ఐపీఎల్ 2022 సీజన్ లీగ్ స్టేజ్ ఆఖరి మ్యాచులో కూడా సన్ రైజర్స్ తుస్సుమన్పించింది. హైదరాబాద్ పై పంజాబ్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. 158 పరుగుల లక్ష్యాన్ని మరో 29 బంతులు మిగిలుండగానే 15.1 ఓవర్లలోనే ఛేజ్ చేసింది పంజాబ్. లివింగ్ స్టోన్ ( 22 బంతుల్లో 49 పరుగులు నాటౌట్ ; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. శిఖర్ ధావన్ (32 బంతుల్లో 39 పరుగులు ; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. ఆరెంజ్ ఆర్మీ బౌలర్లలో ఫజల్హాక్ రెండు వికెట్లు తీయగా.. ఉమ్రాన్, సుచిత్, సుందర్ తలా ఓ వికెట్ దక్కించుకున్నారు. ఈ విజయంతో 14 పాయింట్లతో ఆరో స్థానంతో ఈ సీజన్ ను ముగించింది పంజాబ్. ఇక, ఆరెంజ్ ఆర్మీ ఎనిమిది ఓటములతో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకుంది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ మంచి ఆరంభం అందించారు ఓపెనర్లు. బెయిర్ స్టో దూకుడుగా ఇన్నింగ్స్ ని ఆరంభించాడు. క్లాసీ బౌండరీలతో స్కోరు బోర్డు వేగాన్ని పెంచాడు. అయితే.. దూకుడు మీదున్న బెయిర్ స్టో జోరుకు ఫజల్హాక్ బ్రేకులు వేశాడు.
28 పరుగుల వద్ద పంజాబ్ తొలి వికెట్ కోల్పోయింది. 23 పరుగులు చేసిన బెయిర్స్టో.. ఫజల్హాక్ ఫరూకీ బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత వన్ డౌన్ లో వచ్చిన షారుఖ్ ఖాన్ కాసేపు మెరుపులు మెరిపించాడు. దీంతో.. స్కోరు వేగం పెరిగింది. అయితే.. 10 బంతుల్లో 19 పరుగులు చేసిన షారుఖ్ ఖాన్.. ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్లో ఔటయ్యాడు. దీంతో.. 66 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. ఆ కాసేపటికే 71 పరుగుల వద్ద పంజాబ్ మూడో వికెట్ కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో మయాంక్ (1) అగర్వాల్ సుచిత్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఓ వైపు ఎండ్ లో వికెట్లు పడుతున్నా.. పంజాబ్ బ్యాటర్లు మాత్రం దూకుడుగానే ఆడారు.
ఇక, 32 బంతుల్లో 39 పరుగులు చేసిన గబ్బర్ ఫజల్హాక్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో.. 112 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన జితేష్ శర్మ కూడా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 7 బంతుల్లో 19 పరుగులు చేశాడు. అయితే.. జితేష్ జోరుకు సుచిత్ బ్రేకులు వేశాడు. భారీ షాట్ ఆడబోయిన జితేష్ బౌండరీ మీద క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మరో ఎండ్ లో లివింగ్ స్టోన్ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. దీంతో.. పంజాబ్ సునాయస విజయాన్ని దక్కించుకుంది.
అంతకుముందు హైదరాబాద్ సాధారణ స్కోరు మాత్రమే చేసింది.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (32 బంతుల్లో 43 పరుగులు ; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ ( 19 బంతుల్లో 25 పరుగులు), రొమోరియా షెపర్డ్ (15 బంతుల్లో 26 పరుగులు నాటౌట్ ) మెరుపులు మెరిపించడంతో ఆరెంజ్ ఆర్మీ ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. హర్ ప్రీత్ బ్రార్, ఎల్లీస్ చెరో మూడు వికెట్లతో హైదరాబాద్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, IPL 2022, Punjab kings, Shikhar Dhawan, Sunrisers Hyderabad