సొంత గడ్డపై తమకు తామే సాటి అని భారత పులులు మరోసారి గర్జించాయి. న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత్ ఘన విజయం సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత్.. కివీస్ పై 372 పరుగుల భారీ తేడాతో గెలుపొందింంది. ఈ మ్యాచ్ లోనే న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ 10వికెట్ల ప్రపంచ రికార్డును సాధించినా, అది జట్టుకు విజయం అందించలేకపోయింది. తొలి టెస్టు డ్రా, రెండో టెస్టులో విజయంతో భారత్ 1-0 తేడాతో సిస్ కైవసం చేసుకుంది. సొంతగడ్డపై టీమిండియాకు ఇది వరుసగా 14వ సిరీస్ కావడం గమనార్హం.
ముంబై వాంఖడే వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్టులో నాలుగో రోజైన సోమవారమే ఫలితం వచ్చేసింది. న్యూజిలాండ్ 140/5 ఓవర్ నైట్ స్కోరుతో ఆట ప్రారంభించగా, కేవలం 27 పరుగులు మాత్రమే జోడించి మిగతా 5వికెట్లను కోల్పోయింది. నాలుగో రోజు ఆట మొదలైన గంటలోపే భారత బౌలర్లు విజృంభిస్తూ కివీస్ ఐదు వికెట్లను నేల కూల్చారు. జయంత్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా, చివరి వికెట్ అశ్విన్ కు దక్కింది. న్యూజిలాండ్ టార్గెట్ 540 పరుగులు కాగా, రెండో ఇన్నింగ్స్ లో కేవలం 167 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో టీమిండియా 372 పరుగుల భారీ తేడాతో విజయం సాధించినట్లయింది.
భారత్ లో న్యూజిలాండ్ పర్యటనలో కాన్పూర్ లో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. చివరిదైన రెండో టెస్టు ముంబైలో జరగ్గా, తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 325 పరుగలకు ఆలౌటైంది. కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు నేలకూల్చి కుంబ్లే రికార్డును సమం చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కేవలం 62 పరుగులకే ఆలౌటైంది. అశ్విన్ కు 4 వికెట్లు దక్కాయి. రెండో ఇన్నింగ్స్ లో స్కోరు 276/7గా ఉన్నప్పుడు భారత్ డిక్లెర్ చేసింది. తద్వారా కివీస్ కు 540 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ కేవలం 167 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్ గెలుపొందింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, Ind vs Nz, India, New Zealand