టీమిండియా (Team India) మూడు టెస్టులు, మూడు వన్డేల సిరీస్ కోసం సౌతాఫ్రికాలో (IND vs SA) పర్యటిస్తోంది. విరాట్ కోహ్లి (Virat Kohli) నేతృత్వంలోని భారత జట్టు డిసెంబర్ 26న సెంచూరియన్ టెస్టుతో తన పర్యటనను ప్రారంభించనుంది. టీమిండియా టెస్ట్ జట్టుతో కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇది. 29 ఏళ్లుగా టీమిండియా గెలవని ఏకైక జట్టు సఫారీ టీమే. గత కొన్నాళ్లుగా విదేశీ గడ్డలపై సత్తా చాటుతోంది టీమిండియా. దీంతో ఈ సిరీస్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు, సిరీస్ కు టైం దగ్గరపడుతున్న కొద్ది.. టీమిండియా తుది జట్టుపై అంచనాలు పెరుగుతున్నాయ్. బౌన్సీ పిచ్ లపై ఐదుగురు బౌలర్ల వ్యూహంతో ముందుకు వెళ్తుందా..? లేక అదనపు బ్యాటర్ తో ఫైనల్ కాంబినేషన్ ఉంటుందా..? అన్న విషయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం టీమిండియా సూపర్ స్పోర్ట్స్ పార్క్లోని సెంటర్ వికెట్పై ప్రాక్టీస్ చేస్తోంది. ఈ ప్రాక్టీస్ను ఆధారంగా చేసుకుని ఫైనల్ ఎలెవన్ను ఎంచుకోవాలని విరాట్ అండ్ కో ప్లాన్ చేస్తోంది.
వన్డే కెప్టెన్సీ మార్పుతో భారత క్రికెట్లో రాజుకున్న అగ్గి అనంతరం జరుగుతున్న ఫస్ట్ మ్యాచ్ కావడంతో టీమిండియా ఫైనల్ కాంబినేషన్ ఎలా ఉంటుందనే ఆతృత అందరిలో ఉంది. దీంతో, తుది జట్టుపై ఓ లుక్కేద్దాం.
18 మంది ఆటగాళ్ల నుంచి తుది జట్టును ఎంపిక చేయడం టీమిండియాకు సవాల్ తో కూడుకున్నే పనే. ఇక రోహిత్ శర్మ స్థానంలో న్యూజిలాండ్తో సొంతగడ్డపై జరిగిన రెండు టెస్ట్ల సిరీస్లో సెంచరీతో మెరిసిన మయాంక్ అగర్వాల్ ఆడటం ఖాయమైంది. కేఎల్ రాహుల్తో కలిసి మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. గాయాలై తప్పుకుంటే తప్పా ఈ ఓపెనింగ్ కాంబినేషన్లో ఎలాంటి మార్పు ఉండదు.
గత కొంత కాలంగా దారుణంగా విఫలమవుతున్న చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలకు ఈ సిరీస్ లాస్ట్ చాన్స్ అని చెప్పవచ్చు. ఇక్కడ కూడా అదే వైఫల్యం కొనసాగితే వారి కెరీర్లు దాదాపు ముగిసినట్లే. కెప్టెన్ విరాట్ కోహ్లీ వెనకెసుకొచ్చిన కోచ్ రాహుల్ ద్రవిడ్ వినే పరిస్థితిలో లేడు. పైగా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ అద్భుత ఫామ్లో ఉన్నారు. ఫస్ట్ టెస్ట్లో రహానే, పుజారాల్లో ఒకరికే అవకాశం దక్కనుంది.
పుజారా ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ చేస్తే నాలుగో స్థానంలో కోహ్లీ రానున్నాడు. ఆ తర్వాత రిషభ్ పంత్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. అనుభవానికి ఓటేస్తే రహానేకు అవకాశం దక్కుతుంది. లేదంటే అయ్యరే తుది జట్టులో ఆడనున్నాడు. అయ్యర్కు అవకాశం వస్తే అతను ఐదో ప్లేస్లో పంత్ ఆరో స్థానంలో బ్యాటింగ్కు రానున్నారు.
సౌతాఫ్రికా పిచ్లు పూర్తిగా పేస్కు అనుకూలం కాబట్టి భారత్ నలుగురు పేసర్లు ఒక స్పిన్నర్తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇంగ్లండ్ పర్యటనలోనూ కోహ్లీసేన ఇదే ఫార్మూలాను ఉపయోగించింది. అదే జరిగితే ఏకైక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బరిలోకి దిగుతాడు. జట్టులో జడేజా కూడా లేడు కాబట్టి అశ్విన్కు పోటీ లేదు. నలుగురు పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్ బరిలోకి దిగుతారు. బుమ్రా, సిరాజ్ తర్వాత బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన శార్దూల్ ఠాకూర్కే ప్రాధాన్యత దక్కనుంది.
అయితే ఎక్స్ట్రా బ్యాట్స్మన్ను ఆడించాలనుకుంటే మాత్రం మమహ్మద్ షమీపై వేటు పడే అవకాశం ఉంది. అప్పుడు హనుమ విహారి లేదా రహానే బరిలోకి దిగుతారు. స్పిన్నర్ వద్దనుకొని నలుగురు పేసర్లు, ఓ ఎక్స్ ట్రా బ్యాట్స్మన్ను తీసుకోవాలనుకుంటే మాత్రం అశ్విన్కు నిరాశ తప్పదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.