IPL 2022: రాహుల్ త్రిపాఠి (Rahul Tripathi) ఎన్నో ఏళ్లుగా అటు ఇండియన్ డొమెస్టిక్, ఇటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. 2012 నుంచి మహారాష్ట్ర తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ అయిన రంజీ టోర్నీలో ఆడుతుండగా.. 2017 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. రంజీల్లో 47 మ్యాచ్ లు ఆడిన అతడు 2,540 పరుగులు చేశాడు. సగటు 33.90గా ఉంది. ఇక ఐపీఎల్ లో గత సీజన్ వరకు కూడా 62 మ్యాచ్ లు ఆడిన అతడు.. 1385 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 93. 2017 నుంచి 2021 వరకు కూడా రాహుల్ త్రిపాఠి కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata knight Riders) తరఫున ఆడగా.. ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో రూ. 8.5 కోట్లకు సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టు సొంతం చేసుకుంది.
ఇక ఈ సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో విఫలమైన రాహుల్ త్రిపాఠి.. అనంతరం జరిగిన నాలుగు మ్యాచ్ ల్లోనూ అదరగొట్టాడు. లక్నోపై 44 (30), చెన్నైపై 39 (15), గుజరాత్ పై 17 (11), కోల్ కతాపై 71 (37)తో మొత్తం 171 పరుగులు సాధించాడు. సగటు చూస్తే 57 ఉండగా... స్ట్రయిక్ రేట్ 178కి పైగా ఉంది. అంటే ఒక పవర్ హిట్టర్ కు ఉండాల్సిన స్ట్రయిక్ రేట్ ను అదే సమయంలో నిలకడైన బ్యాటర్ కు ఉండాల్సిన సగటును రాహుల్ త్రిపాఠి ఈ సీజన్ లో కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు ఈ గణాంకాలను రోహిత్, విరాట్ కోహ్లీలతో సరిపోలిస్తే.. విరాట్ కోహ్లీ ఆడిన ఐదు మ్యాచ్ ల్లో 107 పరుగలు చేశాడు. 26.75 సగటు కాగా.. 132 స్ట్రయిక్ రేట్. ఇక రోహిత్ విషయానికి వస్తే 5 మ్యాచ్ ల్లో 108 పరుగులు చేశాడు. సగటు 21.60గా ఉండగా... స్ట్రయిక్ రేట్ 133.33గా ఉంది.
దీనిని బట్టే తెలుస్తుంది రాహుల్ త్రిపాఠి.. రోహిత్, విరాట్ కోహ్లీ ల కంటే కూడా మెరుగైన ఆటతీరునే కనబరుస్తున్నాడని. ఈ సీజన్ లోనే కాదు గత కొన్ని సీజన్ లుగా రాహుల్ త్రిపాఠి అద్భుత ఆటతీరును కనబరుస్తున్నాడు. ఓపెనర్ గా.. వన్ డౌన్ లో లేకపోతే ఫినిషర్ గా ఏ స్థానంలో అయినా సరే తన బ్యాట్ తో ప్రత్యర్థులపై విరుచుకుపడటంలో త్రిపాఠి ముందుంటాడు. అయినా అతడికి టీమిండియా నుంచి మాత్రం ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కసారి కూడా పిలుపు రాలేదు. గత కొన్నేళ్లుగా (2 నుంచి 3 ఏళ్లు) విరాట్ కోహ్లీ నుంచి సెంచరీ లేదు. అడపాదడపా హాఫ్ సెంచరీలు సాధించినా స్పిన్ ఆడటంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయం గత సౌతాఫ్రికా టూర్ లో స్పష్టంగా కనిపించింది. వన్డే సిరీస్ లో మూడు సార్లు కూడా స్పిన్నర్ కే అవుటయ్యాడు.
గత ఐపీఎల్ లో అద్భుతంగా ఆడిన వెంకటేశ్ అయ్యర్ కు టీమిండియా నుంచి పిలుపు రాగా.. త్రిపాఠికి మాత్రం రాలేదు. ఈ సీజన్ లో వెంకటేశ్ అయ్యర్ బ్యాటింగ్ పూర్తిగా మరిచిపోయాడు. ఒకే ఒక్క మ్యాచ్ లో అర్ధ సెంచరీ చేశాడు. ఈ ఏడాది చివర్లో టి20 ప్రపంచకప్ జరగనుంది. గతేడాది జరిగిన ప్రపంచకప్ లో చేసిన తప్పులు మళ్లీ రిపీట్ చేయకుండా.. ఈసారి మనం కప్పును గెలవాలంటే టీంలో దినేశ్ కార్తీక్, రాహుల్ త్రిపాఠి లాంటి ప్లేయర్స్ అవసరం. అయితే ఈసారైనా బీసీసీఐ రాహుల్ త్రిపాఠిని కరుణిస్తుందో లేదో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bcci, IPL, IPL 2022, Kolkata Knight Riders, Mumbai Indians, Rohit sharma, Sunrisers Hyderabad, Team India, Virat kohli