IND vs NZ 1st T20 : టి20 ప్రపంచకప్ (T20 World Cup) ముగిసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానుల ఆశలను టీమిండియా (Team India) ఒమ్ము చేసింది. అవమానకర రీతిలో ఇంగ్లండ్ చేతిలో సెమీస్ లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)తో పాటు సీనియర్లు విరాట్ కోహ్లీ (Virat Kohli), కేఎల్ రాహుల్ (KL Rahul) స్వదేశానికి చేరుకున్నారు. అయితే హార్దిక్ పాండ్యా (Hardik Pandya)తో పాటు సూర్యకుమార్ యాదవ్ (SuryaKumar Yadav), భువనేశ్వర్ కుమార్ లు న్యూజిలాండ్ (New Zealand)తో టి20 సిరీస్ కోసం ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్ కు చేరుకున్నారు. ఇక సంజూ సామ్సన్, శుబ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ లతో పాటు మరికొంత మంది యువ ప్లేయర్లు భారత్ నుంచి కివీస్ చేరుకున్నారు. ఈ క్రమంలో మూడు టి20ల సిరీస్ లో భాగంగా తొలి టి20 శుక్రవారం జరగనుంది.
హార్దిక్ కు మంచి అవకాశం
ప్రపంచకప్ సాధిస్తాడని ఏరి కోరి తెచ్చుకున్న రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్ గా టి20 ప్రపంచకప్ లో నిరాశ పరిచాడు. ఈ క్రమంలో మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లు ఉండాలంటూ ఒక వాదన మొదలైంది. టి20 ప్రపంచకప్ 2024లో ఉండటంతో దాని గురించి ఇప్పుడే మాట్లాడితే హాస్యాస్పదమే అవుతుంది. అయితే కెప్టెన్ గా నిరూపించుకునేందుకు హార్దిక్ కు ఇది సరైన వేదిక అనే చెప్పాలి. ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ను ఆడుతున్న తొలి సీజన్ లోనే చాంపియన్ గా నిలిపాడు. ఇక ఐర్లాండ్ తో జరిగిన టి20 సిరీస్ లో కూడా కెప్టెన్ గా రాణించాడు. అయితే ఐపీఎల్ ప్రదర్శనను బట్టి కెప్టెన్ గా 100కు 100 మార్కులు వేయడం మూర్ఖత్వమే అవుతుంది. ఐపీఎల్ లో రాణించి టీమిండియా తరఫున ఫెయిల్ అయిన ప్లేయర్ల జాబితా చాలానే ఉంది. అయితే కెప్టెన్ గా నిరూపించుకునేందుకు హార్దిక్ కు ఇదొక మంచి అవకాశంగా పరిగణించవచ్చు. ఈసారి ఐర్లాండ్ లాంటి చిన్న జట్టుతో కాకుండా న్యూజిలాండ్ లాంటి బలమైన జట్టుతో జరిగే టి20 సిరీస్ లో కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇందులో సక్సెస్ అయితే హార్దిక్ 2024 టి20 ప్రపంచకప్ లో భారత్ ను నడిపించే కెప్టెన్ల రేసులో ఉండే అవకాశం ఉంది.
సంజూ డౌటే!
ఇక న్యూజిలాండ్ తో జరిగే తొలి టి20లో స్టార్ వికెట్ కీపర్ సంజూ సామ్సన్ కు చోటు దక్కేది అనుమానంగానే ఉంది. వికెట్ కీపర్ గా రిషభ్ పంత్ బరిలోకి దిగడం ఖాయం. ఇక ఓపెనర్లుగా ఇషాన్ కిషన్, శుబ్ మన్ గిల్ లకు అవకాశం దక్కే అవకాశం ఉంది. ఆల్ రౌండర్ గా వాషింగ్టన్ సుందర్ చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఇక సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, చహల్ లతో పాటు పేస్ త్రయం (అర్ష్ దీప్, భువనేశ్వర్, హర్షల్ పటేల్) ఉండనే ఉంది. ఈ క్రమంలో సంజూ సామ్సన్ తో పాటు హుడాకు చోటు దక్కే అవకాశం లేదు.
ఇది కూడా చదవండి : ఈ ముగ్గురిపై కన్నేసిన సన్ రైజర్స్.. ఎంతైనా సరే ఖర్చు పెట్టేందుకు సిద్ధం!
టీమిండియా తుది జట్టు (అంచనా)
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, సుందర్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, చహల్, అర్ష్ దీప్ సింగ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, India vs newzealand, Kane Williamson, Rishabh Pant, Sanju Samson, Shreyas Iyer, Team India