టీ20 ప్రపంచకప్ లో సెమీస్ దారుణ ప్రదర్శన తర్వాత టీమిండియా (Team India) న్యూజిలాండ్ గడ్డపై టీ20 సిరీస్ ను కైవసం చేసుకుంది. అయితే, మూడు వన్డేల సిరీస్ ను మాత్రం ఓటమితో ప్రారంభించింది. ఫస్ట్ మ్యాచులో 306 పరుగుల భారీ టార్గెట్ ను కూడా కాపాడుకోలేక చేతులేత్తేసింది టీమిండియా దీంతో.. రెండో వన్డే టీమిండియాకు చావోరేవో లాంటిది. ఈ మ్యాచులో గెలిస్తే టీమిండియా కచ్చితంగా సిరీస్ లో నిలుస్తుంది లేకపోతే.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సమర్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.మరోవైపు.. ఆదివారం జరిగే వన్డే మ్యాచ్ సిరీస్ ఫలితంతో పాటు.. ఐసీసీ వన్డే సూపర్ లీగ్ పాయింట్లపైనా ప్రభావం పడనుంది. ఈ మ్యాచులో టీమిండియా గెలిస్తే సిరీస్ రేసులో నిలుస్తుంది. ఒకవేళ ఓడితే మాత్రం సిరీస్ కోల్పోవడంతో పాటు.. సూపర్ లీగ్ లో రెండో స్థానానికి పడిపోయే ప్రమాదముంది.
ప్రస్తుతం భారత్ 19 మ్యాచుల్లో 13 విజయాలు.. 6 ఓటములతో 129 పాయింట్లు సాధించి మొదటి స్ధానంలో ఉంది. కివీస్ 16 మ్యాచుల్లో 12 విజయాలు.. 4 ఓటములతో 120 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్కు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో.. టీమిండియా తుది జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇక, హామిల్టన్ వేదికగా ఆదివారం రెండు జట్ల మధ్య జరిగే టీమిండియా తుది జట్టులో కచ్చితంగా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. బ్యాటర్లు రాణించినా.. బౌలర్ల వైఫల్యం టీమిండియాలో కొట్టచ్చినట్టు కనిపించింది. అలాగే.. ఆరో బౌలింగ్ ఆప్షన్ లేక నానా తంటాలు పడింది టీమిండియా. ఈ దిశగా టీమిండియా తుది జట్టులో మార్పులు జరగనున్నాయి.
ఈ నలుగురిలో ఒకరిపై వేటు..
టీమిండియాలో ఆరో బౌలింగ్ ఆప్షన్ ఉండాలంటే ఓ బ్యాటర్ను పక్కనపెట్టాల్సిన పరిస్థితి. దీపక్ హుడాను జట్టులోకి తీసుకుంటే శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, లో ఒకరు బెంచ్కే పరిమితం కావాలి. తొలి వన్డేలో శ్రేయస్ అద్భుతంగా రాణించాడు. అంతేకాకుండా వన్డే క్రికెట్లో అతను నిలకడగా రాణిస్తున్నాడు. కాబట్టి అతన్ని పక్కనపెట్టే అవకాశం లేదు.
సూర్యకుమార్ యాదవ్ విఫలమైనా.. సూపర్ ఫామ్లో ఉన్న అతన్ని పక్కనపెట్టే సాహసం టీమ్మేనేజ్మెంట్ చేయలేదు. తొలి వన్డేలో సంజూ శాంసన్ అద్భుతంగా ఆడకపోయినా.. అయ్యర్తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ దీపక్ హుడా వంటి బ్యాటింగ్ ఆల్ రౌండర్ కోసం అతన్ని పక్కనపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఓపెనర్లుగా రాణించిన శుభ్మన్ గిల్, శిఖర్ ధావన్ స్థానాలకు కూడా డోకా లేదు. దీపక్ హుడా కోసం పంత్ను తప్పించే సాహసం టీమ్మేనేజ్మెంట్ చేస్తుందో లేదో చూడాలి. ఒకవేళ పంత్ను తప్పిస్తే సంజూ శాంసన్ జట్టులో కొనసాగుతాడు. ఆరో స్థానంలో వాషింగ్టన్ సుందర్ చోటుకు డోకా లేదు. బౌలింగ్లో విఫలమైనా.. బ్యాటింగ్లో అతను సత్తా చాటాడు.
ఇక, ఫస్ట్ మ్యాచులో విఫలమైన చాహల్ స్థానంలో దీపక్ చాహర్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇదే జరిగితే టీమిండియా బ్యాటింగ్ డెప్త్ పెరగనుంది. అయితే.. జట్టులో స్పిన్నర్ కావాలంటే శార్దూల్ ఠాకూర్ స్థానంలో దీపక్ చాహర్ ను ఆడించే అవకాశం ఉంది. యంగ్ పేసర్లు అర్ష్ దీప్, ఉమ్రాన్ మాలిక్ లకు మరో ఛాన్స్ దక్కనుంది.
టీమిండియా తుది జట్టు అంచనా :
శిఖర్ ధావన్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్/దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్/ యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Ind vs Nz, India vs newzealand, Rishabh Pant, Sanju Samson, Shreyas Iyer, Team India