news18-telugu
Updated: December 1, 2020, 7:08 PM IST
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ(ఫైల్ ఫోటో)
కరోనా బ్రేక్ తర్వాత ఎన్నో అంచనాల మధ్య ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టిన భారత్ క్రికెట్ జట్టు.. చెత్త ఆటతీరుతో సిరీస్ ను కోల్పోయింది. సూపర్ స్టార్లతో కూడిన జట్లు కావడంతో మ్యాచ్లు హోరాహోరీగా సాగుతాయని అంతా భావించారు. కానీ ఇప్పటికైతే టీమిండియా ఆటతీరు అంచనాలకు తగ్గట్టు లేదు. అన్ని విభా గాల్లోనూ విఫలమై వరుసగా రెండు పరాజయాలతో మరో మ్యాచ్ ఉండ గానే సిరీస్ను కోల్పోయింది. దీనికి ముందు కూడా భారత్ ఆట గొప్పగా లేదు. దాంతో విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై తీవ్ర చర్చ జరుగుతుంది. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ఓ ఆటగాడికి టీమిండియాలో చోటు కల్పిస్తున్నప్పుడు.. సారథిగా ఐదు టైటిళ్లను గెలిచిన రోహిత్ను వన్డే కెప్టెన్ చేయడంలో తప్పేముందనే డిమాండ్ తెరపైకి వస్తోంది.
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోనే ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ను 0-3తో.. రెండు టెస్టుల సిరీస్ను 0-2తో భారత్ కోల్పో యింది. ఇప్పుడు ఆసీస్తో రెండింటిని కలిపితే వరుసగా ఏడు ఓట ములు. భారత క్రికెట్ చరిత్రలో వరుసగా ఇన్ని మ్యాచ్లు ఓడడం ఇది రెండోసారి మాత్రమే. ఇలా 18 ఏళ్లక్రితం గంగూలీ కెప్టెన్సీలోనే మాత్రమే జరిగింది. గంగూలీ వరుసగా 10 మ్యాచ్ ల్లో ఓటమి పాలయ్యాడు. 2019లో ధోనీ సహకారాలతో కెప్టెన్గా మెరిసి కోహ్లీ.. ఇప్పుడు అతను లేకపోవడంతో విఫలమవుతున్నాడనే వాదన కూడా తెరపైకి వచ్చింది. విరాట్ కెప్టెన్ అయినా కీలక సమయా ధోనీనే జట్టును ముందుండి నడిపించేవాడు. ఇప్పుడు ఆ సహకారం కొరవడంతో విరాట్ విఫలమవుతున్నాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆసీస్ బ్యాట్స్మెన్ను కట్టడి చేసే విషయంలో కెప్టెన్గా కోహ్లీ పూర్తిగా విఫలమయ్యాడు. మైదానంలో అతను బౌలర్లకు తగిన సూచనలిస్తూ, ఫీల్డింగ్ను మార్చుతూ తగిన వ్యూహాలు రచిస్తున్నట్టు కనిపించడం లేదు. ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలవాల్సిన విరాట్లోనే నిరాశ కన్పిస్తోంది. ఇక తొలి వన్డేలో భారీగా పరుగులు సమర్పించుకున్న పేసర్ నవ్దీప్ సైనీ, స్పిన్నర్ చాహల్ను తప్పిస్తారని అంతా భావించినా అలా జరగలేదు. తిరిగి రెండో మ్యాచ్లోనూ ఈ ఇద్దరి బౌలింగ్ను ఆసీస్ ఆటాడుకుంది. మరో పేసర్ నటరాజన్కు అవకాశం విషయంలో కెప్టెన్గా సరైన నిర్ణయం తీసుకోలేకపోయాడని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. అలాగే ఆరంభంలో ఓపెనర్లను అడ్డుకునేందుకు తమ ప్రధాన బౌలర్లను వాడుకునే విషయంలోనూ కోహ్లీకి స్పష్టత లేకుండా పోతోందంటున్నారు.
దీంతో పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించి..ఐపీఎల్ ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ సారధి రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించాలని కొందరు క్రికెట్ అభిమానులు, హిట్ మ్యాన్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలోనూ క్రికెట్ ఫ్యాన్స్ కోహ్లీతో పాటు టీమిండియా కోచ్ రవిశాస్త్రిని కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. వీరి కాంబినేషన్లో టీమిండియా విజయాలు సాధించలేదని వాదిస్తున్నారు. రోహిత్ కెప్టెన్ గా భారత్ ఆడిన 10 వన్డేల్లో 8 గెలవగా.. 19 టీ20ల్లో 14 నెగ్గింది. ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా ఓ ఆటగాడికి టీమిండియాలో చోటు కల్పిస్తున్నప్పుడు.. సారథిగా ఐదు టైటిళ్లను గెలిచిన రోహిత్ను వన్డే కెప్టెన్ చేయడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నారు ఆయన ఫ్యాన్స్. హిట్ మ్యాన్కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగిస్తే...టీమిండియాకు ఇక తిరుగుండదని, దీన్ని బీసీసీఐ సానుకూలంగా పరిశీలించాలని వారు కోరుతున్నారు.
Published by:
Anil
First published:
December 1, 2020, 7:08 PM IST