టీమిండియాలో కరోనా కలవరాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా.. ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. నిన్న, శ్రీలంకతో రెండో టీ20 ఆరంభం కావడానికి కొన్ని గంటల ముందు కృనాల్ పాండ్యాకు నిర్వహించిన ఆర్టీ-పీసీఆర్ కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ రిపోర్ట్ రావడం వల్ల ఈ మ్యాచ్ను వాయిదా వేసింది శ్రీలంక క్రికెట్ బోర్డు. అతనితో సన్నిహితంగా మెలిగిన ఎనిమిది మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించగా.. నెగెటివ్ రిపోర్ట్ రావడం కొంత ఊపిరి పీల్చుకునే పరిస్థితిని కల్పించినా.. అది అక్కడితో ఆగట్లేదు. కృనాల్ పాండ్యాతో సన్నిహితంగా మెలిగిన తొమ్మిదిమంది క్రికెటర్లను బీసీసీఐ ఐసొలేషన్లోకి పంపించినట్లు తెలుస్తోంది. ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వారంతా ఇక రెండు, మూడో టీ20 మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవచ్చని ఇన్సైడ్ స్పోర్ట్స్ వెబ్సైట్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనికి బీసీసీఐ, శ్రీలంక క్రికెట్ కమిటీ నుంచి ఈ మేరకు సమాచారం అందినట్లు తెలిపింది. ఈ రాత్రికి రెండో టీ20 ఆరంభం కావాల్సి ఉన్న సమయంలో బీసీసీఐ ఎలా రీప్లేస్ చేస్తుందనేది ఆసక్తిగా మారింది.
ఈ తొమ్మిదిమంది క్రికెటర్ల జాబితాలో ఓపెనర్లు పృథ్వీ షా, దేవ్దత్ పడిక్కల్, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్రౌండర్ హార్థిక్ పాండ్యా, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్, ఆఫ్ స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్ ఉన్నట్లు పేర్కొంది. కరోనా వైరస్ బారిన పడిన కృనాల్ పాండ్యాతో ఆయా క్రికెటర్లందరూ సన్నిహితంగా మెలిగినట్లు బీసీసీఐ భావిస్తోందని స్పష్టం చేసింది. కృనాల్కు కరోనా వైరస్ సోకినట్లు తెలిసిన వెంటనే అతనితో కలిసి తిరిగిన ఎనిమిది మందికి శ్రీలంక క్రికెట్ బోర్డు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలను నిర్వహించింది. వారందరికీ నెగెటివ్ రిపోర్టులు వచ్చాయి.
మళ్లీ ఈ ఉదయం కూడా టీమిండియా, శ్రీలంక క్రికెటర్లందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలను నిర్వహించింది. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో తొమ్మిది మంది భారత క్రికెటర్లను ఐసొలేషన్లోకి పంపించాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఇవాల్టి రెండో టీ20 జరిగి తీరుతుందని, ఐసొలేషన్లోకి పంపించిన క్రికెటర్ల స్థానాన్ని భర్తీ చేసుకోవాల్సిన బాధ్యత బీసీసీఐపై ఉన్నట్లు శ్రీలంక క్రికెట్ కమిటీ ప్రతినిధిని ఆ స్పోర్ట్స్ వెబ్సైట్ తన కథనంలో ఉటంకించింది. అయితే, కరోనా వైరస్ బారిన పడిన కృనాల్ పాండ్యా సిరీస్ మొత్తానికీ దూరం అయ్యారు. శ్రీలంక కోవిడ్ ప్రొటోకాల్స్ను అనుగుణంగా అతను ఐసొలేషన్లో ఉంటున్నాడు. అయితే, కఠిన బయోబబుల్ లో కృనాల్ పాండ్యాకు కరోనా వైరస్ ఎలా సోకిందన్నది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. దీనిపై దర్యాప్తు చేపడతామని శ్రీలంక బోర్డు తెలిపినట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona effect, Cricket, Hardik Pandya, India vs srilanka, Prithvi shaw, Shikhar Dhawan, Sports