IND vs NZ 2nd T20 : న్యూజిలాండ్ (New Zealand)తో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను భారత్ (India) సమం చేసింది. లక్నో వేదికగా జరిగిన రెండో టి20లో టీమిండియా (Team India) 6 వికెట్ల తేడాతో నెగ్గింది. 100 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ను న్యూజిలాండ్ బౌలర్లు ఆఖరి వరకు టెన్షన్ కు గురి చేశారు. ఈ లోస్కోరింగ్ థ్రిల్లర్ లో ఓపికగా ఆడిన సూర్యకుమార్ యాదవ్ (31 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్) చివరి వరకు ఉండి విన్నింగ్ షాట్ తో భారత్ ను గెలిపించాడు. స్వల్ప లక్ష్యాన్ని భారత్ 19.5 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 101 పరుగులు చేసి నెగ్గింది. రెండు బంతులకు మూడు పరుగులు చేయాల్సిన తరుణంలో ఫోర్ కొట్టిన సూర్యకుమార్ మరో బంతి మిగిలి ఉండగానే భారత్ ను గట్టెక్కించాడు.
తక్కువ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ కు మరోసారి శుభారంభం లభించలేదు. శుబ్ మన్ గిల్ (11), రాహుల్ త్రిపాఠి (13), ఇషాన్ కిషన్ (19) విఫలం అయ్యారు. వాషింగ్టన్ సుందర్ (10) సూర్యకుమార్ యాదవ్ తో సమన్వయ లోపం కారణంగా రనౌట్ అయ్యాడు. ఇక న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ భారత్ పై ఒత్తడి పెట్టారు. అయితే ఒక ఎండ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ పరిస్థితులకు తగ్గట్లు ఆడుతూ జట్టును ఆదుకున్నాడు. ఆఖర్లో హార్దిక్ పాండ్యా (15 నాటౌట్)తో కలిసి టీమిండియాను గట్టెక్కించాడు.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 99 పరుగులు చేసింది. కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నెర్ (23 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్) టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 2 వికెట్లు తీశాడు. యుజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా తలా ఒక వికెట్ సాధించారు. మ్యాచ్ లో కివీస్ ఒక్క సిక్సర్ కూడా కొట్టలేదంటే భారత బౌలర్లు ఏ రేంజ్ లో బ్యాటర్లను కట్టడి చేశారో తెలుస్తుంది. కేవలం 6 ఫోర్లను మాత్రమే న్యూజిలాండ్ బ్యాటర్లు సాధించారు.
టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ స్లోగా ఉండటంతో స్పిన్నర్లకు సహకరించింది. దాంతో చెలరేగిన భారత స్పిన్నర్లు కివీస్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారు. రెండు ఫోర్లు కొట్టి దూకుడు మీద కనిపించిన ఫిన్ అలెన్ (11)ను యుజువేంద్ర చహల్ పెవిలియన్ కు పంపాడు. కాసేపటికే డెవోన్ కాన్వే (11)ను వాషింగ్టన్ సుందర్ అవుట్ చేశాడు. గ్లెన్ ఫిలిప్స్ (5)ను దీపక్ హుడా బౌల్డ్ చేశాడు. ఇక తొలి టి20 హీరో డారిల్ మిచె ల్ (8)ను కుల్దీప్ అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఈ సమయంలో మార్క్ చాప్ మన్ (14), బ్రేస్ వెల్ (14) కాసేపు భారత బౌలర్లను ప్రతిఘటించారు. వీరు సింగిల్స్ తీస్తూ వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అయితే తొందరపడి మార్క్ చాప్ మన్ రనౌట్ అయ్యాడు. భారీ షాట్ కు ప్రయత్నించి బ్రేస్ వెల్ బౌండరీ లైన్ దగ్గర అవుటయ్యాడు. ఆఖర్లో సాంట్నెర్ సింగిల్స్ కే పరిమితం అయ్యాడు. దాంతో కివీస్ 99 పరుగులకు ముగించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, Ind vs Nz, Ind vs nz t20 series, India vs newzealand, Shubman Gill, Surya Kumar Yadav