ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్కు సంబంధించి వచ్చే ఏడాది జనవరిలో మెగా వేలం (Mega Auction) నిర్వహించబోతున్నారు. 14 ఏళ్ల తర్వాత తొలి సారి బీసీసీఐ (BCCI) భారీ వేలానికి తెరతీసింది. దీనికి సంబంధించి ఇప్పటికే బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు ప్లేయర్ రిటెన్షన్ పాలసీని (Player Retention Policy) తెలియజేసింది. ప్లేయర్స్ రిటెన్షన్ పాలసీ ప్రకారం ప్రస్తుతం ఉన్న టీమ్స్ గరిష్టంగా నలుగురిని రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నది. ఇక మెగా వేలంలో పాల్గొనడానికి అన్ని జట్ల వద్ద రూ. 90 కోట్ల పర్స్ వాల్యూ ఉంటుంది. అయితే రిటైన్ చేసుకునే ప్లేయర్లను బట్టి పర్స్ నుంచి డబ్బులు కట్ అవుతుంటాయి. ఇక ఒక్కో జట్టు గరిష్టంగా నలుగురు ప్లేయర్లను అట్టిపెట్టుకోవచ్చు. ఇందులో గరిష్టంగా ముగ్గురు భారతీయులు ఉండొచ్చు. ఒక వేళ అన్ క్యాప్ట్ ప్లేయర్స్ అయితే గరిష్టంగా ఇద్దరికే చాన్స్ ఉంటుంది. ఇక విదేశీ ప్లేయర్లు అయితే గరిష్టంగా ఇద్దరికి మాత్రమే చాన్స్ ఉంటుంది. ఈ కాంబినేషన్ల ఆధారంగా గరిష్టంగా నలుగురికి రిటెన్షన్ మించకూడదు. అయితే ఎవరైనా ప్లేయర్ను రిటెన్షన్ చేసుకోవాలంటే తప్పకుండా ఆటగాడి అనుమతి తప్పనిసరి. ఒక వేళ ఆటగాడు తాను జట్టుతో పాటు కొనసాగలేను అని చెబితే.. అతడిని విడుదల చేయాల్సి ఉంటుంది.
ఐపీఎల్ 2021 సీజన్లో మంచి స్టార్ట్ చేసినా.. ఆఖరికి పేలవ ప్రదర్శన చేసిన కింగ్స్ పంజాబ్ నుంచి ఈ సారి తప్పుకుంటున్నట్లు కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) ప్రకటించాడు. బ్యాటర్గా అతడు విజయవంతం అయినా.. కెప్టెన్గా మాత్రం జట్టును విజయాల బాట పట్టించలేక పోయాడు. దీంతో ఈ సారి తాను పంజాబ్ కింగ్స్ తరపున ఆడబోవడం లేదని.. తాను జట్టుకు వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పాడు. బెంగళూరుకు చెందిన కేఎల్ రాహుల్ సొంత నగరానికి చెందిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు వెళ్తాడని అందరూ భావించారు. ప్రస్తుతం ఆ జట్టుకు కెప్టెన్ అవసరం కూడా ఉన్నది. అయితే అనూహ్యంగా కొత్తగా లీగ్లో చేరిన లక్నో జట్టు అతడిని కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తున్నది.
తాను పంజాబ్ కింగ్స్ను వీడనున్నట్లు ఇప్పటికే కేఎల్ రాహుల్ స్పష్టం చేయడంతో ఆ ఫ్రాంచైజీ అతడిని రిటైన్ చేసుకోదు. దీంతో అతడు వేలం పాటలోకి వస్తాడు. అయితే మెగా వేలం కంటే ముందే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 30 వరకు కొత్త జట్లకు 'ఫ్రీ పిక్' అనే ఆప్షన్ను బీసీసీఐ ఇచ్చింది. దీని ప్రకారం రిటైన్ కాని ఎవరైనా ముగ్గురు క్రికెటర్లను మెగా ఆక్షన్ కంటే ముందే తమ జట్టులోకి తీసుకోవచ్చు. అధిక ధర పెట్టి ఫ్రాంచైజీని సొంత చేసుకున్న లక్నోకే ఈ ఆప్షన్లో మొదటి అవకాశం వస్తుంది. దీంతో అహ్మదాబాద్ కంటే ముందు లక్నో యాజమాన్యానికి ఆటగాళ్లను ఫ్రీ పిక్ చేసుకునే అవకాశం ఉన్నది. దీన్ని ఉపయోగించుకునే కేఎల్ రాహుల్ను లక్నో జట్టు తీసుకోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అతడికి రూ. 16 కోట్ల వరకు చెల్లించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, IPL 2022, KL Rahul, Lucknow, Punjab kings