IND A vs BAN A : బంగ్లాదేశ్ ‘ఎ’ (Bangladesh A)తో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టు మ్యాచ్ లో భారత ‘ఎ’ (India A) జట్టు ఓపెనర్లు చెలరేగిపోయారు. యశస్వి జైస్వాల్ (226 బంతుల్లో 145; 20 ఫోర్లు, 1 సిక్స్), అభిమన్యు ఈశ్వరన్ (255 బంతుల్లో 142; 11 ఫోర్లు, 1 సిక్స్) బంగ్లాదేశ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 283 పరుగులు జోడించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 117 ఓవర్లలో 5 వికెట్లకు 404 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 292 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. ప్రస్తుతం తిలక్ వర్మ (26 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్), ఉపేంద్ర యాదవ్ (27 బ్యాటింగ్; 1 ఫోర్, 1 సిక్స్) క్రీజులో ఉన్నారు. బంగ్లా బౌలర్లతో తైజు ఇస్లామ్ 3 వికెట్లు.. ఖలీద్ అహ్మద్ 2 వికెట్లు తీశాడు.
ఓవర్ నైట్ స్కోరు 120/0తో భారత్ రెండో రోజు ఆటను కొనసాగించింది. బలహీనమైన బంగ్లాదేశ్ బౌలింగ్ ను అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్ లు చీల్చి చెండాడారు. ఏ మాత్రం బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో వీరిద్దరూ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే తైజుల్ ఇస్లామ్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. యశిస్వి జైస్వాల్ ను అవుట్ చేశాడు. యశ్ దుల్ (20) ఎక్కువ సేపు నిలబడలేదు. ఆ తర్వాత అభిమన్యు ఈశ్వరన్ కూడా పెవిలియన్ కు చేరాడు. సర్ఫరాజ్ (27), జయంత్ యాదవ్ (10)లు పెద్దగా పరుగులు చేయలేదు. అయితే హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ నిలకడగా ఆడుతున్నాడు. ప్రస్తుతం ఉపేంద్ర యాదవ్ తో కలిసి తిలక్ వర్మ క్రీజులో ఉన్నాడు.
తొలి రోజు టీమిండియా బౌలర్లు రెచ్చిపోయారు. సౌరభ్ కుమార్ 4 వికెట్లతో చెలరేగితే నవ్ దీప్ సైనీ 3 వికెట్లతో రఫ్పాడించాడు. దాంతో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు కేవల 45 ఓవర్లలోనే 112 పరుగులకు ఆలౌటైంది. మొసదిక్ హుస్సేన్ (88 బంతుల్లో 63; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒంటిరి పోరాటం చేశాడు. మొసదిక్ ఆడకపోయి ఉంటే బంగ్లాదేశ్ 50 పరుగుల లోపే ఆలౌటై ఉండేది. బంగ్లాదేశ్ జట్టులో ముగ్గురు బ్యాటర్లు మినహా మిగిలిన 8 మంది సింగిల్ డిజిట్ కే పెవిలియన్ కు చేరడం గమనార్హం. ఈ జట్టులో ఆడిన చాలా మంది డిసెంబర్ నెలలో భారత్ తో జరిగే టెస్టు సిరీస్ లో పాల్గొననున్నారు.
ఇది కూడా చదవండి : టీమిండియాలో మరో సంజూ సామ్సన్.. ట్యాలెంట్ ఉన్నా అవకాశాలు నిల్!
టాస్ నెగ్గిన భారత కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ బంగ్లాదేశ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. రెండో ఓవర్ లో ఓపెనర్ జాయ్ (1) వికెట్ ను తీసిన సైనీ భారత్ కు శుభారంభం చేశాడు. కాసేపటికి జకీర్ (0)ను ముఖేశ్ కుమార్ పెవిలియన్ కు చేర్చాడు. ఇక ఇక్కడి నుంచి వచ్చిన బ్యాటర్ వచ్చినట్లు పెవలియన్ కు చేరారు. అయితే మొసదిక్ కాసేపు ఒంటరి పోరాటం చేశాడు. అయితే బౌలింగ్ కు వచ్చిన సౌరభ్ కుమార్ మొసదిక్ తో పాటు మరో ముగ్గురిని అవుట్ చేసి బంగ్లాదేశ్ తక్కువ పరుగులకే ఆలౌట్ అయ్యేలా సాయపడ్డాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bangladesh, IND vs BAN, India vs bangladesh, Team India