news18-telugu
Updated: July 1, 2019, 8:29 AM IST
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మెహబూబా ముఫ్తీ ఈ ఎన్నికల్లో అనంత్ నాగ్ లోక్సభ స్థానంలో 10 వేల ఓట్ల తేడాతో నేషనల్ కాన్ఫిరెన్స్ అభ్యర్ధి హస్నైన్ మసూది చేతిలో ఓడిపోయారు.
బర్మింగ్హమ్ వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ టోర్నీ లీగ్ మ్యాచ్లో భారత్ తొలిసారి పరాజయం పాలైంది. అయితే తాజాగా జరుగుతున్న వరల్డ్ కప్లో టీమిండియా తొలి ఓటమిపై జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత జట్టు జెర్సీ రంగు మారడం వల్లే జట్టు ఓటమి పాలైందని ఆమె అన్నారు. తనది మూఢనమ్మకమని అనుకున్నా తాను మాత్రం ఇదే చెబుతానని ముఫ్తీ స్పష్టం చేశారు.
ఐసీసీ నిబంధనల ప్రకారం తలపడుతున్న ఏ రెండు జట్లు ఒకే రంగు జెర్సీలను ధరించకూడదు. ఇంగ్లండ్-భారత జట్ట జెర్సీలు రెండూ నీలమే కావడంతో భారత్ జట్టు జెర్సీని బీసీసీఐ మార్చింది. కాషాయం-నీలం రంగులతో సరికొత్త జెర్సీని తీసుకొచ్చింది. భారత జట్టు ప్రదర్శనపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా అసహనం వ్యక్తంచేశారు. భారత బ్యాటింగ్ ఆసక్తి లేకుండా సాగిందన్నారు. మరింత బాగా ఆడి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
ప్రపంచకప్లో ఇప్పటి వరకు ఓటమి ఎరుగని భారత జట్టుకు మోర్గాన్ సేన కళ్లెం వేసింది. వరుసగా మ్యాచుల్లో అప్రతిహత విజయాలను నమోదు చేసిన కోహ్లీ సేన... ఇంగ్లండ్ ఇచ్చిన 338 పరుగుల భారీ టార్గెట్ ఛేదనలో తడబడింది. అటు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ ను నిలువరించడంలో బౌలింగ్ పరంగా విఫలమవగా, లక్ష్యఛేదనలో బ్యాటింగ్ పరంగానూ టీమిండియా విఫలమైంది. ఫలితంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 306 పరుగులకు పరిమితమైంది. దీంతో ఇంగ్లాండ్ 31 పరుగుల తేడాతో భారత్ ను ఓడించింది.
Published by:
Sulthana Begum Shaik
First published:
July 1, 2019, 8:29 AM IST