IND VS ENG 2021 FORMER ENGLAND CRICKETER NASSER HUSSAIN WARNS JOE ROOT BEFORE FOURTH TEST FOR THIS REASON SRD
Ind Vs Eng : " టీమిండియాతో జర జాగ్రత్త.. ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడకపోతే ఇక అంతే సంగతులు "
Team India
Ind Vs Eng : ఓవల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం విజయ ఉత్సాహంలో ఆతిథ్య జట్టు బరిలోకి దిగుతుండగా.. దెబ్బతిన్న పులిలా గర్జించేందుకు భారత ఆటగాళ్లు సమాయత్తం అవుతున్నారు.
మూడో టెస్ట్ లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా (India Vs England)ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఇన్నింగ్స్ 78 పరుగుల తేడాతో ఇంగ్లాండ్పై (England) ఘోరంగా ఓడిపోయింది. ఐదు టెస్టుల సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. అయితే ఈ ఘోరపరాజయాన్ని మాజీ క్రికెటర్లు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఫస్ట్ టెస్ట్లో విజయాన్ని తృటిలో చేజార్చుకొని.. రెండో టెస్ట్లో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసి ఇంగ్లండ్ గడ్డపై జోరు కనబర్చిన కోహ్లీ సేన (Team India).. మూడో మ్యాచ్ లో చేతులేత్తేసింది. ఇంగ్లండ్ బౌలర్ల ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్కు చేతులెత్తేసిన భారత బ్యాట్స్మెన్ దారుణ ఓటమికి కారణమయ్యారు. ఇప్పుడు మరో ఆసక్తికరపోరుకు రెడీ అవుతున్నాయ్ ఇరు జట్లు. ఓవల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం విజయ ఉత్సాహంలో ఆతిథ్య జట్టు బరిలోకి దిగుతుండగా.. దెబ్బతిన్న పులిలా గర్జించేందుకు భారత ఆటగాళ్లు సమాయత్తం అవుతున్నారు. మరోవైపు, విజయఉత్సాహంలో ఉన్న ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ను ఆ జట్టు మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ నాసర్ హుస్సేన్ (Nasser Hussain) హెచ్చరించాడు. 78 పరుగులకే ఆలౌటై చిత్తుగా ఓడింది కదా? అని టీమిండియాను తక్కువ అంచనా వేయవద్దన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో 36 పరుగులకే ఆలౌటైన ఆ జట్టు.. ఆ తర్వాత ఎలా దుమ్మురేపి సిరీస్ కైవసం చేసుకుందో యావత్ క్రికెట్ ప్రపంచానికి తెలుసన్నాడు. కాబట్టి ఒళ్లు దగ్గర పెట్టుకొని ఆడాలని, ఏ మాత్రం తక్కువ అంచనా వేసినా లైట్ తీసుకున్నా.. సిరీస్ కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. దారుణ పరాజయాల అనంతరం అద్భుత విజయాలందుకోవడం ఆ జట్టుకు అలవాటేనని గుర్తు చేశాడు.
ది టెలిగ్రాఫ్ దినపత్రికకు రాసిన కాలమ్లో నాజర్ హుస్సేన్.. ఇంగ్లండ్ టీమ్కు వార్నింగ్ ఇచ్చాడు. కోహ్లీసేనను ఏ మాత్రం లైట్ తీసుకోవద్దన్నాడు. ఆస్ట్రేలియా పర్యటన ఫలితాన్ని ప్రస్తావిస్తూ మరి జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ.. అతని బ్యాటింగ్ టెక్నిక్లో లోపం ఉందన్నాడు. అలాగే వదిలేయాల్సిన బంతులను ఆడుతున్నాడని చెప్పుకొచ్చాడు. స్వింగ్ బౌలింగ్ను ఎదుర్కోవడం భారత్కు ఇక కష్టమే అని తెలిపాడు.
Nasser Hussain
అయితే, నాలుగో టెస్ట్ కు ముందు ఓవల్ మైదానంలోని రికార్డులు భారత జట్టును కలవరపెడుతున్నాయి. ఎంతలా అంటే గత 50 ఏళ్లుగా టీమిండియా ఈ మైదానంలో ఒక్క విజయం సాధించలేదు. ఇక గత మూడు పర్యటనల్లో(2011, 2014, 2018) అయితే ఘోర పరాజయం చవి చూసింది. 2011, 2014 పర్యటనల్లో ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. ఓవల్లో భారత్ చివరి సారిగా 1971లో గెలిచింది. అజిత్ వాడేకర్ సారథ్యంలోని భారత జట్టు ఆతిథ్య జట్టును 4 వికెట్ల తేడాతో ఓడించింది. అదే ఈ మైదానంలో భారత్ అందుకున్న చివరి విజయం.
దీంతో, ఈ మైదానంలో ఉన్న చెత్త రికార్డును చెరిపేసి.. సిరీస్ లో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని కోహ్లీసేన భావిస్తోంది. మరోవైపు, మిగతా రెండు టెస్టుల్లో రొటేషన్ పాలసీ గురించి ఆలోచిస్తామని కోహ్లీ (Virat Kohli) చెప్పుకొచ్చాడు. ఈ మాటలను బట్టి నాలుగో టెస్ట్ లో టీమిండియాలో సమూల మార్పులు ఉంటాయని హింట్ ఇచ్చాడు. దీంతో సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభం అయ్యే నాలుగో టెస్టులో రెండు మార్పులతో కోహ్లీసేన బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.