ఓ వైపు భారత హాకీ జట్టు అద్భుత గోల్స్ తో చెలరేగి ఒలింపిక్స్ లో 41 ఏళ్ల తరువాత తొలి పతకం అందించింది. ఇదే సమయంలో ప్రధాని మోదీ వారిని అభినందించారు. స్వయంగా ఫోన్ మాట్లాడి మరి సర్ ప్రైజ్ చేశారు. మరోవైపు అదే సమయంలో విపక్షాలపై సెటైర్లు వేశారు. పెగాసస్తో పాటు ఇతర అంశాలపై చర్చ జరపాలని పార్లమెంటులో విపక్షాలు చేస్తోన్న ఆందోళనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. వివిధ రంగాల్లో దేశం ఎంతో ప్రగతి సాధిస్తోందన్న మోదీ.. దేశ యువత గోల్ తర్వాత గోల్ చేసుకుంటూ ముందుకు వెళ్తోందని ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు విజయాన్ని ప్రస్తావించారు. మరోవైపు కొందరు మాత్రం తమ రాజకీయ ఎజెండాను అమలుచేసేందుకు సెల్ఫ్ గోల్ కోసం ప్రయత్నిస్తున్నారని విపక్షాలపై పరోక్ష విమర్శలు చేశారు. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన అవగాహన కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న మోదీ, విపక్షాల తీరును ఎండగట్టారు.
మన దేశం ఏం కోరుకుంటోంది, ఏం సాధిస్తోంది, దేశంలో ఏవిధమైన మార్పులు వస్తున్నాయనే విషయాలు ప్రతిపక్షాలకు అవసరం లేదని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తోన్న విపక్ష పార్టీలవి జాతి వ్యతిరేక కార్యకలాపాలేనని.. అభివృద్ధి మార్గాన్ని అడ్డుకోవడమే వారి ముఖ్య ఉద్దేశమన్నారు. అయినప్పటికీ దేశాన్ని ముందుకు సాగకుండా వారు ఆపలేరని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉండడం (Double Engine) వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని రేషన్ లబ్ధిదారులతో మాట్లాడుతున్న సందర్భంలో ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు.
ఇదిలాఉంటే, పెగాసస్ అంశంపై చర్చించాలని డిమాండ్ చేస్తూ దాదాపు రెండు వారాలుగా ప్రతిపక్షాలు చేస్తోన్న ఆందోళనలు పార్లమెంటును, రాజ్యాంగాన్ని అవమానించేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఎంపీలు పేపర్లు చింపి సభాధ్యక్షుల స్థానాల వైపు గాల్లోకి విసిరిన ఘటనలపైనా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటూ విపక్ష సభ్యులు అప్రజాస్వామ్య రీతిలో ప్రవర్తిస్తున్నారని ప్రధానమంత్రి విమర్శలు గుప్పించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India news, Modi, National News, PM Narendra Modi