IND vs NZ 3rd T20 : సిరీస్ డిసైడర్ లో టీమిండియా (Team India) పేసర్లు రెచ్చిపోయారు. మొన్న స్పిన్నర్లు చెలరేగితే.. తాజాగా తమవంతంటూ ఫాస్ట్ బౌలర్లు అదరగొట్టారు. అహ్మదాబాద్ (Ahmedabad) వేదికగా జరిగిన చివరిదైన మూడో టి20లో హార్దిక్ పాండ్యా (Hardik Pandya) నాయకత్వంలోని భారత్ 168 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ (New Zealand)పై ఘనవిజయం సాధించింది. సారథి హార్దిక్ పాండ్యా ఏకంగా 4 వికెట్లతో రెచ్చిపోయాడు. అర్ష్ దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి తలా రెండు వికెట్లు తీశారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టు 12.1 ఓవర్లలో 66 పరుగులకే ఆలౌటైంది. ఇందులో సగం కంటే ఎక్కువ పరుగులను డారిల్ మిచెల్ (25 బంతుల్లో 35; 1 ఫోర్, 3 సిక్సర్లు) చేశాడు. మిచెల్ సాంట్నెర్ 13 పరుగులు చేశాడు. వీరిద్దరు మినహా మిగిలిన ప్లేయర్లు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. పరుగుల పరంగా కివీస్ పై భారత్ కు ఇదే అతిపెద్ద విజయం. ఇక కివీస్ కు ఇది అంతర్జాతీయ టి20ల్లో మూడో అత్యల్ప స్కోరు.
భారీ ఛేదనలో కివీస్ ఏ దశలోనూ లక్ష్యం వైపు సాగలేదు. తొలి ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా ఫిన్ అలెన్ (3)ను అవుట్ చేశాడు. రెండో ఓవర్ బౌలింగ్ చేసిన కాన్వే (1), మార్క్ చాప్ మన్ (0)ను అవుట్ చేసి డబుల్ బ్రేక్ అందించాడు. ఆశలు పెట్టుకున్న గ్లెన్ ఫిలిప్స్ (2), బ్రేస్ వెల్ (8) విఫలం అయ్యారు. డారిల్ మిచెల్ పోరాడటంతో కివీస్ తన అత్యల్ప స్కోరును దాటగలిగింది. లేదంటే 50 లోపే ముగిసేది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 20 ఓవర్లలో 4 వికెట్లకు 244 పరుగులు చేసింది. శుబ్ మన్ గిల్ (63 బంతుల్లో 126 నాటౌట్; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కాడు. అంతర్జాతీయ టి20ల్లో గిల్ కు ఇదే తొలి శతకం. ఓవరాల్ గా భారత్ నుంచి అంతర్జాతీయ టి20ల్లో సెంచరీ చేసిన 7వ ప్లేయర్ గా నిలిచాడు. రోహిత్ శర్మ, సురేశ్ రైనా, రాహుల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీలు గిల్ కంటే ముందు ఈ ఘనతను అందుకున్నారు.
టాస్ గెలిచిన భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఓపెనర్ ఇషాన్ కిషన్ (1) మరోసారి విఫలం అయ్యాడు. అయితే వన్ డౌన్ లో వచ్చిన రాహుల్ త్రిపాఠి (44)తో కలిసి భారత స్కోరు బోర్డును శుబ్ మన్ గిల్ పరిగెత్తించాడు. త్రిపాఠి ఉన్నంత సేపు ధనాధన్ షాట్లు ఆడాడు. అయితే భారీ షాట్ కు ప్రయత్నించి పెవిలియన్ కు చేరాడు. సూర్యకుమార్ యాదవ్ (24) నిరాశ పరిచాడు. ఇక్కడి నుంచి గిల్ ధనాధన్ బ్యాటింగ్ ను షురూ చేశాడు. 35 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన గిల్.. రెండో అర్ధ సెంచరీని చేయడానికి కేవలం 19 బంతులను మాత్రమే తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా (30)తో కలిసి జట్టు స్కోరును 200 మార్కును దాటించాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్ గా గిల్ అవతరించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, Ind vs Nz, Ind vs nz t20 series, India vs newzealand, Shubman Gill, Surya Kumar Yadav, Team India