IND vs AUS 2nd Test : భారత్ (India) తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా (Australia) దూకుడు కనబరుస్తుంది. రెండో రోజు పై చేయి సాధించిన ఆస్ట్రేలియా ప్రస్తుతం భారత్ పై లీడ్ లో కొనసాగుతుంది. రెండో రోజు చివరి సెషన్ లో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్.. శనివారం ఆట ముగిసే సమయానికి 12 ఓవర్లలో వికెట్ నష్టానికి 62 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (40 బంతుల్లో 39 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్), మార్నస్ లబుషేన్ (19 బంతుల్లో 16 బ్యాటింగ్; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. ఉస్మాన్ ఖవాజ (6) అవుటయ్యాడు. రవీంద్ర జడేజా ఒక వికెట్ ను సాధించాడు. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా ఎదురు దాడికి దిగడం విశేషం. మరో మూడు రోజుల ఆట మిగిలి ఉండటంతో విజయావకాశాలు ఇరు జట్లకు సమానంగా ఉన్నాయి.
అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 21/0తో బ్యాటింగ్ కు దిగిన భారత్ 83.3 ఓవర్లలో 262 పరుగులకు ఆలౌటైంది. అక్షర్ పటేల్ (115 బంతుల్లో 74; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ శతకంతో రాణించాడు. రవిచంద్రన్ అశ్విన్ (71 బంతుల్లో 37; 5 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. విరాట్ కోహ్లీ (44), కెప్టెన్ రోహిత్ శర్మ (32) రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్ 5 వికెట్లు తీశాడు. మర్ఫీ, మ్యాథ్యూ కునెమన్ లకు చెరో రెండు వికెట్లు లభించాయి. మరొక వికెట్ ను ప్యాట్ కమిన్స్ తీశాడు. ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆసీస్ కు ఒక్క పరుగు ఆధిక్యం లభించింది.
21/0తో బ్యాటింగ్ కు దిగిన భారత్ ను నాథన్ లయన్ దెబ్బ తీశాడు. కేఎల్ రాహుల్ తన పూర్ ఫామ్ ను కంటిన్యూ చేశాడు. ఇబ్బంది పడుతూ బ్యాటింగ్ చేసిన కేఎల్ రహుల్ (17) లయన్ బౌలింగ్ లో ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం 100వ టెస్టు ఆడుతున్న పుజారా (0) కూడా లయన్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ఎండ్ లో నిలకడగా బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ శర్మ (32) కూడా లయన్ బౌలింగ్ లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తక్కువ బౌన్స్ తో వచ్చిన బంతి రోహిత్ ను బోల్తా కొట్టిస్తూ వికెట్లను గిరాటేసింది. దాంతో హిట్ మ్యాన్ నిరాశగా పెవిలియన్ కు చేరుకున్నాడు. కాసేపటికే హ్యాండ్స్ కాంబ్ పట్టిన అద్భుత క్యాచ్ కు శ్రేయస్ అయ్యర్ (4) అవుటయ్యాడు.
కాపాడిన అక్షర్, అశ్విన్
ఈ దశలో కోహ్లీ, జడేజా భారత్ ను ఆదుకున్నారు. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు సాధించారు. 5వ వికెట్ కు 59 పరుగులు జోడించారు. అయితే లంచ్ అనంతరం జడేజాను మర్ఫీ అవుట్ చేశాడు. కాసేపటికే కోహ్లీ కూడా అవుటయ్యాడు. తనకు దక్కిన గొప్ప అవకాశాన్ని తెలుగు క్రికెటర్ భరత్ నేలపాలు చేసుకున్నాడు. లేని షాట్ కు ప్రయత్నించి క్యాచ్ అవుటయ్యాడు. దాంతో భారత్ 139 పరుగుల వద్ద 7వ వికెట్ ను కోల్పోయింది. అయితే ఈ దశలో జత కలిసిన అక్షర్ పటేల్, అశ్విన్ లు మరో వికెట్ పడకుండా టీ విరామానికి వెళ్లారు. టీ విరామం అనంతరం అక్షర్ పటేల్ వేగంగా పరుగులు సాధించాడు. బౌండరీలు బాదాడు ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. 8వ వికెట్ కు అత్యంత విలువైన 114 పరుగులు జోడించారు. అయితే అశ్విన్ అవుటయ్యాక.. అక్షర్ పటేల్ ఎంతో సేపు నిలువలేదు. ఆఖరి వికెట్ గా షమీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో భారత తొలి ఇన్నింగ్స్ కు తెర పడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Axar Patel, IND vs AUS, India vs australia, Ravichandran Ashwin, Ravindra Jadeja, Virat kohli