IND vs NZ 2nd ODI : స్వదేశంలో మరో వన్డే సిరీస్ ను భారత్ (India) కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ (New Zealand)తో జరుగుతున్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. రాయ్ పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో కివీస్ పై ఘనవిజయం సాధించింది. 109 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 20.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే నష్టపోయి 111 పరుగులు చేసి అలవోక విజయాన్ని అందుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ (50 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకంతో రాణించాడు. విరాట్ కోహ్లీ (8 బంతుల్లో 11; 2 ఫోర్లు) మరోసారి సాంట్నెర్ బౌలింగ్ లో అవుటయ్యాడు. అయితే తొలి వన్డేలో డబుల్ సెంచరీ సాధించిన శుబ్ మన్ గిల్ (53 బంతుల్లో 40 నాటౌట్; 6 ఫోర్లు) మిగిలిన పనిని పూర్తి చేశారు. షిప్లే ఒక వికెట్ సాధించాడు. ఈ విజయంతో సిరీస్ ను 2-0తో భారత్ సొంతం చేసుకుంది.
స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత ఓపెనర్లు రోహిత్, గిల్ లను ఏ దశలోనూ న్యూజిలాండ్ బౌలర్లు ఇబ్బంది పెట్టలేకపోయారు. తొలి బంతి నుంచే అటు రోహిత్, ఇటు శుబ్ మన్ గిల్ లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ సులభంగా బౌండరీలు సాధిస్తూ పరుగులు సాధించారు. ముఖ్యంగా రోహిత్ శర్మ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. అయితే మ్యాచ్ ను ముగించకుండానే ఎల్బీగా వెనుదిరిగాడు. దాంతో 72 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ వెంటనే అవుటైనా మరో ఎండ్ లో ఉన్న గిల్ మిగిలిన పనిని పూర్తి చేశాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ 34.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. మొహమ్మద్ షమీ 3 వికెట్లతో కివీస్ పతనానికి బాటలు వేశాడు. హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ చెరో రెండు వికెట్ల చొప్పున తీశారు. సిరాజ్, కుల్దీప్ యాదవ్, శార్దుల్ ఠాకూర్ లు తలా ఒక వికెట్ తీశారు. కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ (52 బంతుల్లో 36; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు.
రెండో వన్డేలో టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పై పచ్చిక ఎక్కువగా ఉండటంతో పాటు రెండో ఇన్నింగ్స్ సమయంలో డ్యూ వచ్చే అవకాశం ఉండటంతో భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తమ కెప్టెన్ సరైన నిర్ణయమే తీసుకున్నాడని భారత బౌలర్లు నిరూపించారు. తొలి ఓవర్ వేసిన షమీ.. డేంజరస్ ఫిన్ అలెన్ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. కాసేపటికే నికోల్స్ (2)ను సిరాజ్ బోల్తా కొట్టించాడు. 20 బంతులు ఎదుర్కొన్న నికోల్స్ 2 పరుగులు మాత్రమే చేశాడు. డారిల్ మిచెల్ (1) ఇచ్చిన రిటర్న్ క్యాచ్ ను షమీ పట్టేయడంతో కివీస్ 3వ వికెట్ ను కోల్పోయింది. తొలి వన్డే హీరో బ్రేస్ వేల్ (22; 4 ఫోర్లు) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. గ్లెన్ ఫిలిప్స్ తో కలిసి కాసేపు భారత బౌలర్లను ప్రతిఘటించాడు. బ్రేస్ వెల్, ఫిలిప్స్ 6వ వికెట్ కు 41 పరుగులు జోడించారు. అయితే బౌలింగ్ కు వచ్చిన షమీ.. బౌన్సర్ తో బ్రేస్ వెల్ ఆటను ముగించాడు. దాంతో 56వ పరుగు వద్ద న్యూజిలాండ్ 6వ వికెట్ ను కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సాంట్నెర్ (27) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఫిలిప్స్, సాంట్నెర్ లు 7వ వికెట్ కు 47 పరుగులు జోడించారు. అయితే ఇక్కడి నుంచి భారత్ మరోసారి వరుస పెట్టి వికెట్లు తీసి కివీస్ ఆటను ముగించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, Mohammed Shami, Mohammed Siraj, Rohit sharma, Shubman Gill, Virat kohli