ఒలింపిక్స్ చరిత్రలో 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు భారత పురుషుల హాకీ జట్టు తెరదించింది. అలసు ఆశలు లేకుండా బరిలో దిగిన భారత జట్టు అద్భుతం చేసింది. ఒలింపిక్స్ హాకీ చరిత్రలో భారత్కు 12వ మెడల్ ను అందించింది. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక పోరులో జర్మనీపై టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. నరాలు తెగేంత ఉత్కంఠగా సాగిన ఈ హోరాహోరీ పోరులో 5-4 గోల్స్ తేడాతో మన్ప్రీత్ సేన విజయం సాధించింది. చివరగా.. 1980మాస్కో ఒలింపిక్స్లో భారత్కు స్వర్ణ పతకం దక్కింది. దీంతో 41 ఏళ్ల తరువాత మళ్లీ హాకీ వీరులు పతకం సాధించారు. దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన ఈ మ్యాచ్లో భారత్ ఆటగాళ్లు రెచ్చిపోయారు. జర్మనీ దూకుడుకు కళ్లెం వేస్తూ అద్భుత ప్రదర్శన కనబరిచారు. జర్మనీ గోల్ పోస్ట్లపై దాడి చేశారు. ఏకంగా 5 గోల్స్ కొట్టి బ్రాంజ్ మెడల్ తమ ఖాతాలో వేసుకున్నారు.
స్ఫూర్తిదాయక ఆటతో మన్ప్రీత్ బృందం ఒలింపిక్స్లో కాంస్య పతకాని సాధించింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగి గొప్ప జట్లకే చుక్కలు చూపించారు. మళ్లీ 1980కి ముందు రోజులు గుర్తు చేశారు. ఇక ఇండియన్ హాకీ పనైపోయిందన్న నోళ్లను మూయించారు. మనలో ఏమాత్రం సత్తా తగ్గలేదన్న విషయాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారు.
టోక్యోలో భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాండించిన పురుషుల హాకీ టీంకు అభినందనలు తెలిపారు ప్రధాని మోదీ.. కాంస్య పతకం రావడంతో సంబరాల్లో మునిగి ఉన్న హాకీ జట్టుకు ఫోన్ చేసి ప్రధాని మోదీ సర్ ప్రైజ్ చేశారు. వారి ఆనందాన్ని రెట్టింపు చేశారు. జర్మనీతో జరిగిన కాంస్య పతాకం పోరులో మ్యాచ్లో నెగ్గిన భారత జట్టుకు ప్రధాని మోదీ కంగ్రాట్స్ తెలిపారు. కెప్టెన్ మన్ ప్రీత్ తో స్వయంగా ఫోన్ లో మాట్లాడిన ప్రధాని.. ప్రశంసల జల్లు కురిపించారు. చాలా అద్భుతంగా ఆడారంటూ ఆటగాళ్లను ప్రశంసించారు. ఈ విజయాన్నియావత్ భారత దేశం పండగలా జరుపుకుంటోందని.. భారత జాతీ మొత్తం గర్వ పడేలా చేశారంటూ మోదీ కొనియాడారు. ఈ సందర్భంగా మోదీతో మాట్లాడిన మన్ ప్రీత్ మీ ఆశీస్సులు మమ్మల్నీ గెలిపించయాని తెలిపారు.
నిజానికి టోక్యో ఒలింపిక్స్ మొదలైనప్పుడు హాకీలో ఈ స్థాయి దూకుడును ఎవరూ అంచనా వేయలేదు. కొందరైతే అసలు మన టీమ్లు క్వార్టర్ ఫైనల్ వరకైనా చేరుకుంటాయా? అని సందేహం వ్యక్తం చేశారు. దీనికి గతంలో వరుస అపజయాలు కూడా ఓ కారణమే. ఈసారి కూడా మన హాకీ టీంలు నిరాశతో వెనుదిరగాల్సిందేనని అంతా భావించారు. ఎందుకంటే మనకు చివరగా 1980 మాస్కోలో జరిగిన ఒలింపిక్స్లో స్వర్ణం వచ్చింది. అంతే ఆ తర్వాత హాకీ టీంకు ప్రతీసారి ఒలింపిక్స్లో ఎదురుదెబ్బే తగిలింది. 40 ఏళ్లుగా ఒలింపిక్స్లో ఒక్క పతకం కూడా దక్కని ఆపవాదును మూటగట్టుకున్న హాకీ టీమ్ టోక్యోలో అందరీ విమర్శలకు చెక్పెట్టింది టీమిండియా.
1980కు ముందు ఇండియన్ హాకీకి స్వర్ణయుగం. హాకీ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది ఇండియానే. అప్పటి దిగ్గజ ఆటగాళ్ల ప్రత్యర్థులకు చెమటలు పట్టించారు. గ్రౌండ్లోకి ఇండియా దిగిదంటే ప్రత్యర్థి టీంకు చుక్కలు కనబడాల్సిందే. ఇండియా హాకీ టీమ్తో ఆడడమంటేనే ప్రత్యర్థి ఓడిపోయినట్లు. భారత హాకీ జట్టంటే అగ్రదేశాలకు సైతం హడల్. మనపై ఒక్క గోల్ చేస్తే చాలు గెలిచినంత సంబరాలు చేసుకునే వాళ్లు. హాకీ మన బ్లడ్లోనే ఉంది. సరైన సౌకర్యాలు లేకుండానే మోడ్రన్ టెక్నిక్స్తో పని లేకుండానే ప్రపంచ హాకీని భారత్ ఏలింది. ప్రత్యర్థులకు సింహస్వప్నంగా నిలిచింది.
ఒలింపిక్స్లో మన హకీ చరిత్ర చూస్తే 1928 నుంచి 1980 మధ్య మన హాకీకి స్వర్ణయుగం నడిచింది. 12 ఒలిపిక్స్లో ఏకంగా 11 పతకాలు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. 1928 నుంచి 1956 వరకు వరుసగా ఆరుసార్లు స్వర్ణం గెలవడం అంటే మాటలు కాదు. అంటే 28 ఏళ్ల పాటు మనకు తిరుగు లేకుండా పోయింది. ఇండియా హాకీ టీం బరిలో ప్రత్యర్థులు సెకండ్, థర్డ్ ప్లేస్ కోసం చూడడం తప్ప ఫస్ట్ ప్లేస్ కోసం కలలో కూడా ప్రయత్నించే సాహసం చేయలేకపోయేవారు.
అయితే 1960లో మన టీం రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒలింపిక్స్కు టీమ్ పుంజుకుంది. 1964 మళ్లీ గోల్డ్ గెలుచుకుని మనకు తిరుగులేదని నిరూపించింది. 1968 మెక్సికో ఒలింపిక్స్, 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్లో కాంస్యంకే పరిమితం అయింది. చివరిసారిగా మన హాకీం టీం 1980 మాస్కో ఒలింపిక్స్లో స్వర్ణం గెలుచుకున్న భారత్కు మళ్లీ 41ఏళ్ల తర్వా మెడల్ గెలిచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hockey, Pm modi, Sports, Tokyo Olympics