Malaysia masters 2023 : ఈ ఏడాది పేలవ ఫామ్ తో సీజన్ ను ఆరంభించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) మునుపటి ఫామ్ ను అందుకున్నట్లు కనిపిస్తోంది. గత నెలలో జరిగిన స్పెయిన్ మాస్టర్స్ లో ఫైనల్ వరకు చేరిన పీవీ సింధు తుది మెట్టుపై బోల్తా పడింది. ఇక తాజాగా కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న మలేసియా మాస్టర్స్ టోర్నమెంట్ లో సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ ఏడాది ఇప్పటి వరకు టైటిల్ నెగ్గని సింధుకు ఈ టోర్నీతో ఆ కల నెరవేరే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. శుక్రవారం జరిగిన మహిళల క్వార్టర్ ఫైనల్ పోరులో 13వ ర్యాంకర్ సింధు 21–16, 13–21, 22–20తో చెనా షట్లర్ జాంగ్ యి మాన్ పై నెగ్గింది.
ప్రిక్వార్టర్ ఫైనల్లో అయా ఒహోరి (జపాన్)పై నెగ్గిన పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో అదరగొట్టింది. ప్రత్యర్థి జాంగ్ యి మాన్ నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైనా.. కీలక సమయంలో పాయింట్లు సాధించి విజయం సాధించింది. తొలి గేమ్ లో ఇరువురు కూడా పాయింట్ల కోసం తీవ్రంగా పోటీ పడ్డారు. అయితే చివర్లో ధాటిగా ఆడిన సింధు గేమ్ ను సొంతం చేసుకుంది. రెండో గేమ్ లో జాంగ్ యి మాన్ కమ్ బ్యాక్ చేసింది. బలమైన స్మాష్ షాట్లతో సింధును ఉక్కిరి బిక్కిరి చేసింది. దాంతో రెండో గేమ్ జాంగ్ ఖాతాలో చేరింది. ఇక మ్యాచ్ ను డిసైడ్ చేసే మూడో గేమ్ లో ఇరువురు ప్లేయర్లు కూడా హోరా హోరీగా తలపడ్డారు. ఒక దశలో పీవీ సింధు మూడు పాయింట్ల లీడ్ ను పొందింది. అయితే జాంగ్ యి మాన్ వరుసగా పాయింట్లను సాధిస్తూ సింధును చేరింది. దాంతో స్కోర్లు 20-20గా నిలిచింది. ఈ దశలో వరుసగా రెండు పాయింట్లు సాధించిన సింధు మ్యాచ్ ను సొంతం చేసుకుని సెమీస్ లో అడుగుపెట్టింది.
శ్రీకాంత్ కు చుక్కెదురు
వ్యక్తిగత విదేశీ కోచ్ను నియమించుకున్న తర్వాత వరుస విజయాలతో దూసుకెళ్తోన్న భారత స్టార్ షట్లర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్ కు చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన పురుషుల క్వార్టర్స్ పోరులో ఆదినాత్ చేతిలో 16-21, 21-16 21-11 శ్రీకాంత్ ఓడాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 5వ ర్యాంకర్ కున్లావుత్ వితిద్సర్న్ (థాయ్లాండ్)పై సంచలన విజయాన్ని సాధించిన శ్రీకాంత్ అదే ఫామ్ ను క్వార్టర్ ఫైనల్లో ప్రదర్శించలేకపోయాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.