టీ20 ప్రపంచకప్ 2022 సెమీస్ లో దారుణ నిష్క్రమణ తర్వాత ఇప్పుడు వన్డే ప్రపంచకప్ పై దృష్టి సారించింది టీమిండియా. 2023 సంవత్సరంలో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ మెగాటోర్నీకి దాదాపు 11 నెలల సమయం ఉంది. దీంతో.. వన్డేలపై ఫోకస్ పెట్టింది భారత జట్టు. ఇక, న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా(Team India) ఇప్పుడు మరో పర్యటనకు రెడీ అయింది. బంగ్లాదేశ్ టూర్ (India Tour Of Bangladesh) కి సిద్ధమైంది. ఆదివారం జరిగే తొలి వన్డేతో భారత్.. బంగ్లాదేశ్ పర్యటనను మొదలుపెట్టనుంది. మూడు వన్డేల సిరీస్లో మూడు మ్యాచ్లు ఢాకాలోని షేర్ ఈ బంగ్లా నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి.
కివీస్ పర్యటనలో కుర్రాళ్లు ఎక్కువ మంది బరిలోకి దిగారు. కానీ, ఇప్పుడు పూర్తి బలగంతో బరిలోకి దిగనుంది టీమిండియా. రోహిత్ శర్మ, కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి స్టార్ ప్లేయర్లు బరిలోకి దిగనుండటంతో ఈ సిరీస్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక, మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ ఆదివారం జరగనుంది. దీంతో.. ఈ మ్యాచులో బరిలోకి దిగే టీమిండియా తుది జట్టుపై అందరి దృష్టి నెలకొంది. తుది జట్టులో చోటు ఎవరు దక్కించుకుంటారో ఓ లుక్కేద్దాం.
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ బరిలోకి దిగనున్నారు. వీరిద్దరికి వన్డే క్రికెట్ లో మంచి రికార్డు ఉంది. అలాగే, టీమిండియా బెస్ట్ ఓపెనింగ్ పెయిర్లలో రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ జోడి కూడా ఉంది. అదిగాక లెఫ్ట్, రైట్ హ్యాంట్ కాంబినేషన్ కూడా వర్కౌట్ అవుతుంది. అయితే.. వీరిద్దరిలో ఎవరు దూకుడుగా ఆడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. గతేడాదిగా పవర్ ప్లే లో టీమిండియా రికార్డు అంతగా బాగా లేదు. ఇక, మిడిలార్డర్ లో తీవ్ర పోటీ నెలకొంది.
విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మిడిలార్డర్ లో చోటు దక్కించుకోవడం ఖాయం. ఇక, వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ కి ఛాన్స్ దక్కనుంది. కోహ్లీ, రాహుల్ సత్తా చాటితే టీమిండియాకు తిరుగుండదు. శ్రేయస్ అయ్యర్ న్యూజిలాండ్ సిరీస్ లో సత్తా చాటాడు. అయితే.. శ్రేయస్ అయ్యర్ కి తుది జట్టులో చోటు దక్కడం అనుమానంగా ఉంది. ఆరు బౌలింగ్ ఆప్షన్లతో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.
ఇక, ఆల్ రౌండర్లుగా వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ తుది జట్టులో చోటు దక్కించుకునే ఛాన్స్ ఉంది. వీరిద్దరూ స్పిన్ విభాగంలో కీ రోల్ ప్లే చేయనున్నారు. అలాగే.. బ్యాటింగ్ లో కూడా సత్తా చాటగలరు. ఇక, మహ్మద్ షమీ గాయంతో వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. దీంతో.. సిరాజ్ కీ రోల్ ప్లే చేయనున్నాడు. శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్ లు పేస్ బాధ్యతలు మోసే ఛాన్స్ ఉంది. ఇక, శార్దూల్, దీపక్ చాహర్ లు బ్యాటింగ్ లో కూడా రాణించగలరు. దీంతో.. ఆరు బౌలింగ్ ఆప్షన్ లతో టీమిండియా బరిలోకి దిగే అవకాశం కచ్చితంగా కన్పిస్తుంది.
టీమిండియా తుది జట్టు అంచనా :
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, India vs bangladesh, KL Rahul, Rishabh Pant, Rohit sharma, Shreyas Iyer, Team India, Virat kohli