Ms Dhoni : మిస్టర్ కూల్ చేస్తున్న సేంద్రీయ వ్యవసాయం సక్సెస్ అవుతోంది. సేంద్రీయ పద్ధతిలో పండిస్తున్న కూరగాయలు యూఏఈకి ఎగుమతి చేస్తున్నారు. లేటెస్ట్ గా ఇన్స్టాగ్రామ్ వేదికగా ధోనీ పంచుకున్న వీడియో అందర్ని ఆశ్చర్యపరుస్తుంది.
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ... నయా ఇన్నింగ్స్ అదిరిపోయింది. మిస్టర్ కూల్ చేస్తున్న సేంద్రీయ వ్యవసాయం సక్సెస్ అవుతోంది. సేంద్రీయ పద్ధతిలో పండిస్తున్న కూరగాయలు యూఏఈకి ఎగుమతి చేస్తున్నారు. దాదాపు 10 ఎకరాల్లో సేంద్రీయ పద్ధతిలో ధోనీ ఆ కూరగాయల్ని పండిస్తుండటంతో.. వాటికి ఫుల్ డిమాండ్ ఉంది. అయితే, చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో దర్శనమిచ్చాడు. ఇతర క్రికెటర్లకు భిన్నంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు మిస్టర్ కూల్. చాలా వరకు మహీకి సంబంధించిన విషయాలను అతని సతీమణి సాక్షి సింగ్ అభిమానులతో పంచుకుంటోంది. ధోనీ మాత్రం సందర్భం లేకుండా సోషల్ మీడియాలోకి రాడు. కానీ, లేటెస్ట్ గా అతను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న వీడియో అందర్ని ఆశ్చర్యపరుస్తుంది. ఎన్నడూ లేని విధంగా ధోనీ వీడియోను పంచుకోవడంతో మిస్టర్ కూల్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. పైగా ఆ వీడియాకు ధోనీ ఇచ్చిన క్యాప్షన్ కూడా భలే గమ్మత్తుగా ఉంది.
ఇంతకీ ఆ వీడియో ఏంటంటే.. మహీ తన ఫామ్ హౌజ్లో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా స్ట్రాబెర్రీలను పండిస్తున్నాడు. ఇక పంటను పరిశీలించే క్రమంలో స్ట్రాబెర్రీలను చూసిన ధోనీ ఆగలేక వాటిని తెంచి తిన్నాడు. దానికి 'నేను స్ట్రాబెర్రీ పొలంలో తిరిగితే మార్కెట్కు ఒక్క పండు కూడా వెళ్లేలా లేదు'అని సెటైరిక్గా క్యాప్షన్ ఇచ్చాడు. అన్ని తానే తినేస్తానేమోనని ఉద్దేశంతో ఈ క్యాప్షన్ రాసుకొచ్చాడు. ఇక ఎన్నడు లేని విధంగా మహీ సోషల్ మీడియాలో వీడియో పంచుకోవడంతో నెట్టింట వైరల్ అయింది. ధోనీ ఈజ్ బ్యాక్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
రాంచీ శివార్లలో తన 43 ఎకరాల ఫామ్ హౌస్లో ధోనీ 10 ఎకరాల్లో టమోటా, క్యాబేజీ, బొప్పాయి, ఇతర పంటలను పండిస్తున్నాడు. ధోనీ ఫామ్ కూరగాయలకు స్థానికంగా మంచి డిమాండ్ రావడంతో వీటిని గల్ఫ్లో మార్కెట్ చేసేందుకు ఫామ్ ఫ్రెష్ ఏజెన్సీతో జార్ఖండ్ వ్యవసాయ శాఖ సంప్రదింపులు జరిపింది. ఇక గతేడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన మహీ.. ఐపీఎల్ 2020 సీజన్ మాత్రం ఆడాడు. కానీ ఇది వరకు ధోనీలా మైదానంలో కన్పించలేదు.