INDIA TOUR OF SOUTH AFRICA NEW COVID VARIANT THREATENS INDIA TOUR OF SOUTH AFRICA BCCI CLOSELY WATCHING THE SITUATION JNK
India Tour of South Africa: దక్షిణాఫ్రికా పర్యటనపై నీలి నీడలు.. సిరీస్ జరిగేది అనుమానమే.. కారణం ఇదే..!
టీమ్ ఇండియా.. దక్షిణాఫ్రికా పర్యటనపై నీలి నీడలు (PC: BCCI)
India Tour of South Africa: టీమ్ ఇండియా మరో రెండు వారాల్లో దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరాల్సి ఉన్నది. అక్కడ మూడు వన్డేలు, టెస్టులతో పాటు నాలుగు టీ20 మ్యాచ్లు ఆడనున్నది. అయితే దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండటంతో ఈ పర్యటనపై నీలి నీడలు కమ్ముకున్నాయి.
టీమ్ ఇండియా (Team India) ప్రస్తుతం స్వదేశంలో న్యూజీలాండ్తో (New Zealand) సిరీస్ ఆడుతున్నది. ఇప్పటికే టీ20 సిరీస్ ముగియగా.. ప్రస్తుతం రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగనున్నది. ఈ నెల 29తో తొలి టెస్టు ముగియనుండగా.. డిసెంబర్ 3 నుంచి 7 వరకు ముంబై వాంఖడే స్టేడియంలో రెండో టెస్టు జరుగనున్నది. స్వదేశంలో ఈ టెస్టు సిరీస్ ముగియగానే టీమ్ ఇండియా డిసెంబర్ 8 లేదా 9న సుదీర్ఘమైన దక్షిణాఫ్రికా పర్యటనకు (South Africa Tour) బయలుదేరాల్సి ఉన్నది. భారత జట్టు అక్కడ దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు, మూడు వన్డేలతో పాటు నాలుగు టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో తలపడనున్నది. డిసెంబర్ 17న తొలి టెస్టుతో పర్యటన ప్రారంభం కానుండగా.. జనవరి 26న నాలుగో టీ20తో ఈ సిరీస్ ముగుస్తుంది. ఇప్పుడు ఈ సిరీస్పై నీలి నీడలు కమ్ముకున్నాయి. దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ (Corona New Variant) విజృంభిస్తున్నది. అత్యంత వేగంగా వ్యాపించే, కనీసం వ్యాక్సిన్కు కూడా ఆగని బి.1.1.527 అనే కరోనా వేరియంట్గా దీన్ని గుర్తించారు.
దక్షిణాఫ్రికా పర్యటనలో జొహెన్నెస్బర్గ్, సెంచూరియన్, పార్ల్, కేప్టౌన్ వేదికలుగా మ్యాచ్లు జరుగనున్నాయి. కాగా, ప్రస్తుతం కొత్త వేరియంట్ విస్తృతంగా వ్యాపిస్తున్న ప్రాంతాల్లో జొహెన్నెస్బర్గ్, ప్రిటోరియా నగరాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ రెండు నగరాల్లో పాక్షికంగా లాక్డౌన్ విధించారు. కాగా, దీనిపై బీసీసీఐ (BCCI) అధికారి ఒకరు స్పందించారు. 'ప్రస్తుతం షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవు. డిసెంబర్ 8 లేదా 9న భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరుతుంది. ఇప్పటికే క్రికెట్ సౌత్ ఆఫ్రికాతో బీసీసీఐ టచ్లో ఉన్నది. టీమ్ ఇండియా బయలు దేరే సమయానికి అక్కడి పరిస్థితిలో కాస్త మార్పు వస్తుందని భావిస్తున్నాము. దక్షిణాఫ్రికా క్రికెట్ వర్గాల నుంచి పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే.. ఈ సిరీస్పై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకుంటుందని ' ఆయన అన్నారు.
కాగా, టీమ్ ఇండియా ముంబై నుంచి ప్రత్యేక విమానంలో దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడ మూడు నుంచి నాలుగు రోజులు క్వారంటైన్లో ఉండనున్నది. బయట పరిస్థితులు చాలా తీవ్రంగా ఉండటంతో ఆటగాళ్లు కఠిన క్వారంటైన్లో ఉండాల్సిందే. దక్షిణాఫ్రికాలో పరిస్థితులు చూసి ఇప్పటికే యూరోప్ దేశాల నుంచి విమానాల రాకపోకలను తాత్కలికంగా నిషేధించారు. అయితే బీసీసీఐ మాత్రం ముంబై నుంచి నేరుగా చార్టెడ్ ఫ్లైట్ను జొహెన్నెస్బర్గ్ పంపాలని భావిస్తున్నది. మరోవైపు ఇప్పటికే ఇండియా-ఏ జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్నది. ఆ జట్టు ఆటగాళ్ల ఆరోగ్య భద్రతపై కూడా ఆందోళన వ్యక్తం అవుతున్నది. కాగా ప్రస్తుతానికి ఆ జట్టు అన్ని మ్యాచ్లు ఆడుతున్న ప్రాంతంలో ఇంకా ఎలాంటి వేరియంట్ వ్యాపించలేదని తెలుస్తున్నది. 'ప్రస్తుతం ఇండియా-ఏ ఆటగాళ్లు బ్లూమ్ఫౌంటైన్ లో ఉన్నారు. అక్కడ ఎలాంటి వేరియట్లు లేవని తెలుస్తున్నది. కానీ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నాము. ఒక వేళ అవసరం అయితే అక్కడ ఆటగాళ్లందరినీ బయోబబుల్లోకి వెళ్లమని కోరతాము' అని బీసీసీఐ అధికారి చెప్పారు.
తొలి టెస్టు : డిసెంబర్ 17 -21 (జొహెన్నెస్ బర్గ్) రెండో టెస్టు : డిసెంబర్ 26-30 (సెంచూరియన్) మూడో టెస్టు: జనవరి 3 - 7 (కేప్ టౌన్) తొలి వన్డే : జనవరి 11 (పార్ల్) రెండో వన్డే : జనవరి 14 (కేప్ టౌన్) మూడో వన్డే : జనవరి 16 (కేప్ టౌన్) తొలి టీ20 : జనవరి 19 (కేప్ టౌన్) రెండో టీ20 : జనవరి 21 (కేప్ టౌన్) మూడో టీ20 : జనవరి 23 (పార్ల్) నాలుగో టీ20 : జనవరి 26 (పార్ల్)
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:John Kora
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.