భారత జట్టు (Team India) న్యూజీలాండ్తో (New Zealand) జరిగిన వరల్డ్ కప్ (World Cup) సెమీస్ ఓడిపోయి రెండేళ్లు పూర్తయ్యాయి. 2019 జులై 9న మాంచెస్టర్ (Manchester) వేదికగా సెమీస్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఎంఎస్ ధోనీ రనౌట్గా వెనుదిరిగి పోతుంటే యావత్ క్రికెట్ అభిమానులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ధోనీ అభిమానుల గుండెలు పగిలిపోయి విషాదంతో నిండిపోయాయి. సరిగ్గా ఆ రోజు ధోనీ అవుటై టీమ్ ఇండియా ఫైనల్ ఆశలను వమ్ము చేయడమే కాకుండా.. అదే అతడి చివరి అంతర్జాతీయ వన్డేగా నిలిచిపోయింది. ఆ తర్వాత ధోనీ (MS Dhoni) అంతర్జాతీయ క్రికెట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక కీలకమైన సెమీఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. కాగా, న్యూజీలాండ్ బ్యాటింగ్ చేసిన తర్వాత వర్షం కురియడంతో తర్వాత రిజర్వ్ డే రోజు భారత జట్టు లక్ష్య ఛేదనకు దిగింది. కోట్లాది మంది టీవీల ముందు, వేలాది మంది ప్రత్యక్షంగా గ్రౌండ్లో మ్యాచ్ వీక్షిస్తున్నారు. స్వల్ప లక్ష్యమే కాబట్టి భారత జట్టు తప్పకుండా విజయం సాధించి ఫైనల్ చేరుకుంటుందని అందరూ ఊహించారు.
అందరూ ఊహించినట్లు జరిగితే ఆ మ్యాచ్లో మజా ఏమి ఉంటుంది. స్వల్ఫ లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు కేవలం 92 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ కలసి భారత జట్టు ఇన్నింగ్స్ పునర్మించారు. వీరిద్దరూ కలసి ఏడో వికెట్కు 116 జోడించారు. రవీంద్ర జడేజా (77), ఎంఎస్ ధోనీ (50) క్రీజులో ఉండటంతో భారత శిబిరంలోనే కాకుండా అభిమానుల్లో కూడా గెలుపుపై ఆశలు రేకెత్తాయి. తప్పకుండా భారత జట్టు గెలుస్తుందని అనుకున్నారు. అయితే స్వల్ప వ్యవధిలో ఇద్దరి వికెట్లు పడ్డాయి. బౌల్ట్ బౌలింగ్లో భారీ షాట్ ఆడిన రవీంద్ర జడేజా (77) విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే మార్టిన్ గుప్తిల్ విసిరిన డైరెక్ట్ త్రోకు మహేంద్ర సింగ్ ధోనీ రనౌట్అయ్యాడు. ఆ రనౌట్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఆన్సైడ్ అంపైర్ రిచర్డ్ కెటిల్బరో చూసిన చూపు, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అందరికీ గుర్తుండిపోతుంది.
కీలకమైన ఆటగాళ్లిద్దరూ అవుటవడంతో భారత జట్టు ఓటమి ఖాయమైపోయింది. టెయిలెండర్లు ఏ మాత్రం పోరాడకుండానే పెవీలియన్ చేరారు. దీంతో భారత జట్టు 221 పరుగులకు ఆలౌట్ అయ్యింది. న్యూజీలాండ్ జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్కు చేరుకున్నది. ఎంఎస్ ధోనీ ఆడిన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఇదే. ఆ తర్వాత ఐపీఎల్ తప్ప వేరే క్రికెట్ ఆడటం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Cricket World Cup 2019, Ms dhoni