17 ఏళ్ల తర్వాత దాయాది గడ్డపై అడుగుపెట్టిన ఇంగ్లండ్ (England).. ఫస్ట్ టెస్ట్ మ్యాచులో అదరగొట్టిన సంగతి తెలిసిందే. రావల్పిండి వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 74 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాలుగు రోజుల ఆట పూర్తయ్యాక ఇరు జట్లు కూడా సమంగా నిలిచాయి. ఒక దశలో గెలుపు అవకాశాలు ఇరుజట్లకు సమానంగా ఉన్నాయి. ఇంగ్లండ్ గెలవాలంటే ఆఖరి రోజు 8 వికెట్లు అవసరం కాగా.. పాక్ (Pakistan) గెలవాలంటే 223 పరుగులు చేయాల్సి ఉంది. 343 పరుగుల లక్ష్యంతో.. ఓవర్ నైట్ స్కోరు 2 వికెట్లకు 80 పరుగులతో చివరిదైన ఐదో రోజు ఆటను కొనసాగించిన పాకిస్తాన్ 96.3 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఒలీ రాబిన్సన్, జేమ్స్ అండర్సన్ లు చెరో నాలుగు వికెట్లు తీశారు. బెన్ స్టోక్స్, జాక్ లీచ్ చెరో వికెట్ సాధించారు.
అయితే, తొలి టెస్టులో అద్భుత విజయం సాధించిన ఇంగ్లండ్.. ఇప్పుడు రెండో టెస్టుకు సిద్ధమవుతుంది. నేటి ( శుక్రవారం నవంబర్ 9) నుంచి పాకిస్థాన్- ఇంగ్లాండ్ మధ్య ముల్తాన్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభంకానుంది. తొలి టెస్ట్లో విజయాన్ని సాధించి జోరు మీదున్న ఇంగ్లాండ్.. సెకండ్ టెస్ట్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనే ఉత్సాహంతో బరిలో దిగుతోంది. మరోవైపు సొంత గడ్డపై ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్థాన్ భావిస్తోంది.
అయితే.. రెండో టెస్టుకు సిద్ధమవుతున్న సమయంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ముల్తాన్లో ఆ జట్టు ఆటగాళ్లు బస చేసిన హోటల్కు సమీపంలో కాల్పులు చోటు చేసుకోవడం ఇందుకు కారణమైంది. క్రికెటర్లు ఉన్న హోటల్కు కిలోమీటర్ దూరంలో గురువారం తుపాకీ కాల్పుల శబ్ధాలు వినిపించాయి. గురువారం ఉదయం ఇంగ్లాండ్ ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్ కోసం రెడీ అవుతోన్న సమయంలో ఈ కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఇటీవలే పాక్ మాజీ ప్రధాని, మాజీ క్రికెటర్ అయిన ఇమ్రాన్ ఖాన్పై దుండగుడు కాల్పులు జరిపి గాయపరిచిన నేపథ్యంలో తాజా ఘటనతో ఆందోళన రెట్టింపైంది.
దీంతో.. ఆటగాళ్ల భద్రతను మరింత పటిష్టం చేశారు. కాల్పుల ఘటనకు సంబంధించి ఇప్పటికే పాకిస్థాన్ పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిసింది. స్థానిక ముఠాల మధ్య జరిగిన గొడవలో తుపాకీ కాల్పులు జరిగాయని, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసు అధికారులు వెల్లడించారు. కాల్పుల ఘటనతో సంబంధం లేకుండా ఇంగ్లాండ్ ఆటగాళ్లు సెక్యూరిటీ మధ్య ప్రాక్టీస్లో పాల్గొన్నట్లు సమాచారం. పాకిస్థాన్లో పర్యటిస్తోన్న ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ప్రెసిడెంట్ స్థాయి సెక్యూరిటీని అందచేస్తున్నారు.
ఇది కూడా చదవండి : బంగ్లాదేశ్ చివరి వన్డేలో ఆ ముగ్గురికీ నో ఛాన్స్..
అయితే, 2009 మార్చిలో పాక్ పర్యటనలో ఉన్న సందర్భంలో శ్రీలంక క్రికెట్ జట్టు ప్రయాణించిన లాహోర్లోని గడాఫీ స్టేడియం సమీపంలో దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు శ్రీలంక ఆటగాళ్లు గాయపడ్డారు. దీంతో.. అపట్నుంచి పాక్ గడ్డపై క్రికెట్ ఆడటానికి చాలా జట్లు రాలేదు. కానీ, ఇప్పుడిప్పుడే పరిస్థితి మారిపోయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Babar Azam, Cricket, England, Pakistan