ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్ ప్లేయర్ రిటెన్షన్ (Player Retention) గడువు మరో మూడు రోజుల్లో ముగియనున్నది. పాత 8 జట్లు నవంబర్ 30 మధ్యాహ్నం 12 గంటల లోపు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల వివరాలను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ (IPL governing Council), బీసీసీఐలకు (BCCI) తెలియ జేయాలి. ఐపీఎల్ 2021లో (IPL 2021) పేలవ ప్రదర్శన చేసిన జట్ల నుంచి ఆటగాళ్లను మాత్రమే కాకుండా కెప్టెన్లను రిటైన్ చేసుకోవడానికి కూడా ఒకటికి పది సార్లు ఫ్రాంచైజీలు ఆలోచిస్తున్నాయి. అయితే ఒక ఫ్రాంచైజీ మాత్రం తమ పాత కెప్టెన్ పైన నమ్మకం ఉంచింది. గతంలో కంటే ఎక్కువే చెల్లించి అతడిని రిటైన్ చేసుకున్నది. ప్రతి ఫ్రాంచైజీ గరిష్టంగా 4 మంది ఆటగాళ్లను ఉంచుకోవడానికి వీలున్నది. దీంతో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) తమ మొదటి ఆటగాడిగా సంజూ శాంసన్ను (Sanju Samson) కొనసాగించాలని నిర్ణయించుకున్నది. మిగిలిన స్థానాలకు ఆటగాళ్ల పేర్లు ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఆ ముగ్గురు ఆటగాళ్లపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో కథనం మేరకు.. రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2022 రిటెన్షన్లో భాగంగా రూ. 14 కోట్ల ధరతో తమ కెప్టెన్ సంజూ శాంసన్ను అట్టిపెట్టుకున్నది. అయితే, ఫ్రాంచైజీ యొక్క మొదటి రిటెన్షన్గా శాంసన్ను సాంకేతికంగా రూ. 16 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. కానీ యాజమాన్యం మాత్రం అతడితో రూ.14 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. అయినా సరే సంజూ పేరు మీద రూ. 16 కోట్లు పర్స్ వాల్యూలో కట్ అవుతాయి. రాజస్థాన్ రాయల్స్ నలుగురు ఆటగాళ్లను రిటెన్షన్ చేసుకొని వేలానికి వెళితే.. వారి వద్ద గరిష్టంగా రూ. 48 కోట్ల పర్స్ మిగిలి ఉంటుంది. సంజూ శాంసన్ను 2018లో రాజస్థాన్ రాయల్స్ కేవలం రూ. 8 కోట్లతో ఒప్పందం చేసుకున్నది. తాజాగా అతడి విలువ రూ. 6 కోట్లు పెరిగింది. జట్టు విఫలమైనా.. గత సీజన్లో బ్యాటర్గా సంజూ మంచి ప్రదర్శన చేయడంతోనే రిటైన్ చేసుకున్నట్లు సమాచారం.
ఇక రాజస్థాన్ రాయల్స్లో మిగిలిన మూడు ఖాళీల విషయానికొస్తే.. లియామ్ లివింగ్స్టోన్, జోఫ్రా ఆర్చర్, యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ల పేర్లు చర్చనీయాంశమయ్యాయి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ కూడా చర్చలో భాగం కాకపోవడం. జోఫ్రా ఆర్చర్ ప్రపంచ క్రికెట్లో అత్యంత డిమాండ్ ఉన్న బౌలర్లలో ఒకడు అయినప్పటికీ.. అతని ఫిట్నెస్, క్రికెట్ నుండి సుదీర్ఘ విరామం రాజస్థాన్ మేనేజ్మెంట్ను గందరగోళానికి గురి చేస్తున్నది. మోచేయి గాయం కారణంగా ఈ ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మొత్తం ఐపీఎల్ 2021ని మాత్రమే కాకుండా T20 ప్రపంచ కప్ కూడా ఆడలేదు. త్వరలో ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్లో కూడా ఆర్చర్ ఆడడం లేదు. మరి అతడిని ఏ మేరకు జట్టులోకి తీసుకుంటుందనేది సందేహమే.
టీ20 ప్రపంచ కప్లో ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్ మంచి ఫామ్ కనపరిచాడు. అతడి ఫామ్ను గమనించిన రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ను బట్లర్ను కొనసాగించాలని భావిస్తున్నది. ఇప్పటికే బట్లర్తో చర్యలు జరిపి ఒప్పించినట్లు కనిపిస్తోంది. సంజూ తర్వాత బట్లర్ను రెండో చాయిస్గా జట్టు రిటైన్ చేసుకోనున్నది. అయితే బెన్ స్టోక్స్ను తీసుకోవాలనుకున్నా.. ఆర్థికపరమైన డీల్ ఓకే కాలేదని తెలుస్తున్నది. అందుకే అతడి బదులు ఆర్చర్ను తీసుకుంటున్నట్లు సమాచారం.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, IPL, IPL 2022, Rajasthan Royals, Sanju Samson