అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ విక్టరీ కొట్టింది. ఏడు వికెట్ల తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్ ను చిత్తు చేసింది. పృథ్వీ షా సూపర్ ఇన్నింగ్స్ తో సునాయసంగా విజయాన్ని అందుకుంది పంత్ సేన. పృథ్వీ షా 41 బంతుల్లో 82 (11 ఫోర్లు, 3 సిక్సర్లు) పరుగులు చేశాడు. పృథ్వీ షా సూపర్ బ్యాటింగ్ తో మూడు వికెట్లు కోల్పోయి 16.3 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది ఢిల్లీ. కోల్ కతా బౌలర్లలో ప్యాట్ కమిన్స్ కే మూడు వికెట్లు దక్కాయ్.155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆది నుంచే దూకుడు కనబర్చింది. ఇటీవల సూపర్ ఫామ్ లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృథ్వీ షా మరోసారి తన బ్యాట్ పవర్ రుచి చూపించాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే తన ఉద్దేశాన్ని ఘనంగా చాటాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో పృథ్వీ షా వైడ్ సహా మొత్తం 25 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టిన పృథ్వీ షా తాను ఎంత ప్రమాదకర ఆటగాడో చెప్పకనే చెప్పాడు. ఎటు బంతి వేసినా సరే... అలవోకగా బౌండరీ లైన్ కు తరలించాడు. షా దూకుడుతో పవర్ ప్లే ముగిసే సమయానికి 67 పరుగులు చేసింది. ఈ రేర్ ఫీట్ తో ఐపీఎల్ చరిత్రలో అరుదైన రికార్డును సాధించాడు పృథ్వీషా. ఐపీఎల్ చరిత్రలో తొలి ఓవర్ లో ఆరు బంతులకు ఆరు బౌండరీలు సాధించిన తొలి ఆటగాడిగా చరిత్రలో నిలిచాడు. ఈ క్రమంలో ఈ సీజన్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ చేశాడు పృథ్వీషా. 18 బంతుల్లోనే అర్ధశతకాన్ని సాధించాడు. పృథ్వీషా దూకుడుగా శిఖర్ ధావన్ కూడా అండగా నిలిచాడు. వీరిద్దరూ ఫస్ట్ వికెట్ కు 132 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.
అయితే, హాఫ్ సెంచరీ వైపు దూసుకెళుతున్న ధావన్ ను కమిన్స్ బోల్తా కొట్టించాడు. 47 బంతుల్లో 46 పరుగులు చేసిన ధావన్ ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ కాసేపటికే.. పృథ్వీ షా కూడా కమిన్స్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. 8 బంతుల్లో 16 పరుగులు చేసి దూకుడు మీదున్న పంత్ ను కూడా కమిన్స్ పెవిలియన్ చేర్చాడు.ఆఖర్లో స్టొయినిస్ బౌండరీ కొట్టి ఢిల్లీకి విజయాన్ని అందించాడు. పృథ్వీ షా దూకుడుతో మరో 21 బంతులు మిగిలుండగానే టార్గెట్ ను ఛేజ్ చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.అంతకు ముందు, బర్త్డే బాయ్ ఆండ్రీ రస్సెల్(27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 45 నాటౌట్) చెలరేగడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందు కోల్కతా నైట్రైడర్స్ 155 పరుగుల పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. రస్సెల్కు ముందు ఓపెనర్ శుభ్మన్ గిల్ రాణించడంతో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 రన్స్ చేసింది.
మరోసారి కేకేఆర్ టాప్ బ్యాట్స్మెన్ తడబడటంతో ఓదశలో కనీసం 130 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ రస్సెల్ ధాటికి చివరి మూడు ఓవర్లలో 42 రన్స్ రావడంతో కేకేఆర్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. అవేశ్ ఖాన్, స్టోయినిస్ చెరొక వికెట్ తీశారు. ఈ విక్టరీతో పాయింట్స్ టేబుల్ రెండో స్థానానికి చేరుకుంది ఢిల్లీ. ఇక రేపు అహ్మదాబాద్ వేదికగా కోహ్లీసేనతో పంజాబ్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi Capitals, IPL 2021, Kolkata Knight Riders, Prithvi shaw