ఐపీఎల్ 2022 (IPL 2022) సీజన్ ఆద్యంతం ఆసక్తికరంగా జరుగుతోంది. ప్రతి జట్టు విజయం కోసం హోరాహోరీగా తలపడుతున్నాయ్. అయితే, ఈ సీజన్లో ఓడలు బండ్లు అయ్యాయ్.. బండ్లు ఓడలు అయ్యాయ్. అంటే, ఎప్పుడూ తమ ప్రదర్శనతో దుమ్మురేపే ముంబై ఇండియన్స్ (Mumbai Indians), చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్లు ఈ సారి మాత్రం నిరాశపరుస్తున్నాయ్. ఇక, టైటిల్ ఫేవరేట్లలో ఒకటిగా కన్పించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఈ సీజన్ ను తడబడుతూ ప్రారంభించింది. ఢిల్లీ ఆడిన ఐదు మ్యాచుల్లో కేవలం రెండింట్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 16 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్లో తొలుత బౌలింగ్లోనూ, బ్యాటింగ్లోనూ ఆధిపత్యం ప్రదర్శించిన ఢిల్లీ ఆ తర్వాత కీలక సమయాల్లో తప్పిదాలు చేసి మ్యాచ్ చేజార్చుకుంది.
అయితే, ఆర్సీబీ మ్యాచ్ ఓటమి తర్వాత ఢిల్లీ పేలవ ప్రదర్శనపై హెడ్ కోచ్ రికీ పాంటింగ్ (Ricky Ponting) సీరియస్ అయ్యాడు. ఈ మ్యాచ్ తర్వాత తన అంసతృప్తిని వ్యక్తం చేశాడు. " మేము పూర్తి సామర్థ్యంతో బ్యాటింగ్ చేయలేదు. మిచెల్ మార్ష్కి ఇది తొలి మ్యాచ్. బహుశా అందుకేనేమో మనం ఊహించినంతగా ఆడలేకపోయాడు. మిడిలార్డర్లో రోవ్మన్ పావెల్ కూడా ఇంతవరకు రాణించలేదు. ఇప్పుడు జట్టులో మార్పులు చేర్పులు చేయాల్సిన సమయం ఆసన్నమైంది.
బ్యాట్, బౌలింగ్ విభాగాల్లోనే కాకుండా.. ఫీల్డింగ్ లో కూడా మెరుగపడాల్సిన అవసరం ఉంది. కొన్ని ఓవర్లలో మా బౌలర్లు పూర్తిగా చేతులేత్తేశారు. ఆ ఓవర్లలో మా బౌలర్ల చెత్త బౌలింగ్ కారణంగా మైదానం నలువైపులా పరుగులు వచ్చాయ్. మేం దీన్ని త్వరగా సరిచేయాలి. రాబోయ్ రెండు మ్యాచులు మాకు చాలా కీలకం. ప్రతి విభాగంపై దృష్టిసారించి సరైన జట్టును ఎంచుకోవాలి. ఎంపిక చేసిన 11 మంది ఆటగాళ్లు సత్తా చాటాల్సిందే " అంటూ పాంటింగ్ ఢిల్లీ జట్టు సభ్యుల్ని హెచ్చరించాడు.
ఆర్సీబీతో జరిగిన మ్యాచులో డేవిడ్ వార్నర్ 38 బంతుల్లో 66 పరుగులు ; రిషబ్ పంత్ 17 బంతుల్లో 34 పరుగులు మంచి ప్రదర్శన చేసినప్పటికీ ఢిల్లీ మ్యాచ్ ను గెలవలేకపోయింది. వార్నర్, పంత్లకు ఇతర ఆటగాళ్ల నుంచి మద్దతు లభించలేదు. మార్ష్ 24 బంతుల్లో 14 పరుగులు చేసి ఆ జట్టును నట్టేట ముంచాడు. ఇక, తొలి బంతికే పావెల్ ఔటయ్యాడు. ఈ విండీస్ ఆటగాడు ఈ సీజన్ లో ఇంతవరకు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో, ఈ పేలవ ప్రదర్శన కారణంగా.. పావెల్, మిచెల్ మార్ష్ లపై పాంటింగ్ సీరియస్ గా ఉన్నాడు. దీంతో, వచ్చే మ్యాచుల్లో మార్పులు తప్పవని వార్నింగ్ జారీ చేశాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Delhi Capitals, IPL 2022, Prithvi shaw, Rishabh Pant