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలలకు వారి పేర్లు పెట్టాలని నిర్ణయించారు. ఆయా క్రీడాకారులు ఏ ప్రాంతానికి చెందితే అక్కడి ప్రభుత్వ పాఠశాలకు వారి పేరు పెట్టడానికి పంజాబ్ విద్యాశాఖ అనుమతి కోరతూ ముఖ్యమంత్రికి లేఖ రాసింది. సీఎం అమరీందర్ సింగ్ ఈ ప్రతిపాదనకు ఓకే చెప్పినట్లు విద్యాశాఖ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లా తెలిపారు. త్వరలోనే ఈ పేర్లను ఆయా పాఠశాలలకు పెడతామని ఆయన చెప్పారు.
భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ పేరును మిథాపూర్ జలంధర్ ప్రభుత్వ సీనియర్ సెకెండరీ పాఠశాలకు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇకపై ఆ పాఠశాలను ఒలింపియన్ మన్ప్రీత్ సింగ్ ప్రభుత్వ సీనియర్ సెకెండరీ స్కూల్, మిథాపూర్గా పిలవనున్నారు. అమృత్సర్లోని తిమ్మోవల్ పాఠశాల పేరును ఒలింపియన్ హర్మన్ప్రీత్ సింగ్ పేరుతో మార్చనున్నారు. హర్మన్ ప్రీత్ భారత హాకీ జట్టు వైస్ కెప్టెన్గా వ్యవహరించాడు. అట్టారీ పాఠశాల పేరు ఒలింపియన్ శంషర్ సింగ్ ప్రభుత్వ సీనియర్ సెకెండరీ పాఠశాలగా.. ఫరీద్కోట్ బాలికల పాఠశాల పేరు.. ఒలింపియన్ రూపిందర్ పాల్ సింగ్ ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలగా మార్చనున్నారు. ఇక ఖుస్రోర్పూర్ పాఠశాల పేరు ఒలింపియన్ హార్దిక్ సింగ్ పాఠశాలగా.. గురుదాస్పూర్లోని చాహల్ కలాన్ పాఠశాల పేరు ఒలింపియన్ సిమ్రన్జిన్ సింగ్ పాఠశాలగా మార్చనున్నారు.
Kohli Black Water: కోహ్లీ 'నల్లని నీళ్లు' ఎందుకు తాగుతున్నాడు? ఆ నీటి ఖరీదెంతో తెలుసా?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hockey, Olympics, Punjab, Tokyo Olympics